ఇంటర్‌తో త్రివిధ దళాల్లోకి..




ఎన్‌డీఏ & ఎన్‌ఏ

ఉచిత విద్య.. ఉన్నతస్థాయి ఉద్యోగం.. సమాజంలో గౌరవం.. అన్నింటికీ మించి దేశ రక్షణలో భాగస్వామ్యం. ఇంత చక్కటి అవకాశం ఇంటర్మీడియట్‌ అభ్యర్థులకు ప్రత్యేకం. యూపీఎస్సీ ఏటా నిర్వహించే ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ పరీక్ష నిర్వహణకు ప్రకటన వెలువడింది. పరీక్షల్లో ప్రతిభను ప్రదర్శిస్తే త్రివిధ దళాల్లోకి నేరుగా చేరిపోవచ్చు.

ర క్షణ రంగంలో ఉద్యోగాలను అందించేందుకు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) అండ్‌ నేవల్‌ అకాడమీ (ఎన్‌ఏ) ఆహ్వానం పలుకుతున్నాయి. ఇందుకోసం యూపీఎస్సీ పరీక్ష నిర్వహిస్తుంది


మెరిట్‌ సాధిస్తే ఎన్‌డీఏ, పుణె; ఎన్‌ఏ ఎజిమాలలో చదువుతోపాటు శిక్షణ, వసతి, భోజనం అన్నీ ఉచితంగా అందిస్తారు. అనంతరం అభ్యర్థి ఎంపికైన విభాగంలో ప్రత్యేక ట్రెయినింగ్‌ ఇస్తారు. ఆ తర్వాత లెఫ్టినెంట్‌/ సబ్‌ లెఫ్టినెంట్‌ / ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఇంటర్‌ విద్యార్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.




ఎంపిక ఇలా.. 
రాత పరీక్ష (ఆబ్జెక్టివ్‌ తరహా), ఇంటెలిజెన్స్‌ - పర్సనాలిటీ టెస్ట్‌ల్లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 900 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌ వ్యవధి రెండున్నర గంటలు. పేపర్‌-1లో 300 మార్కులకు మ్యాథ్స్‌ నుంచి, పేపర్‌-2లో 600 మార్కులకు జనరల్‌ ఎబిలిటీ విభాగం నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఇంగ్లిష్‌కు 200, జనరల్‌ నాలెడ్జ్‌కి 400 మార్కులు కేటాయించారు. ప్రశ్నలన్నీ ఇంటర్‌ సిలబస్‌ నుంచే వస్తాయి. రుణాత్మక మార్కులు ఉన్నాయి. రాత పరీక్షలో అర్హత పొందిన వారికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో యూపీఎస్సీ ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తుంది. ఈ విభాగానికి 900 మార్కులు కేటాయించారు. ఇందులో భాగంగా గ్రూప్‌ టెస్టులు, గ్రూప్‌ డిస్కషన్‌, గ్రూప్‌ ప్లానింగ్‌, అవుట్‌డోర్‌ గ్రూప్‌ టాస్క్‌లు ఉంటాయి. స్టేజ్‌-1లో అర్హత సాధించినవారినే స్టేజ్‌-2కి అనుమతిస్తారు. రాత పరీక్ష, సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. వైద్య పరీక్షలు, అభ్యర్థి ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకుని మెరిట్‌ ఆధారంగా సంబంధిత విభాగాలకు ఎంపిక చేస్తారు.

అన్నీ ఉచితం 
అన్ని దశలూ దాటి కోర్సులో చేరినవారు మూడేళ్లపాటు పుణేలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో బీఏ, బీఎస్సీ కోర్సులు చదువుతారు. నేవల్‌ అకాడమీకి ఎంపికైనవారు నాలుగేళ్లపాటు కేరళలోని ఎజిమాలలో బీటెక్‌ విద్యను అభ్యసిస్తారు. రెండు చోట్లా విద్యార్థులకు అన్ని సౌకర్యాలను ఉచితంగా సమకూరుస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జేఎన్‌యూ, న్యూదిల్లీ డిగ్రీలను ప్రదానం చేస్తుంది. ఆర్మీని ఎంచుకున్నవారు బీఎస్సీ/ బీఎస్సీ (కంప్యూటర్‌)/ బీఏ కోర్సులు; నేవీ, నావెల్‌ అకాడమీ (10+2 క్యాడెట్‌ ఎంట్రీ ) అభ్యర్థులు బీటెక్‌ విద్య అభ్యసిస్తారు. ఎయిర్‌ ఫోర్స్‌కు ఎంపికైనవారు బీటెక్‌ లేదా బీఎస్సీ కోర్సులను ఎంచుకోవచ్చు. ఎన్‌డీఏలో మూడేళ్ల శిక్షణ, చదువు అనంతరం ఆర్మీ క్యాడెట్లను డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీకి; నేవల్‌ క్యాడెట్లను ఎజిమాలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీకి; ఎయిర్‌ఫోర్స్‌ క్యాడెట్లను హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీకి శిక్షణ కోసం పంపుతారు. అభ్యర్థి ఎంపికైన విభాగాన్ని బట్టి ఈ శిక్షణ ఏడాది నుంచి 18 నెలల వరకు ఉంటుంది. ఈ సమయంలో స్టైపెండ్‌ రూ.56,100 (మూల వేతనం) చెల్లిస్తారు. శిక్షణ అనంతరం ఉద్యోగంలోకి తీసుకుంటారు. విధుల్లో చేరినవారు మొదటి నెల నుంచే సుమారు రూ.లక్ష వేతనంగా పొందవచ్చు. వివిధ ప్రోత్సాహకాలు లభిస్తాయి. తక్కువ వ్యవధిలోనే పదోన్నతులు అందుకోవచ్చు.

అర్హతలు 
ఆర్మీ వింగ్‌ (ఎన్‌డీఏ)కు ఏదైనా గ్రూప్‌తో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్‌ ఫోర్స్‌, నేవల్‌ వింగ్స్‌ (ఎన్‌డీఏ), 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ (ఇండియన్‌ నేవల్‌ అకాడమీ)కు దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. రెండో సంవత్సరం కోర్సులు చదువుతున్నవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు. బాలురు మాత్రమే అర్హులు. 
వయసు: జనవరి 2, 2001 తర్వాత; జనవరి 1, 2004 కంటే ముందు జన్మించినవారు అర్హులు. 
శారీరక ప్రమాణాలు: అభ్యర్థుల కనీస ఎత్తు 157 సెం.మీ. ఉండాలి. ఎయిర్‌ఫోర్స్‌కు 162.5సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగిన బరువు అవసరం. 
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: సెప్టెంబరు 3 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు. 
మొత్తం ఖాళీలు: 415 వీటిలో ఎన్‌డీఏ 370 నేవల్‌ అకాడమీ 10+2 క్యాడెట్‌ ఎంట్రీ 45 ఉన్నాయి. ఎన్‌డీఏలో ఆర్మీ 208, నేవీ 42, ఎయిర్‌ ఫోర్స్‌ 120 ఖాళీలు ఉన్నాయి. 
పరీక్ష తేదీ: నవంబరు 17, 2019 
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి 
వెబ్‌సైట్‌: www.upsc.gov.in

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇంటర్‌తో త్రివిధ దళాల్లోకి.."

Post a Comment