రెపోరేటుకు అనుగుణంగా గృహ, వాహన రుణాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి




దిల్లీ: ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. సూపర్‌ రిచ్‌ సర్‌ఛార్జి నుంచి విదేశీ సంస్థాగత మదుపరులకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై రెపోరేటుకు అనుగుణంగానే వడ్డీ, వాహన రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమందగమనం ఉందని పేర్కొన్నారు. సంపద సృష్టించేవాళ్లను ప్రోత్సహిస్తామన్నారు. శుక్రవారం సాయంత్రం ఆమె దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు


2014 నుంచి సంస్కరణలే అజెండాగా పనిచేస్తున్నామని, గత ఐదేళ్లలో ఎన్నో వాణిజ్య సంస్కరణల్ని తీసుకొచ్చామని వెల్లడించారు. పన్ను విధానాల్లోనూ సంస్కరణలు తెచ్చామని గుర్తు చేశారు. అమెరికా, చైనా తదితర దేశాలతో పోలిస్తే మన దేశ పరిస్థితి మెరుగ్గానే ఉందని వ్యాఖ్యానించారు. భారత్‌ త్వరితంగా వృద్ధి రేటు నమోదు చేస్తోందన్నారు.

25న జీఎస్టీ అధికారులతో సమావేశం 
''ఎల్లుండి జీఎస్టీ అధికారులతో సమావేశం నిర్వహిస్తాం. జీఎస్టీని మరింత సులభతరం చేస్తాం. భద్రతను బలోపేతం చేసే విధానాలు దసరా నుంచి ప్రారంభమవుతాయి. పన్నుల వసూళ్లలో ఎవరికీ ఇబ్బందులు ఉండవు. వాణిజ్య యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలపైనా ఉంది ప్రపంచ జీడీపీ 3.2శాతం నుంచి మరింత పతనమవుతోంది. 2014 నుంచి మేం తీసుకొచ్చిన సంస్కరణలతో భారత్‌ సురక్షిత స్థితిలో ఉంది. 2014 నుంచి సంస్కరణలే అజెండాగా పనిచేస్తున్నాం'' అని వివరించారు.

ఎంఎస్‌ఎంఈలను బలోపేతమే లక్ష్యం 
''ఆర్థిక అవకతవకలకు అధిక జరిమానాల రూపంలో శిక్ష ఉంటుంది. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను ప్రాసిక్యూట్‌ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం కాదు. ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. సీఎస్‌ఆర్‌ ఉల్లంఘనలను క్రిమినల్‌ నేరాల కింద పరిగణించబోం. ఎంఎస్‌ఎంఈలకు వెసులుబాటు కల్పించేలా ఓటీఎస్‌. ఎంఎస్‌ఎంఈ రుణాలపై ఒకే సమావేశంలో బ్యాంకు అధికారి పరిష్కరిస్తారు. ఎంఎస్‌ఎంఈల కోసం చెక్‌బాక్స్‌ విధానం. బ్యాంకు అధికారులు వేగంగా నిర్ణయాలు తీసుకొనేలా చర్యలు. సాధ్యమైనంత వరకు ప్రాసిక్యూషన్‌ కంటే జరిమానాకే ప్రాధాన్యమిస్తాం. కంపెనీల చట్టం కింద 14వేల ప్రాసిక్యూషన్లు ఉపసైంహరించుకున్నాం. అమెరికా, చైనాతో పోలిస్తే భారత్‌ వృద్ధిరేటు మెరుగ్గానే ఉంది'' అని చెప్పారు.

అక్టోబర్‌ 1నుంచి కేంద్రీకృత విధానంలో ఐటీ నోటీసులు

''అక్టోబర్‌ 1 నుంచి కేంద్రీకృత విధానంలో ఆదాయ పన్ను నోటీసులు ఇస్తాం. అసెసీలకు అనుగుణంగానే పన్నుల విభాగం పనిచేస్తుంది. డీఐఎన్‌ లేకుండా ఎలాంటి నోటీసులూ ఉండవు. నోటీసులు అందిన మూడు నెలల్లోనే అన్ని కేసులు పరిష్కారమవుతాయి. డీఐఎన్‌ లేని నోటీసులకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ అధికారీ సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు'' అని తెలిపారు.

వడ్డీ రేట్ల తగ్గింపునకు కృషి 
''రెపో రేట్లకు అనుగుణంగానే గృహ, వాహన రుణాలపై భారం తగ్గనుందన్నారు. ఈ తగ్గింపుతో గృహ, వాహన రుణాల వాయిదాలు అనుసంధానమవుతాయని చెప్పారు. మార్కెట్‌లో రూ.5లక్షల కోట్ల ద్రవ్య లభ్యతకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. దేశీయ, విదేశీ ప్రత్యక్ష ఈక్విటీ పెట్టుబడులపై బడ్జెట్‌ ముందునాటి విధానం పునరుద్ధరిస్తామన్నారు. బ్యాంకులకు రూ.70వేల కోట్లు ఆర్థిక సర్దుబాటు చేస్తాం. వడ్డీ రేట్ల తగ్గుదలకు కృషిచేస్తాం. వడ్డీ రేట్ల తగ్గింపుతో బ్యాంకులు పొందే లబ్ధిదారులకు చేరేలా ఏర్పాట్లు చేస్తాం. వడ్డీ రేట్ల తగ్గింపును నేరుగా రుణ గ్రహీతలకు అందించేలా చర్యలు తీసుకుంటాం'' అని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రెపోరేటుకు అనుగుణంగా గృహ, వాహన రుణాలు"

Post a Comment