ఈఎస్‌ఐ చందా తగ్గింపు 6.5% నుంచి 4 శాతానికి జులై ఒకటి నుంచి అమలు కేంద్ర కార్మిక శాఖ ఉత్తర్వులు


ఈఎస్‌ఐ చందా తగ్గింపు 

6.5% నుంచి 4 శాతానికి జులై ఒకటి నుంచి అమలు

కేంద్ర కార్మిక శాఖ ఉత్తర్వులు

దిల్లీ: ఆరోగ్య బీమా పథకం కోసం ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ)కు చెల్లిస్తున్న చందా మొత్తాన్ని తగ్గిస్తూ గురువారం కేంద్ర కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం జీతాల్లో 6.5 శాతం చందా కింద చెల్లిస్తుండగా, దాన్ని 4 శాతానికి తగ్గించింది. ఇది జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ కారణంగా 3.6 కోట్ల మంది ఉద్యోగులు, 12.85 లక్షల మంది యజమానులకు లబ్ధి కలుగుతుంది. దీనివల్ల సంస్థలకు రూ.5,000 కోట్ల మేర ఆదా అవుతుంది.

2018-19లో చందాల రూపంలో రూ.22,279 కోట్లు వసూలవడం గమనార్హం. ప్రస్తుతం చెల్లిస్తున్న 6.5 శాతం చందాలో యజమానుల  వాటా 4.75 శాతం, ఉద్యోగుల వాటా 1.75 శాతంగా ఉంది. దానిని 4 శాతానికి తగ్గించడంతో యజమానుల వాటా 3.25 శాతం, ఉద్యోగుల వాటా 0.75 శాతంగా మారిందని కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

చందా మొత్తాన్ని తగ్గించడం వల్ల మరింత మంది ఈఎస్‌ఐలో చేరే అవకాశం ఉందని, దీనివల్ల వారు కూడా సంఘటిత రంగ కార్మికులుగా మారుతారని పేర్కొంది. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంలో భాగంగా యాజమాన్యాలపై భారం తగ్గించాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.

నెలకు రూ.21వేల లోపు జీతం ఉన్నవారు ఈఎస్‌ఐలో చేరితే వారికి అనారోగ్య సమయంలో వైద్యసేవలతో పాటు, సందర్భాన్నిబట్టి నగదు సాయం కూడా లభిస్తుంది. ఇందుకు ప్రతినెలా యజమానులతో పాటు, ఉద్యోగులు కూడా చందాను చెల్లించాల్సి ఉంటుంది


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఈఎస్‌ఐ చందా తగ్గింపు 6.5% నుంచి 4 శాతానికి జులై ఒకటి నుంచి అమలు కేంద్ర కార్మిక శాఖ ఉత్తర్వులు"

Post a Comment