10+2 కాదు 5+3+3+4!

నూతన విద్యా విధానం ప్రతిపాదించిన మార్పులివే..

దిల్లీ: ఇస్రో మాజీ అధిపతి డాక్టర్‌ కృష్ణస్వామి కస్తూరి రంగన్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ రూపొందించిన నూతన జాతీయ విధానం-2019 ప్రభుత్వానికి చేరింది


. ఈ నివేదికను శుక్రవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిషాంక్‌కు కమిటీ సభ్యులు అందించారు.


 21వ శతాబ్దానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందించినట్లు నివేదిక పేర్కొంది.



నూతన విధానంలో ప్రతిపాదించిన మార్పుల్లోని ముఖ్యాంశాలు.. 
* ఇప్పటివరకూ 10+2 విధానంలో ఉన్న పాఠశాల విద్యా ప్రణాళిక 5+3+3+4కు మారాలి


మొదటి ఐదేళ్లు ప్రాథమిక విద్య లేదా ఫౌండేషనల్‌ స్టేజ్‌ (ప్రీ ప్రైమరీ, గ్రేడ్‌ 1, గ్రేడ్‌ 2), తర్వాతి మూడేళ్లు ప్రిపరేటరీ స్టేజ్‌ ఉంటుంది. దీనిలో 3,4,5 తరగతులు ఉంటాయి. ఆ తర్వాతి మూడేళ్లు మాధ్యమిక విద్య లేదా అప్పర్‌ ప్రైమరీ (6,7,8 తరగతులు) ఉంటుంది. తర్వాతి నాలుగేళ్లు సెకెండరీ విద్య (9-12 తరగతులుగా)గా పరిగణించాలి.



* ఈ వ్యవస్థలోని మొదటి ఫౌండేషనల్‌ స్టేజ్‌లో ఐదేళ్ల పాటు వివిధ దశల్లో విద్యార్థి ఆడుతూ పాడుతూ నేర్చుకోవడం, ఏదైనా పనిచేస్తూ, చిన్న చిన్న ఆవిష్కరణల ఆధారితంగా నేర్చుకోవాలి. తర్వాత నెమ్మదిగా పాఠ్య పుస్తకాలు చదువుతూ, సంప్రదాయ తరగతి గది శిక్షణ కొనసాగాలి.



* మొదటి దశ ప్రధాన ఉద్దేశం.. రాయడం, నేర్చుకోవడం, మాట్లాడడం, కళలు, భాషలు, సైన్స్‌, గణిత శాస్త్రాల్లో పునాది స్థాయిలో పట్టు సాధించడం. 



* రెండో దశ అయిన సెకండరీ స్టేజ్‌లో ప్రతి విద్యా సంవత్సరాన్ని రెండు సెమిస్టర్లుగా విభజించాలి. ప్రతి విద్యార్థి ప్రతి సెమిస్టర్‌లో ఐదు నుంచి ఆరు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించేలా చూడాలి. 



* ప్రస్తుతం ఉన్న 10+2 వ్యవస్థలో 1 నుంచి 5 తరగతుల వరకూ ప్రాథమిక విద్య అని, 6 నుంచి 8 తరగతుల వరకూ మాధ్యమిక విద్య అని, 9, 10 తరగతులను సెకండరీ స్టేజ్‌ అని, 11, 12 తరగతులను జూనియర్‌ కాలేజ్‌, ఇంటర్మీడియట్‌ లేదా హైయర్‌ సెకండరీగా పరిగణిస్తున్నారు. అయితే, కొత్త విధానం ప్రకారం హయర్‌ సెకండరీ, జూనియర్‌ కాలేజ్‌ పదాలను తొలగించి వాటిని సెకండరీ స్టేజ్‌లో విలీనం చేస్తారు.


* బోర్డ్‌ పరీక్షల వ్యవస్థ కూడా మారాలి. ఈ పరీక్షల్లో ప్రధాన అంశాలు, సూత్రాలు, క్లిష్టమైన ఆలోచనలు, ప్రతి సబ్జెక్టులో ఉన్నతమైన నైపుణ్యాలపై పరీక్షలు నిర్వహించాలి.



* పాఠశాల విద్యలో పాఠ్యాంశ నిర్మాణం, బోధన తీరు మారాలి. వయసును బట్టి విద్యార్థుల అసక్తి, అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశ నిర్మాణం, బోధన తీరు ఉండాలి. 3-8, 8-11, 11-14, 14-18 వయస్సుల ప్రాతిపదికన బోధనలో మార్పులు ఉండాలి


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "10+2 కాదు 5+3+3+4!"

Post a Comment