ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిద్దాం..

అక్కడే అన్ని సౌకర్యాలు 
వాడవాడలా ప్రచారం నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు 
ఆకర్షితులవుతున్న నగర వాసులు 
ప్రజాశక్తి - కలెక్టరేట్‌ 
సర్కారు బడి అంటే నిన్న మొన్నటి వరకూ చులకన. పిల్లలు చదివినా, చదవకపోయినా పట్టించుకోరనేది విమర్శ. అయితే రానురానూ సౌకర్యాలు దొంతరలు దొంతరలుగా మెరుగవుతుండటంతో ఫలితాల్లో కార్పొరేటుకు దీటుగా నిలుస్తున్నాయి సర్కారు బడులు. మేధో వికాస కేంద్రాలుగా వర్థిల్లుతున్నాయి. వాస్తవానికి సర్కారు పాఠశాలల్లో ఉన్నన్ని సౌకర్యాలు ప్రయివేటు పాఠశాలల్లో ఎక్కడ ఉన్నాయి ? చెప్పండి అని విద్యావేత్తలు, ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు


అటువంటి వారంతా ఈసారి కలిసికట్టుగా సాగి నగరంలోని వీధి వీధినా తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మౌలిక వసతులను వివరిస్తున్నారు. సర్కారు అందిస్తున్న పథకాలతో కూడిన కరపత్రాలను పంచిపెడుతున్నారు. పేదలు నివసించే కాలనీలు, మురికివాడల్లో మరింత ఉధతంగా ప్రచారం చేపడుతున్నారు. దీంతో నగర వాసులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్చడానికి ఇష్టపడుతున్నారు. గతంతో పోల్చితే ఈ సారి కొత్త విద్యార్థుల సంఖ్య పెరగనుందని ద్వారకానగర్‌లోని ఓ ఉపాధ్యాయుడు తెలపడమే దీనికి ప్రత్యక్ష తార్కాణం.
నగరంలో జివిఎంసికి చెందిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు 111 ఉన్నాయి. 17 ఉన్నత పాఠశాలలు, 22 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 35 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లా పరిషత్‌ పాఠశాలలు 4600 ఉండగా దాదాపు 3.5 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పలు సౌకర్యాలు లభిస్తుండటంతో వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ చుట్టు పక్కలవారికీ ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆంగ్ల మాద్యమంలో కూడా విద్యా బోధన అందుతుండటంతో విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు. అసలింతకీ ఈ పాఠశాలల్లో ఏయే సౌకర్యాలు అందుతున్నాయో ఓసారి తెలుసుకుందాం.
ఉచితంగా పాఠ్య పుస్తకాలు
సర్కారు బడుల్లో చేరిన విద్యార్థులకు ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. తెలుగు మీడియంతోపాటు ఇంగ్లీషు మీడియం పుస్తకాలు కూడా వీటిలో ఉన్నాయి.
ఆంగ్ల మాద్యమ బోధన
సాధారణంగా తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించాలని ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. దీంతో జివిఎంసి పాఠశాలల్లో కూడా ప్రత్యేకంగా ఆంగ్ల మాద్యమ పాఠశాలలను ప్రవేశపెట్టారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు తరగతులను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఉపాధ్యాయులను, ప్రత్యేక విద్యా వాలంటీర్లను నియమించారు. 
వేళకు భోజనం
జివిఎంసి అన్ని పాఠశాలల్లోనూ మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం వేళకు అందిస్తోంది. విద్యార్థులకు ఇచ్చే మెనూలో నాణ్యమైన, బలమైన, చిన్నారుల ఎదుగుదలకు అవసరమైన పోషక విలువలతో కూడిన పదార్థాలు అందిస్తుండటంతో చిన్నారులు ఆకర్షితులవుతున్నారు. అన్నం, పాయసం, కూర, అరటిపండు, రసం, పచ్చడితోపాటు వారానికి మూడు కోడిగుడ్లును అందిస్తున్నారు. జూలై 1 నుంచి ఐదు గుడ్లు అందివ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మరింత మంది స్కూలులో చేరే అవకాశముంది.
డిజిటల్‌ తరగతులు
