రైతన్న వాటా రూ.100 ప్రధానమంత్రి కిసాన్‌ పింఛను పథకంపై కేంద్రం వెల్లడి తమవంతుగా నెలకు అంతేమొత్తం జమ చేస్తామని ప్రకటన ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌’ అర్హులను త్వరగా గుర్తించాలని రాష్ట్రాలకు పిలుపు దిల్లీ

ప్రధానమంత్రి కిసాన్‌పింఛను పథకం ద్వారా లబ్ధి పొందేందుకు రైతన్నలు తమవంతుగా నెలనెలా రూ.100 చెల్లించాల్సి ఉంటుందని కేంద్రప్రభుత్వం తెలిపింది. అన్నదాతల పేరిట అంతే మొత్తాన్ని తాము కూడా పింఛను నిధికి జమ చేస్తామని వెల్లడించింది. రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో గురువారం నిర్వహించిన దూరదృశ్య సమావేశంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ పింఛను పథకం గురించి చర్చించారు. వీలైనంత త్వరగా దాన్ని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు. పథకంపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. పింఛను పథకంలో చేరేందుకు అర్హులైన రైతుల(18-40 ఏళ్ల మధ్య వయసున్నవారు) వివరాలు నమోదు చేయాలని కోరారు. ఈ పథకంలో చేరే అన్నదాతలు నెలనెలా రూ.100 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.


 

ఈ ప్రీమియం వయసులవారీగా మారుతుంది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకం ద్వారా అందే సొమ్ము నుంచి రైతులు నేరుగా పింఛను వాటా చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పారదర్శకత కోసం ఆన్‌లైన్‌ వివాద పరిష్కార వ్యవస్థను ఏర్పాటుచేస్తామని చెప్పారు. 
కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన అనంతరం మోదీ ప్రభుత్వం తొలి కేబినెట్‌ సమావేశంలో ప్రధానమంత్రి కిసాన్‌ పింఛను పథకాన్ని ప్రవేశపెట్టింది. వృద్ధాప్యంలో రైతన్నలకు బాసటగా నిలవడం దాని ఉద్దేశం. ఈ పథకంలో చేరే రైతులకు 60 ఏళ్ల వయసు నుంచి నెలనెలా కనీసం రూ.3,000 పింఛను అందజేస్తారు. పీఎం కిసాన్‌ పింఛను నిధి నిర్వహణ, పింఛను చెల్లింపు బాధ్యతలను ఎల్‌ఐసీ చూసుకుంటుంది. తొలి మూడేళ్లలో దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది రైతన్నలకు పింఛన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు ఏటా రూ.10,774.5 కోట్లు ఖర్చవుతాయని అంచనా.

100 రోజుల్లో కోటిమందిని చేర్పించండి 
పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకానికి అర్హులైన రైతుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ కోరారు. తద్వారా అన్నదాతలకు ఈ ఏడాది ఏప్రిల్‌-జులై కాలానికి అందాల్సిన నగదును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయవచ్చునని తెలిపారు. అర్హులైన రైతులందరికీ పీఎం కిసాన్‌ పథకం ద్వారా కేంద్రప్రభుత్వం ఏటా రూ.6 వేల(మూడు సమాన విడతల్లో) ఆర్థిక సహాయం అందిస్తుంది. మరోవైపు, కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకంపై గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్రాలను తోమర్‌ కోరారు. రానున్న 100 రోజుల్లో ఈ పథకం కింద కొత్తగా కోటిమందిని చేర్పించాలని పిలుపునిచ్చారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రైతన్న వాటా రూ.100 ప్రధానమంత్రి కిసాన్‌ పింఛను పథకంపై కేంద్రం వెల్లడి తమవంతుగా నెలకు అంతేమొత్తం జమ చేస్తామని ప్రకటన ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌’ అర్హులను త్వరగా గుర్తించాలని రాష్ట్రాలకు పిలుపు దిల్లీ"

Post a Comment