ఆగస్టు 31 వరకు ఆగితే భారీ మోత తప్పదు

న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను రిటర్నును దాఖలు చేయడానికి గడువు పెరిగిందని కులాసాగా కూర్చుంటే, అందుకు తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ఐటీఆర్ దాఖలు గడువును జూలై 31 నుంచి ఆగస్టు 31 వరకు పెంచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించవలసి ఉన్నవారు ఆగస్టు 31 వరకు వేచి ఉండవద్దని నిపుణులు చెప్తున్నారు.

అడ్వాన్స్ ట్యాక్స్ అంటే వార్షిక పన్నులో కొంత భాగాన్ని ముందుగా చెల్లించడం అని అర్థం. అసెస్‌మెంట్ ఇయర్‌లో చెల్లించదగిన పన్ను రూ.10 వేలు కన్నా ఎక్కువ అయితే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. దీనినే 'సంపాదిస్తూ చెల్లించండి' పథకం అని అంటారు. జీతం కాకుండా ఇతర సంపాదన మార్గాలు ఉన్నవారికి ఇది వర్తిస్తుంది




ఉదాహరణకు క్యాపిటల్ గెయిన్స్‌పై ఆదాయం,పెట్టుబడులపై వడ్డీ, లాటరీలు, ఇళ్లు, వ్యాపారం వంటివాటి వల్ల వచ్చే ఆదాయం ఉన్నవారికి ఇది వర్తిస్తుంది.

మూలం వద్ద పన్ను తగ్గింపు (టీడీఎస్) తర్వాత చెల్లించదగిన పన్ను రూ.10 వేలు కన్నా ఎక్కువగా ఉన్నపుడు, అడ్వాన్స్ ట్యాక్స్‌ను అసెస్‌మెంట్ ఇయర్‌లో మార్చి 31లోగా నాలుగు వాయిదాల్లో చెల్లించవలసి ఉంటుంది. ఉదాహరణకు బాకీ ఉన్న పన్ను మొత్తం నుంచి టీడీఎస్‌ను తగ్గించిన తర్వాత చెల్లించవలసిన పన్ను రూ.20 వేలు అనుకుంటే, ఏప్రిల్ 1 నుంచి 1 శాతం వడ్డీతో సహా చెల్లించవలసి ఉంటుంది. మార్చి 31 వరకు అడ్వాన్స్ ట్యాక్స్‌ను చెల్లించకపోతే, ఏప్రిల్ 1 నుంచి ఈ రూ.20,000పై ఒక శాతం వడ్డీ లెక్కించి చెల్లించాలి. వడ్డీ ఒక నెలకు రూ.200 అవుతుంది. ఈ విధంగా ఆగస్టు 31 వరకు వేచి ఉండి, చెల్లిస్తే రూ.1,000 వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి అదనపు భారాన్ని తప్పించుకోవాలంటే త్వరపడక తప్పదు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆగస్టు 31 వరకు ఆగితే భారీ మోత తప్పదు"

Post a Comment