ఆ ఒక్క నిమిషం.. రాత మార్చేసింది. ఎ.టి.యం వచ్చెసింది
ATM ఆవిష్కరణ
పరీక్షకు ఒక నిమిషం ఆలస్యంగా వెళ్లినందుకు చాలామంది ఒక ఏడాది కోల్పోయి ఉండొచ్చు. 1000 మీటర్ల రేసులో ఒక నిమిషం వెనకబడినందుకు బంగారు పతకానికి దూరం అయిఉండొచ్చు. ఒకే ఒక్క నిమిషం రైల్వే స్టేషనుకు ఆలస్యంగా వెళ్లినందుకు రైలును అందుకోలేకపోయి ఉండొచ్చు.
అయితే.. ఒక నిమిషం బ్యాంకుకు ఆలస్యంగా వెళ్లిన ఒక అతను ఒక గొప్ప ఆవిష్కరణకు పునాది వేశాడంటే
ఆలస్యమైనందువల్ల వచ్చిన ఆలోచనతో మనం ఇపుడు ఉపయోగిస్తున్న ఏటీఎమ్ను రూపొందించాడు అతడు.
అలా ఏర్పాటైన తొలి ఏటీఎమ్ ఈమధ్యే ఇటీవలే 52 వసంతాలను పూర్తి చేసుకుంది. ఏటీఎం పుట్టుక భలే ఆసక్తికరం. అదేంటో మీరే చదవండి..
అ నగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక వ్యక్తి. అతని పేరు జాన్ షెఫర్డ్ బ్యారన్. అది 1965వ సంవత్సరం. సాధారణంగా తను ప్రతి శనివారం బ్యాంకుకు వెళ్లి డబ్బు తెచ్చుకుంటుంటాడు. అయితే ఆ వారాంతంలో ఒక నిమిషం ఆలస్యంగా వెళ్లాడు. అప్పటికే బ్యాంకు తలుపులు మూసుకుపోయాయి. దీంతో ఇష్టమైన వారాంతం చప్పగా గడిచిపోయింది. దిగాలుగా బాత్ టబ్లో పడుకుని అన్యమనస్కంగా స్నానం చేస్తున్నాడు. అతని ఆలోచనలన్నీ బ్యాంకు చుట్టూనే ఉన్నాయి. అసలు డబ్బుల కోసం బ్యాంకు లోపలికి ఎందుకెళ్లాలి. అదికూడా పరిమిత వేళల్లోనే అంటే ఎలా..?. అత్యవసరమైనపుడు ఇబ్బంది కదా..? 24 గంటల్లో ఎప్పుడైనా డబ్బులను విత్డ్రా చేసుకునే అవకాశమే లేదా? అనుకుంటూ ఆలోచిస్తున్నాడు.
సరిగా అపుడే ఒక ఆలోచన పుట్టుకొచ్చింది.
అనుకున్నదే తడువుగా ఆ బ్యాంకుకెళ్లాడు. ఆ బ్యాంకు పేరు బార్క్లేస్ బ్యాంక్. చీఫ్ జనరల్ మేనేజర్ను కలిశాడు. అపుడు అతను భోజనం చేస్తున్నాడు. 90 సెకన్ల సమయం ఇస్తే ఒక క్యాష్ మెషీన్ గురించి తనకొచ్చిన ఆలోచన చెబుతాను అన్నాడు. మేనేజర్ దగ్గరకు పిలిచాడు. చెప్పమన్నాడు. బ్యాంకు వెలుపల ఒక మెషీన్ పెట్టి ఒక స్లాటులో కార్డు పెడితే నిర్దిష్ట మొత్తం వచ్చేలా చేస్తే.. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పాడు. మేనేజర్కు ఆ ఆలోచన నచ్చింది. ఒక ఆరు నగదు యంత్రాలను తయారుచేయమని చెప్పాడు. అలా తయారు చేసిన వాటిలో తొలి ఏటీఎమ్ను ఉత్తర లండన్లోని ఎన్ఫీల్డ్ వద్ద ఉన్న బ్యాంకు శాఖ బయట జూన్ 27, 1967న ఏర్పాటు చేశారు. అలా పుట్టిందన్న మాట ఏటీఎమ్.
భారత్తో సంబంధం: ఏటీఎమ్ పుట్టుకకు కారణమైన షెఫర్డ్ బారన్ భారత్లోని షిల్లాంగ్లో 1925లో పుట్టారు. భారత ఆర్మీలో సేవలందించారు కూడా. భారత ఆర్మీలో పనిచేసినపుడు తనకున్న బ్యాడ్జ్ నంబరును దృష్టిలో పెట్టుకుని ఏటీఎమ్ పిన్ను కనిపెట్టారాయన. అయితే ముందుగా ఆరు అంకెలతో పిన్ నంబరును రూపొందించాలని భావించారు. అయితే ఆయన భార్య అందుకు ఒప్పుకోలేదు. ఆరు అంకెలయితే గుర్తుపెట్టుకోవడానికి కష్టమవుతుంది. నాలుగు అయితే మంచిదని సూచించింది. అలా ఇప్పటికీ నాలుగు అంకెలే పిన్ నంబరుగా ఉంది. ఆయన భార్య అప్పుడు వ్యతిరేకించి ఉండకపోతే ఇపుడు మనకు ఆరు అంకెల పిన్ ఉండేదేమో.
శ్రీనివాస రామానుజన్ వల్లే
గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆయన రూపొందించిన విభజన సిద్ధాంతమే ఈ ఏటీఎమ్ మెషీన్ రూపకల్పనకు సహాయపడింది. మనం డెబిట్ కార్డును మెషీన్లో ఉంచినపుడు అది మనకు డబ్బులు ఇచ్చేందుకు రూపొందించిన సాఫ్ట్వేర్ ఈ విభజన సిద్ధాంతం ద్వారానే తయారు చేశారు. ఆ సిద్ధాంతం వల్లే మనకు సరైన నగదును ఏటీఎమ్ మెషీన్లు అందజేయగలుగుతున్నాయి.
2,25,000
భారత్లో ఉన్న ఏటీఎమ్ల సంఖ్య
30 లక్షలకు పైగా
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏటీఎమ్ల సంఖ్య
90 కోట్లు
మన దేశంలోని ఏటీఎమ్లలో గతేడాది జరిగిన లావాదేవీల సంఖ్య. 2013లో ఇది 50 కోట్లుగా మాత్రమే ఉంది.
22
భారత్లో ప్రతీ లక్ష మందికి ఉన్న ఏటీఎమ్ల సంఖ్య. ఈ సంఖ్య రష్యా(164), బ్రెజిల్(107), చైనా(81), దక్షిణాఫ్రికా(68)లలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది
Very intresting
ReplyDelete