AP High Court: జీవోలు రహస్యం, అతి రహస్యమని ఎలా నిర్ణయిస్తారు?: హైకోర్టు
అమరావతి: జీవోఐఆర్టీ వెబ్సైట్లో జీవోలను ఎందుకు పెట్టడం లేదని ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సాఫీగా జరిగే ప్రక్రియకు ఆటంకం కల్పించడంపై మండిపడింది. జీవోలను ఈ-గెజిట్లో ఉంచుతామని ఏపీ ప్రభుత్వం గతంలో జీవో జారీ చేయగా.. దాన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై ఇవాళ విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. ఈ-గెజిట్లో కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో జీవోలు ఉంచడం లేదని.. కేవలం 4 నుంచి 5 శాతమే ఉంచుతోందని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ తీరు సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకమని వాదించారు.
దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అతి రహస్య జీవోలు మాత్రమే అప్లోడ్ చేయట్లేదని కోర్టుకు వివరించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ జీవోలు రహస్యం, అతి రహస్యమని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. అన్ని జీవోల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వెబ్సైట్లో ఉంచిన, రహస్య జీవోల వివరాలను తెలపాలని కోర్టు స్పష్టం చేసింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను ఈనెల 28కి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.
0 Response to "AP High Court: జీవోలు రహస్యం, అతి రహస్యమని ఎలా నిర్ణయిస్తారు?: హైకోర్టు"
Post a Comment