కరెన్సీ నోట్లనుగుర్తించేందుకు యాప్!
న్యూదిల్లీ: దృష్టిలోపాలున్న వారు కరెన్సీ నోట్లను గుర్తు పట్టేందుకు వీలుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఓ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. మొబైల్ కెమెరా ముందు మహాత్మా గాంధీ సిరీస్, మహాత్మా గాంధీ న్యూ సిరీస్ కరెన్సీ నోటుని ఉంచి ఫొటో తీస్తే ఆడియో రూపంలో ఆ కరెన్సీ విలువ ఎంతో అది తెలుపుతుంది
. కెమెరా ముందు నోటును సరిగ్గా ఉంచి, ఫొటో తీస్తే ఈ సమాచారాన్ని తెలుపుతుంది.. ఒకవేళ ఫొటో సరిగ్గా తీయకపోతే 'మరోసారి ప్రయత్నించండి' అని చెబుతుంది. ఈ యాప్ను అభివృద్ధి చేయడం కోసం సాంకేతిక సంస్థల నుంచి ఆర్బీఐ బిడ్లను ఆహ్వానించింది
ఇటువంటి ప్రతిపాదన గతంలోనూ చేసి తిరిగి రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నాయి. మరోవైపు రూ.1 నోటు కూడా ఉంది. దృష్టిలోపాలున్న వారు గుర్తుపట్టడానికి ప్రస్తుతం రూ.100 ఆపై విలువ గల నోట్లపై ఇంటాగ్లియో ప్రింటింగ్ ఆధారిత గుర్తులు ఉన్నాయి. వారు మరింత కచ్చితంగా నోట్లను గుర్తించడానికి ఈ కొత్త యాప్ ఉపయోగపడనుంది. ''దృష్టి లోపాలు ఉన్న వారు భారతీయ నోట్లతో కొనుగోలు, విక్రయ వ్యవహారాలు జరిపేటప్పుడు ఎదుర్కొంటున్న
సవాళ్లపై ఆర్బీఐ సున్నితమైన ధోరణితో ఉంది'' అని పేర్కొన్న భారతీయ రిజర్వ్ బ్యాంక్.. ఈ సమస్యలు తీర్చేందుకు మొబైల్ అప్లికేషన్ను అభివృద్ధి చేయాలని వెండర్లకు సూచించింది. ప్రస్తుతం దేశంలో దృష్టిలోపం ఉన్నవారు 80 లక్షల మంది ఉన్నారు. వారు కరెన్సీ నోట్లను గుర్తించడానికి తాము ఓ డివైజ్ లేదా మెకానిజంను అభివృద్ధి చేసే ప్రయత్నాలు చేస్తామని 2018లో ఆర్బీఐ ప్రకటించింది
0 Response to "కరెన్సీ నోట్లనుగుర్తించేందుకు యాప్!"
Post a Comment