ఐదు నగరాల్లో ‘సేఫ్‌ స్కూల్‌ జోన్‌’ 300 మీటర్ల వరకు అటూ, ఇటూ ప్రత్యేక చర్యలు.. పాదచారుల కోసం ప్రత్యేక మార్గాలు


న్యూఢిల్లీ, నవంబరు 21: స్మార్ట్‌సిటీస్‌ ప్రాజెక్టులో భాగంగా తెరపైకి తెచ్చిన ‘సేఫ్‌ స్కూల్‌ జోన్‌’ను కేంద్ర ప్రభుత్వం ఐదు నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. వారం క్రితం నుంచి బెంగళూరులోని సెయింట్‌ జోసెఫ్‌ హైస్కూల్‌, 116 ఏళ్ల చరిత్ర గల ఫోర్ట్‌ హైస్కూల్‌, 



ముంబైలోని మిర్జా ఘాలీబ్‌ రోడ్‌లో సెయింట్‌ ఆగ్నస్‌, క్రైస్ట్‌ చర్చ్‌ స్కూల్‌, ఢిల్లీలోని ఎన్‌పీ బోయ్స్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌, పుణెలో రెండు, గురుగ్రామ్‌లో ఒక స్కూల్‌ వద్ద ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ ఐదు చోట్ల వచ్చే ఫలితాలను బట్టి.. ఇతర నగరాల్లోనూ ఈ జోన్లను విస్తరిస్తారు. ప్రస్తుతం హైవేలు, రద్దీ రహదారులపై స్కూళ్లు ఉన్న చోట ‘ముందు స్కూల్‌ ఉన్నది.. నెమ్మదిగా వెళ్లండి..’


అనే సైన్‌బోర్డులు కనిపిస్తున్నాయి. ‘సేఫ్‌ స్కూల్‌ జోన్‌’ అందుకు పూర్తిగా భిన్నం. ఐరోపా దేశాలు, అమెరికా, ఫిలిప్పైన్స్‌, ఇండోనేషియా, దక్షిణ కొరియాల్లో ఈ విధానం అమల్లో ఉంది. ఈ విధానంలో ప్రత్యేక రోడ్‌వేలు ఉంటాయి. అవి.. స్కూలు ప్రారంభానికి లేదా స్కూలు సరిహద్దుకు 300 మీటర్ల దూరంలో ప్రారంభమై.. స్కూలును దాటిన 300 మీటర్ల తర్వాత ముగుస్తాయి. స్కూల్‌ జోన్‌ ప్రారంభం, 



ముగింపు పాయింట్లలో సంబంధిత సైన్‌ బోర్డులు ఉంటాయి. ప్రస్తుతం స్కూల్‌ ఉన్నచోట స్పీడ్‌ బ్రేకర్లను ఏర్పాటు చేసి.. వాహనాలు నెమ్మదిగా వెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సేఫ్‌ స్కూల్‌ జోన్‌లో వాహనాలకు పరిమితులు ఉంటాయి. వేగ నియంత్రణ చర్యలు ఉంటాయి. అదే సమయంలో పాదచారుల కోసం రోడ్డుపై ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేస్తారు. రోడ్‌ క్రాసింగ్‌ వద్ద జాగ్రత్తలు తీసుకుంటారు. విద్యార్థులను స్కూల్‌ వద్ద దిగబెట్టే వాహనాలకోసం ప్రత్యేకంగా డ్రాప్‌ అండ్‌ పికప్‌ పాయింట్లు ఉంటాయి.  


ప్రత్యేక జోన్‌ ఎందుకు?


భారత్‌లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 14 ఏళ్ల లోపు వారి మరణాలు ఏటా పెరుగుతున్నాయి. 2017లో 6.4ు, 2018లో 6.6ు, 2019లో 7.4ు మేర ఈ పెరుగుదల నమోదైంది. ప్రతి 45 నిమిషాలకు ఒకరు చొప్పున.. రోజుకు 31 మంది చిన్నారులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో సేఫ్‌ స్కూల్‌ జోన్లను ప్రస్తావించారు. 


సుదీర్ఘకాలం పాఠశాలల మూత వల్ల.. 


లింగ సమానత్వానికి ముప్పు: యునెస్కో


కరోనా విపత్తు కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలను దీర్ఘకాలంగా మూసేయడం వల్ల అభ్యసనపరమైన నష్టమే కాకుండా లింగ సమానత్వానికీ ముప్పు వాటిల్లుతోందని యునెస్కో తాజా అధ్యయనం పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. బాలబాలికలు, యువతీయువకులపై పాఠశాలల మూసివేత కారణాలనేవి వేర్వేరుగా ప్రభావం చూపిస్తాయి. కరోనా గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు పాఠశాలలు మూసేయడంతో 190 దేశాల్లోని 160కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు.  అభ్యసన నష్టంతోపాటు ఆరోగ్యం, భవిష్యత్తు, లింగ సమానత్వంపై ప్రతికూల ప్రభావం చూపింది. పేదల విషయానికొస్తే.. ఇంటి పనుల వల్ల బాలికలు, కుటుంబానికి ఆర్థికంగా సహాయపడే క్రమంలో బాలలు.. అభ్యాసానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయారు. ఆన్‌లైన్‌పై అవగాహన రాహిత్యం, ఇంటర్నెట్‌ సౌకర్యం లేకపోవడం, సాంకేతిక పరికరాల కొరతా ఎక్కువ నష్టమే కలిగించింది. డిజిటల్‌ సౌకర్యాల వాడకంలో లింగ విభజన ఇప్పటికే ఆందోళనకర స్థాయికి చేరుకొంది. కొంతమంది తల్లిదండ్రులు తమ కూతుర్లకు సెల్‌ఫోన్‌ ఇవ్వడం లేదని నివేదిక పేర్కొంది. ఇలాంటి వాటి వల్ల లింగ సమానత్వంలో వ్యత్యాసం ఎక్కువవుతోందని తెలిపింది. 


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఐదు నగరాల్లో ‘సేఫ్‌ స్కూల్‌ జోన్‌’ 300 మీటర్ల వరకు అటూ, ఇటూ ప్రత్యేక చర్యలు.. పాదచారుల కోసం ప్రత్యేక మార్గాలు"

Post a Comment