'చంద్రయాన్‌-2'కు ముందే.. జాబిల్లిపైకి భారత మట్టి

ఇంటర్నెట్‌డెస్క్‌ : భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'చంద్రయాన్‌-2' తన లక్ష్యం దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇది సెప్టెంబర్‌ 7న చంద్రుడిపై దిగి పరిశోధనలు చేపట్టనుంది. అయితే దీనికంటే ముందే భారత మట్టి, పలు జీవ నమూనాలు చంద్రుడిపైకి చేరుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో, ఎలాగో ఓసారి చూద్దామా..!




'చిన్న దేశం.. పెద్ద కలలు' అంటూ ఇజ్రాయెల్‌కు చెందిన 'బేరేషీట్‌' లూనార్‌ ల్యాండర్‌.. చివరి నిమిషంలో విఫలమై చంద్రుడి ఉపరితలంపై కూలిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 21న స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ద్వారా రోదసిలోకి దూసుకెళ్లిన బేరేషీట్‌


నెల రోజుల అనంతరం సాంకేతిక సమస్య తలెత్తి కుప్పకూలింది. అయితే బేరేషీట్‌కు సంబంధించి అన్ని ధ్వంసమైనప్పటికీ.. దాని ద్వారా అక్కడికి పంపిన సూక్ష్మమైన లూనార్‌ లైబ్రరీ మాత్రం చెక్కుచెదరకుండా ఉంది. భారత్‌కు సంబంధించిన కొన్ని జీవ నమూనాలను దీని ద్వారా పంపడం విశేషం.

మానవజాతికి ముప్పువాటిల్లితే.. 
30 మిలియన్‌ పేజీలు ఉన్న ఈ లూనార్‌ లైబ్రరీలో మానవజాతికి సంబంధించిన సమస్త సమాచారాన్ని పొందుపరిచారు. భూమిపై ఉన్న సంస్కృతులు, దేశాలు, భాషలు, సమయాలు ఇలా.. అన్నీ ఇందులో ఉన్నాయి. భూమిపై ఏదైనా విపత్తు సంభవించి మానవజాతికి ముప్పు వాటిల్లితే.. మనకు సంబంధించిన సమాచారాన్ని ఇతరులు తెలుసుకునే ఉద్దేశంతో మానవజాతి బ్యాకప్‌ అంటూ ఈ లైబ్రరీని రూపొందించారు.

వంద గ్రాముల నానో డివైజ్‌లో.. 
మానవజాతికి సంబంధించిన సమస్త సమాచారాన్నంతా వంద గ్రాముల నానో టెక్నాలజీ డివైజ్‌లో అమెరికాకు చెందిన ఆర్క్‌ మిషన్‌ ఫౌండేషన్‌ అనే సంస్థ పొందుపరిచి రూపొందించింది. దీన్ని బేరేషీట్‌ ద్వారా చంద్రుడిపైకి పంపించింది. అయితే బేరేషీట్‌ ధ్వంసం అయినప్పటికీ.. ఈ లూనార్‌ లైబ్రరీ చెక్కుచెదరకుండా ఉందని.. నాసా అందించిన చిత్రాలను విశ్లేషించి ఈ విషయాన్ని ధ్రువీకరించామని ఆర్క్‌ మిషన్‌ ఫౌండేషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది


బోధి వృక్షం ఆకులు, మట్టి.. 
భారత్‌లోని గయా నుంచి సేకరించిన బోధి వృక్షం ఆకులు, కొంత మట్టితో పాటు భారత సంగీతం, భాషలకు సంబంధించిన సమాచారం ఈ లైబ్రరీ ద్వారా చంద్రుడిపైకి చేరిందని ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు నోవా స్పివాక్‌ తెలిపారు. 'మాకు బిహార్‌లోని మహాబోధి స్తూప నిర్వాహకులు బోధి వృక్షం ఆకులు, కొంత మట్టిని ఇచ్చారు. వీటిని మేం చైనా, భూటాన్‌, మయన్మార్‌, వియత్నాం, నేపాల్‌, టిబెట్‌ల నుంచి సేకరించిన వస్తువులతో కలిపాం' అని స్పివాక్‌ వెల్లడించారు.

దీన్ని బట్టి చూస్తే 'చంద్రయాన్‌-2' కంటే ముందే భారత్‌కు చెందిన వస్తువులు చంద్రుడిపైకి చేరినట్లయ్యాయి. ఈ సూక్ష్మ లైబ్రరీలో నాలుగు లేయర్లు ఉంటాయి. వీటిలోని మొదటి లేయర్‌ను భూతద్దం ఉపయోగించి చదవొచ్చు. అయితే మిగతా మూడు లేయర్లను చదవాలంటే మాత్రం శక్తిమంతమైన మైక్రోస్కోప్‌ అవసరం

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "'చంద్రయాన్‌-2'కు ముందే.. జాబిల్లిపైకి భారత మట్టి"

Post a Comment