గ్రామ, వార్డు సచివాలయ పోస్ట్‌లకు పరీక్ష విధానం ఇదే.. జీతం ఎంతంటే?



ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని తీసుకువస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. షెడ్యూలు ప్రకారం జులై 22వ తేదీన విడుదల కావాలసిన నోటిఫికేషన్లను జులై 26వ తేదీన అధికారులు విడుదల చేశారు. అర్హత గల అభ్యర్థులు జులై 27వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి మొత్తం 1,28,589 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. వీటిల్లో గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 95,088 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,501 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.

జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ)ల ద్వారా గ్రామ సచివాలయ పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం.


కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులకు 10 శాతం వెయిటేజి ఇవ్వనుంది. వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకానికి రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో సెప్టెంబరు మొదటి వారంలో జరుగనుంది. సెప్టెంబరు 3వ వారంలో ఫలితాలు ప్రకటించి అదే నెల నాలుగో వారంలో నియామకానికి సంబంధించిన పత్రాలను అందిస్తారు.

గ్రామ సచివాలయాల్లో భర్తీ చేయనున్న పోస్టులు: 
పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, సర్వే అసిస్టెంట్, ఏఎన్‌ఎం, వెటర్నరీ/ ఫిషరీస్ అసిస్టెంట్, మహిళా పోలీసు & ఉమెన్-చైల్డ్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్, అగ్రికల్చర్/హార్టికల్చర్ ఎంపీఈవో, డిజిటల్‌ అసిస్టెంట్, వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్.

వార్డు సచివాలయాల్లో భర్తీ చేయనున్న పోస్టులు.. అర్హతలు: 
వార్డు పరిపాలన కార్యదర్శి (డిగ్రీ), మౌలిక వసతుల కార్యదర్శి (పాటిటెక్నిక్, సివిల్‌ ఇంజినీరింగ్‌), పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శి (డిగ్రీతో సైన్స్‌/ఇంజినీరింగ్‌), విద్యా కార్యదర్శి (డిగ్రీ), ప్రణాళిక కార్యదర్శి (డిప్లొమో అర్బన్‌ ప్లానింగ్‌/ సివిల్‌ ఇంజినీరింగ్‌), సంక్షేమ కార్యదర్శి (డిగ్రీతో సామాజిక సేవ/సోషియాలజీ/ఆంత్రోపాలజీ), ఇంధన కార్యదర్శి (ఎలక్ట్రికల్స్‌లో డిప్లొమో), ఆరోగ్య కార్యదర్శి (నర్సింగ్‌/ఫార్మా-డీ), రెవెన్యూ కార్యదర్శి (డిగ్రీ), మహిళా కార్యదర్శి (డిగ్రీ)

నియామక ప్రక్రియ: 
సెప్టెంబరు మొదటి వారంలో పరీక్షలను ఆఫ్‌లైన్‌ విధానంలో చేపడతారు. ఇంగ్లీషు, తెలుగు మీడియంలో పరీక్షలు ఉంటాయి. 2019 జూలై ఒకటో తేదీ నాటికి 18-42 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, వికలాంగులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు కల్పిస్తారు. 80 శాతం పోస్టులను స్థానిక అభ్యర్థులతో భర్తీ చేస్తారు. మిగిలిన 20శాతం పోస్టులను స్థానిక, స్థానికేతరులకు రూల్స్‌ ప్రకారం కేటాయిస్తారు. స్థానికులంటే... పోస్టుకు సంబంధించి కనీస విద్యార్హతలు ఏ ప్రాంతంలో పొంది ఉన్నారో దాన్నిబట్టి స్థానికులుగా గుర్తిస్తారు. వరుసగా గడచిన నాలుగు సంవత్సరాలు ఏ ప్రాంతంలో చదివి ఉంటే ఆ ప్రాంతానికి స్థానికులుగా పరిగణిస్తారు. నాలుగేళ్లు చదవకపోయినా గత నాలుగేళ్లు వరుసగా ఆ ప్రాంతంలో నివాసముంటే అలాంటి వారిని కూడా స్థానికులుగా గుర్తిస్తారు. రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్‌ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చి ఉంటే వారు స్థానికత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

పరీక్ష విధానం: 
పరీక్షలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. పార్ట్‌-ఏ కింద జనరల్‌ స్టడీస్‌లో 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. అందుకోసం 50 నిమిషాలు కేటాయిస్తారు. పార్ట్‌-బీ కింద 100 ప్రశ్నలకు 100 మార్కులుంటాయి. ఇందుకోసం 100 నిమిషాలు కేటాయిస్తారు. ఈ పరీక్షల్లో నెగటివ్‌ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి నాలుగు తప్పులకు ఒక మార్కు కట్‌ చేస్తారు. పరీక్ష అయిన తర్వాత వెబ్‌సైట్‌లో 'కీ' ఉంచుతారు. కీ, ఇతర విషయాలపై మూడు రోజుల్లోపు అభ్యంతరాలు తెలియ చేయవచ్చు. అనంతరం నిపుణుల కమిటీ పరిశీలించి రివైజ్డ్‌ కీ విడుదల చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ/అటానమస్‌ బాడీ/ప్రభుత్వ ఎయిడెడ్‌ సంస్థల్లో తాత్కాలిక/పర్మినెంట్‌గా పనిచేస్తున్న సిబ్బంది ఈ పరీక్షలు రాయాలంటే వారి పై ఆఫీసర్ రాతపూర్వకంగా తెలియజేయాలి.

తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్లు డీబార్‌:

రాతపరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్‌తోనే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కనీస అర్హత పొందాలంటే ఓసీ, బీసీలు 40 శాతం, ఎస్సీలు 35 శాతం, ఎస్టీ, దివ్యాంగులు 30 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లో ఆన్సర్‌ కీతో పాటు ఒక్కో అభ్యర్థి పొందిన మార్కులు పెడతారు. ప్రత్యేకంగా మార్కుల జాబితా ఉండదు. ఇప్పటికే ఆయా అర్హతలు కలిగి ఉండి పనిచేస్తున్న ఎంపీఈఓ/ఎంఐఏఓ/ఫీల్డ్‌ కన్సల్టెంట్‌/కాంట్రాక్టు హార్టీకల్చర్‌ ఆఫీసర్లతో పాటు పలువురు సిబ్బందికి వయోపరిమితిలో సడలింపు, రాతపరీక్షల్లో గ్రేస్‌ మార్కులు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏ అభ్యర్థి అయినా అర్హతలకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల పాటు ఏ పరీక్షలకు హాజరుకాకుండా డీబార్‌ చేస్తారు.

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అక్టోబరు 2వ తేదీన విధుల్లో చేరతారు. ఉద్యోగం పొందినవారికి రూ.15 వేల స్టైఫండ్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత శాశ్వత పేస్కేలు వర్తింపజేస్తారు. వీరికి రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ అమల్లో ఉంటుంది. వీరికి డీడీఓ (డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌)గా పంచాయతీ సెక్రటరీ వ్యవహరించనున్నారు. పంచాయతీ సెక్రటరీలకే గ్రామ వాలంటీర్లకు వేతనాలు చెల్లించే బాధ్యతను ప్రభుత్వం అప్పగిస్తుంది.

Apply చేసుకోండి ఇక్కడ:

Andhra Pradesh Grama Sachivalayam Recruitment - 2019

Andhra Pradesh Ward Sachivalayam Recruitment - 2019

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "గ్రామ, వార్డు సచివాలయ పోస్ట్‌లకు పరీక్ష విధానం ఇదే.. జీతం ఎంతంటే?"

Post a Comment