ఉద్యోగుల కేటాయింపు పూర్తి!




పునర్విభజన జిల్లాలకు నేడు శాఖలవారీగా ఖరారు


స్టులు కూడా కేటాయింపు.. ఆర్థిక శాఖకు తుది నివేదికలు 

ఈ నెల 11 నాటికి ఆమోదం.. తుది నోటిఫికేషన్‌ రోజు ఉత్తర్వులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల కేటాయింపు కసరత్తు పూర్తయ్యింది. కొత్తగా ప్రతిపాదించిన, ప్రస్తుతమున్న జిల్లాలకు శాఖల వారీగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపును సోమవారం ఖరారు చేయనున్నారు. దీనికి సంబంధించి గత నెల 26న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ జీవో 31 జారీ చేశారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఆయా శాఖలు జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ మేరకు పోస్టుల విభజన చేశాయి. విశ్వసనీయ సమాచారం మేరకు 42 ప్రభుత్వ శాఖలు ఉద్యోగుల కేటాయింపుపై స్టేట్‌మెంట్‌-3ను సిద్ధం చేశాయి. ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు సోమవారం ఆమోదించి ఆర్థిక శాఖకు పంపించనున్నారు. ఈ నెల 11 నాటికి ఆర్థిక శాఖ ఈ నివేదికలను ఆమోదించి తిరిగి ఆయా శాఖల కార్యదర్శులకు పంపనుంది. కొత్తగా ప్రతిపాదించిన, ప్రస్తుతమున్న జిల్లాల జనాభా, సామాజిక, ఆర్థిక స్థితిగతులు, ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా, ప్రభుత్వ సేవల పరిధి తదితర విషయాలను దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు జరిపేలా ఆయా శాఖలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తాత్కాలిక కేటాయింపుల నేపఽథ్యంలో కొన్ని పోస్టుల హోదాను పరిమితం చేస్తున్నట్లు సమాచారం. జోనల్‌ సమస్య పరిష్కారమయ్యే వరకు ఇదే విధానం ఉంటుంది. జిల్లాల పరిధిలో ఆయా శాఖల్లో జాయింట్‌ డైరెక్టర్‌, అడిషనల్‌ డైరెక్టర్‌ వంటి పోస్టుల స్థానంలో జిల్లా స్థాయి అధికారి హోదా కల్పించనున్నారు. పెద్ద శాఖలు, వాటి అనుబంధ విభాగాల్లో అధికారుల కొరత కారణంగా ఉమ్మడిగా ఒకే జిల్లా స్థాయి పోస్టు ఉండేలా ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. అంటే.. ప్రధాన శాఖతో పాటు అనుబంధ విభాగాలకు కూడా ఒకరే జిల్లా స్థాయి అధికారి హోదాతో పనిచేయనున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఈ తరహా మార్పులు ఉండొచ్చని సమాచారం. ప్రస్తుతం వ్యవసాయ శాఖలో హార్టికల్చర్‌, సెరికల్చర్‌తో పాటు పలు విభాగాలకు వేర్వేరు జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. ఇప్పుడు ఈ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి పర్యవేక్షణాధికారికి జిల్లా వ్యవసాయాధికారి హోదా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌)తో పాటు 11 శాఖల పరిధిలో జిల్లా స్థాయిలో ప్రాజెక్టు డైరెక్టర్ల పేరిట అధికారులు పనిచేస్తున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఈ పోస్టులలో కొందరు డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తారు. మరి కొన్నింటిలో శాఖాధికారులే పనిచేస్తారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్లు ఆ శాఖ వారే ఉంటారు. ఇలాంటి కేటగిరీల్లో పీడీల స్థానంలో జిల్లా స్థాయి అధికారి హోదా ఇవ్వనున్నారు. ఈ పోస్టుల్లో జాయింట్‌ డైరెక్టర్‌, డిప్యూటీ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కేడర్‌ అధికారులను వారి అర్హతలను బట్టి నియమించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆయా శాఖల ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ఆమోదించిన తర్వాత ఉద్యోగుల కేటాయింపులపై శాఖల కార్యదర్శులు ఆర్డర్‌ టు సర్వ్‌ ఉత్తర్వులు ఇవ్వనున్నారు. కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్‌లు విడుదలయ్యే రోజే ఈ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఈ అంశంపై ఆర్థిక శాఖ ఆయా శాఖలతో కీలక భేటి నిర్వహించనుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉద్యోగుల కేటాయింపు పూర్తి!"

Post a Comment