వైద్య ఆరోగ్య శాఖలో 11,425 ఉద్యోగాలు కొత్తగా సృష్టించినవి, ఖాళీల భర్తీకి ఉత్తర్వులు శాశ్వత పద్ధతిలో వైద్యుల నియామకాలు మిగిలినవి ఒప్పంద, పొరుగుసేవల కింద
ఈనాడు, అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 11,425 ఉద్యోగాల భర్తీకి పరిపాలనాపరమైన ఉత్తర్వులు బుధవారం వెలువడ్డాయి. వీటిలో వైద్యుల పోస్టులను శాశ్వత విధానంలో భర్తీ చేయనున్నారు. స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, అటెండర్లు, ప్లంబర్లు, ఇతర ఉద్యోగాలను ఒప్పంద, పొరుగుసేవల కింద భర్తీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రాథమిక, సామాజిక, ప్రాంతీయ, బోధనాసుపత్రులు, ఇతర ఆసుపత్రుల్లో ఈ నియామకాలను చేపట్టనున్నారు. వీటిలో వైద్యుల పోస్టులు సుమారు 1,900 వరకు ఉన్నాయి. ఆ తరువాత ఎక్కువ సంఖ్యలో స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఉన్నాయి. ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులను జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ నియమిస్తుంది. ఈ ఉత్తర్వుల అనుగుణంగా ఆయా శాఖల హెచ్ఓడీలు వైద్యుల నియామకాల కోసం నోటిఫికేషన్లను ఇవ్వనున్నారు. ఇవి భర్తీ చేసేలోగా వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలు చేపడతారు. దీనిపై అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది. బోధనాసుపత్రుల్లో అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టుల పదోన్నతుల జాబితాను త్వరలో ప్రకటిస్తామని రవిచంద్ర తెలిపారు. ఇతర ఆసుపత్రుల్లోనూ పదోన్నతుల పోస్టుల భర్తీని వెంటనే చేపడతామన్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి వివరాలు అందిన వెంటనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎం.రాఘవేంద్రరావు తెలిపారు.
భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు..
* బోధనాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 1,952 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 282 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ప్రత్యక్ష పద్ధతిలో నియమిస్తారు. 430 స్టాఫ్ నర్సులు, 100 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులు, 60 ఫార్మసిస్ట్ గ్రేడ్-2, 5 ఫిజికల్ డైరెక్టర్, ఇతర పోస్టులను ఒప్పంద విధానంలో భర్తీ చేస్తారు. 4 గ్రంథ పాలకుల పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా శాశ్వత విధానంలో భర్తీ చేయనున్నారు. 132 అటెండర్లు, 131 ల్యాబ్ అటెండెంట్స్, 39 ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్స్, ఇతర పోస్టులను పొరుగు సేవల కింద నియమిస్తారు.
* బోధనాసుపత్రుల్లో కొత్తగా సృష్టించిన 2,190 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 130 అసిస్టెంట్ ప్రొఫెసర్, 51 ఫ్రొఫెసర్, 187 అసోసియేట్ ప్రొఫెసర్, 1,040 స్టాఫ్ నర్సు, ఇతర పారా మెడికల్ పోస్టులున్నాయి.
వైద్య విధాన ఆసుపత్రుల్లో..
వైద్య విధాన పరిషత్తు ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 2,520 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 794 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్-స్పెషలిస్టు పోస్టులు, 86 సివిల్ అసిస్టెంట్-జనరల్ పోస్టులు, 38 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, 16 దంత వైద్య పోస్టులను శాఖాపరంగా నేరుగా తీసుకుంటారు. 555 స్టాఫ్ నర్సులు, 199 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను ఒప్పంద విధానంలో భర్తీ చేస్తారు. ఫిజియోథెరపిస్ట్, రేడియోగ్రాఫర్, ప్లంబర్, ఎలక్ట్రిషియన్ వంటి పోస్టులను పొరుగుసేవల విధానంలో జిల్లా కమిటీ నియమిస్తుంది. 2,520లో 333 పోస్టులను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీచేస్తామని అంతకుముందే ప్రకటించారు.
CLICK HERE TO OFFICIAL WEBSITE
ఇతర ఆసుపత్రుల్లో..
* ప్రజారోగ్య శాఖ పరిధిలో ఉన్న ఆసుపత్రుల్లో కొత్తగా 2,918 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 576 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను శాశ్వత పద్ధతిలో నియమిస్తారు. 716 స్టాఫ్ నర్సులు, 201 ల్యాబ్ టెక్నీషియన్-గ్రేడ్-2, 203 ఫార్మసిస్ట్-గ్రేడ్-2 పోస్టులను ఒప్పంద విధానంలో తీసుకుంటారు.
* ప్రజారోగ్య శాఖ పరిధిలో పనిచేసే ఆసుపత్రుల్లో అవసరాలకు కొత్తగా 1,285 పోస్టులను సృష్టించారు. ఇందులో 10 స్టాఫ్ నర్సులు, 124 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులను ఒప్పంద, 539 ఎఫ్ఎన్ఓ, 312 శానిటరీ అటెండర్ పోస్టులను పొరుగుసేవల కింద నియమిస్తారు.
* వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్స్లో అదనంగా సృష్టించిన ఫార్మసిస్ట్ గ్రేడ్-2 కింద 560 పోస్టుల భర్తీకీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగుల సంఖ్యను 12గా నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు
0 Response to "వైద్య ఆరోగ్య శాఖలో 11,425 ఉద్యోగాలు కొత్తగా సృష్టించినవి, ఖాళీల భర్తీకి ఉత్తర్వులు శాశ్వత పద్ధతిలో వైద్యుల నియామకాలు మిగిలినవి ఒప్పంద, పొరుగుసేవల కింద"
Post a Comment