అన్ని ఉన్నత పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు ఏర్పాటు చేశారు. సీడీ, వెబ్‌ సైట్‌ ఆధారంగా పాఠాలను బోధిస్తున్నారు. డిజిటల్‌ విద్యాబోధనతో విద్యార్థుల్లో ఆసక్తి పెరగటంతోపాటు సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఈ ఏడాది నుంచి పూర్తిస్థాయిలో ఈ విధానంలో బోధన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఐఐటి ఫౌండేషన్‌ కోర్సు
ప్రయివేటు పాఠశాలలకు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు జివిఎంసి పాఠశాలల్లో ఐఐటి ఫౌండేషన్‌ కోర్సును ప్రవేశపెట్టారు. వేసవి సెలవుల్లో అనేక మంది విద్యార్థులకు ఈ మేరకు శిక్షణ ఇస్తున్నారు. పాఠశాలలు ప్రారంభం కావడంతో రోజుకు ఒక పీరియడ్‌ చొప్పున ఈ శిక్షణ ఇవ్వనున్నారు.
యూనిఫారం
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ ఏడాది కూడా రెండు జతల యూనిఫారం అందజేస్తున్నారు. ఇందుకుగాను రాజీవ్‌ విద్యామిషన్‌ (ఆర్‌విఎం) ద్వారా ఒక్కో విద్యార్థికి రూ.400 ఖర్చు చేస్తున్నారు. ఈ వారం చివర నాటికి యూనిఫారం పంపిణీ చేస్తారు. ప్రతిరోజూ వ్యాయామ విద్య క్రీడలను సైతం పాఠాలుగా రూపొందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం వారానికి మూడు పీరియడ్లు ఉండగా, ఇక నుంచి ఆరు పీరియడ్లు చేస్తున్నారు. ప్రతిరోజూ చివరి పీరియడ్‌ను వ్యాయామ విద్యకు కేటాయించి బోధిస్తారు. దీంతోపాటు విద్యార్థినుల రక్షణ కోసం కరాటే, డ్యాన్స్‌, అల్లికలపై శిక్షణ ఇవ్వనున్నారు.
ఆరోగ్యానికి భరోసా
సర్కారీ పాఠశాలల్లో చిన్నారులకు రాజీవ్‌ విద్యామిషన్‌ ద్వారా ప్రతి రెండు నెలలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. నేత్ర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి శస్త్ర చికిత్సలు ఉచితంగా చేస్తారు. మిగిలిన వ్యాధులకు ప్రభుత్వ వైద్య శాలలో వైద్యం అందిస్తారు. 
ఉచితంగా సైకిళ్లు పంపిణీ 
దూర ప్రాంతాల నుంచి వస్తున్న 9, 10 తరగతుల విద్యార్థులు సరైన సమయానికి పాఠశాలలకు చేరుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తోంది. 
సమగ్ర మూల్యాంకన విధానం
ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సమగ్ర మూల్యాంకన విధానం అమలు చేస్తున్నారు. దీనివల్ల ఎప్పటికప్పుడు మదింపు చేయవచ్చు. ఇందులో భాగంగా 80 మార్కులను పబ్లిక్‌ పరీక్షలకు, 20 మార్కులను అంతర్గత వద్ధికి కేటాయిస్తారు. ఈ విధానం విద్యార్థిలోని ప్రతిభను వెలికి తీసేందుకు ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు.
ఉపకార వేతనాలు
ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు అందజేస్తోంది. ఎన్‌ఎంఎంఎస్‌ పేరిట జాతీయ ఉపకార వేతనాలను ఏటా ఇస్తోంది.
కంప్యూటర్‌ విద్య
ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రతి పాఠశాలలో కంప్యూటర్లను ఏర్పాటు చేసి ఉచితంగా కంప్యూటర్‌ విద్యను అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థీ కంప్యూటర్‌ పట్ల అవగాహన కలిగి ఉండేలా ప్రత్యేకంగా తరగతులను నిర్వహిస్తున్నారు.
ఇన్‌స్పైర్‌ అవార్డులు

సైన్స్‌ పట్ల పిల్లల్లో ఆసక్తి పెంచడానికి అవగాహన కల్పించేందుకు పాఠశాల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఇన్‌ స్పైర్‌ అవార్డులు అందజేస్తున్నారు. అందుబాటులో ఉన్న వస్తువులతో వివిధ నమూనాలు తయారు చేసి ప్రదర్శిస్తున్నారు. 
విద్యాహక్కు చట్టం అమలు 
2010లో విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఎటువంటి రుసుమూ వసూలు చేయడం లేదు. ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రయివేటు పాఠశాలల్లా ప్రవేశ రుసుం, ట్యూషన్‌ రుసుం, భవనం రుసుం వంటివి లేకపోవడంతో పేద విద్యార్థులకు సర్కారు బడులు వరంగా మారాయి


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిద్దాం.."

Post a Comment