Modi: ‘100కోట్ల మైలురాయి’.. నవ భారత్కు ప్రతీక దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ
దిల్లీ: ‘‘టీకా పంపిణీలో 100 కోట్ల డోసులు అనేది కేవలం సంఖ్య కాదు. దేశ సంకల్ప బలం. దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం. నవ భారతానికి ప్రతీక
భారత శక్తి ప్రపంచానికి తెలిసింది..
‘‘కరోనా మహమ్మారి మనకు అతిపెద్ద సవాల్ విసిరింది. ఇంత పెద్ద దేశానికి టీకాలు సరఫరా చేయడం అనేది నిజంగా సవాలే. దాన్ని అధిగమించి నేడు వంద కోట్ల మైలురాయిని దాటాం. ఇది ప్రజల విజయం. కరోనా వ్యాక్సిన్ల ద్వారా భారత శక్తి ఏంటో ప్రపంచానికి చూపించాం. మన ఫార్మా సామర్థ్యం ప్రపంచానికి మరోసారి తెలిసింది. మన శాస్త్రవేత్తలు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసి పరీక్షలు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యాక్సిన్లు రూపొందించారు. శాస్త్రవేత్తల కృషి ఫలితంగానే స్వదేశీ వ్యాక్సిన్లను అతి త్వరగా అందుబాటులోకి తీసుకురాగలిగాం’’ అని మోదీ తెలిపారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్తోనే ఈ లక్ష్యాన్ని సాధించామన్నారు.
వీఐపీ సంస్కృతికి పోలేదు..
‘‘టీకా పంపిణీ కార్యక్రమంలో వీఐపీ సంస్కృతికి తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా చూశాం. మహమ్మారి వివక్ష చూపించనప్పుడు.. వ్యాక్సినేషన్లోనూ వివక్ష ఉండకూడదని భావించాం. పేద, ధనిక తేడా లేకుండా అందరికీ వ్యాక్సిన్లు ఇచ్చాం. సాంకేతిక పరిజ్ఞానం వల్ల మారుమూల గ్రామాలకు టీకాల సరఫరా సాధ్యమైంది. పెద్ద పెద్ద దేశాల్లో టీకా పంపిణీ ఇప్పటికీ సమస్యగానే ఉంది. అభివృద్ది చెందిన దేశాల్లో టీకాలు తీసుకోవడానికి ప్రజలు ఇంకా ముందుకు రావట్లేదు. అలాంటిది భారత్లో 100 కోట్ల డోసులు వేయించగలిగాం. అది అందరికీ ఉచితంగానే అందించాం. సాధారణంగా భారత్ను ఎప్పుడూ ఇతర దేశాలతో పోలుస్తుంటారు. ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో అందరికీ టీకా సాధ్యమా అనే ప్రశ్నించినవారున్నారు. వాటన్నింటికీ నేటి 100 కోట్ల మైలురాయే సమాధానం’’ అని తెలిపారు.
ఆర్థిక వ్యవస్థ బలోపేతం..
‘‘వ్యాక్సిన్ల విజయంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. మన కంపెనీలకు పెట్టుబడులు బాగా వస్తున్నాయి. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తున్నాయి’’ అని మోదీ చెప్పుకొచ్చారు.
జాగ్రత్తగా ఉండండి..
100 కోట్ల డోసులను పంపిణీ చేసినప్పటికీ ఇంకా కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. రాబోయే దీపావళి పండగను దేశ ప్రజలంతా జాగ్రత్తగా జరుపుకోవాలని కోరారు. కరోనా నిబంధనలను మరవొద్దని అన్నారు. ఇప్పటికీ ఒక్క డోసూ తీసుకోని వారికి ప్రాధాన్యమివ్వాలని అధికారులకు సూచించారు. వ్యాక్సిన్ వేసుకున్నవారు ఇతరులు కూడా టీకాలు వేసుకునేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు
0 Response to "Modi: ‘100కోట్ల మైలురాయి’.. నవ భారత్కు ప్రతీక దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ"
Post a Comment