బడి బస్సు.. రాయితీ పాసు విద్యార్థులకు ప్రయోజనం జిల్లావ్యాప్తంగా 52 బస్సులు ఈ ఏడాది 86 వేల పాసులు పంపిణీ ప్రారంభం
చిన్నచౌకు (కడప), న్యూస్టుడే: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై పదిరోజులు కావస్తున్న నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బడిబస్సులను ప్రవేశపెట్టటంతోపాటు ఉచిత, రాయితీ పాసులు జారీ చేయటం ప్రారంభించింది. బస్పాసులను జిల్లావ్యాప్తంగా ఆయా డిపోల పరిధిలోనే పంపిణీ చేస్తున్నారు. పదో తరగతి బాలికలు, ఏడో తరగతి వరకు బాలురకు ఉచిత బస్సు పాసులు ఇస్తున్నారు. మిగిలిన వారందరికీ రాయితీ పాసులు ఇస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా నెలవారీ బస్ పాసులు కూడా ఇవ్వనున్నారు. మొత్తానికి మూడు రకాల బస్ పాసులతో విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించటానికి ఆర్టీసీ చర్యలు చేపట్టింది. నెల, మూడు నెలలు, ఏడాది గడువుతో పాసులిస్తున్నారు. విద్యార్థులు వారికి నచ్చిన పాసులు తీసుకోవచ్ఛు పాఠశాల విద్యార్థుల కోసమే 52 ప్రత్యేక బడిబస్సులను నడుపుతున్నారు.
ఏడాదిపాటు ఉచితం
ఏపీఎస్ ఆర్టీసీ ఒకటి నుంచి పదోతరగతి చదువుతున్న బాలికలకు, ఒకటి నుంచి ఏడో తరగతి చదువుతున్న బాలురకు ఉచిత బస్ పాసుల సదుపాయాన్ని కల్పించింది. 20 కిలోమీటర్ల లోపున్న వారికి మాత్రమే ఈ ఉచిత బస్పాసులు వర్తిస్తాయి. జిల్లావ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, రాయచోటి, రాజంపేట, బద్వేలు, మైదుకూరు డిపోల్లో బస్పాసుల కోసం ప్రత్యేక పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉచిత బస్పాసులు పొందే విద్యార్థులు రూ.50 చెల్లిస్తే వారికి ఏడాదిపాటు వర్తించే ఓ కార్డును ఇస్తారు. దీంతో ఏడాదిపాటు ఉచితంగా ప్రయాణించవచ్ఛు
రాయితీ పాసులు ఇవి
రాయితీ బస్సులు పొందే అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు ఫారాన్ని తీసుకుని ఆధార్కార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రం, రెండు ఫొటోలు తీసుకురావాలి. సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ సంతకం, సీల్ ఉండాలి. కొత్తగా చేరే విద్యార్థులకు మాత్రమే ఇవి అందిస్తారు. భర్తీ చేసిన దరఖాస్తును బస్టాండుల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఇస్తే పాసులిస్తారు. పాత విద్యార్థులు రెన్యూవల్ చేయించుకుంటే సరిపోతుంది. విద్యార్థులు వారి ఇష్ట ప్రకారం నెల, మూడు నెలలు, ఏడాది పాసులు తీసుకునే వెసులుబాటు కల్పించారు.
86 వేల బస్పాసులు లక్ష్యం
ఈ ఏడాది అధికారులు 86 వేల బస్ పాసులివ్వాలని లక్ష్యంగా ఎంచుకున్నారు. కడప డిపోలో 12,769, పులివెందుల 10,600 రాజంపేట 8,934, రాయచోటి 18,141, బద్వేలు 7,955, జమ్మలమడుగు 9,541, మైదుకూరు 6,102, ప్రొద్దుటూరు 12,048 కేటాయించారు. వీటిలో 56 వేలు ఉచిత బస్పాసులు, 45 వేలు రాయితీ పాసులున్నాయి.
కడప డిపోలో 12, పులివెందుల 11, రాజంపేట 7, రాయచోటి 10, బద్వేలు 3, జమ్మలమడుగు 5, ప్రొద్దుటూరు 5, చొప్పున బడి బస్సులను నడుపుతున్నారు
.
సద్వినియోగం చేసుకోవాలి
విద్యార్థులు ఉచిత, రాయితీ బస్పాసులను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లావ్యాప్తంగా ఎనిమిది డిపోల పరిధిలో విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ప్రతి ఏడాదిలా ప్రస్తుతం కూడా ఉచిత బస్పాసులను ప్రవేశపెట్టాం. ఉచిత బస్పాసులకు సంబంధించిన కార్డు రూ.50 అవుతుంది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి కార్డులు కొనుగోలు చేసి నిరుపేద విద్యార్థులకు పంపిణీ చేయవచ్ఛు రూ.50 పెట్టి కార్డు కూడా కొనలేని విద్యార్థులు చాలా మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా తమ సిబ్బంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు బస్పాసులపై అవగాహన కల్పిస్తున్నారు.
- వెంకట శేషయ్య, ఆర్టీసీ ప్రాంతీయ అధికారి, కడప
0 Response to "బడి బస్సు.. రాయితీ పాసు విద్యార్థులకు ప్రయోజనం జిల్లావ్యాప్తంగా 52 బస్సులు ఈ ఏడాది 86 వేల పాసులు పంపిణీ ప్రారంభం"
Post a Comment