ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు సంక్షేమ నిధి పెంపు - ఉత్తర్వులు జారీ


ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు సంక్షేమ నిధి పెంపు

                           - ఉత్తర్వులు జారీ

ప్యారీస్‌(చెన్నై): విధినిర్వహణలో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు అందజేస్తున్న కుటుంబ సంక్షేమ నిధిని పెంచాలని డీఎంకే సర్కారు నిర్ణయించింది. ఈ కుటుంబ సంక్షేమ నిధిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలుగా పెంచుతూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తింపజేసిన ఈ పథకం ఇక నుంచి స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ప్రభుత్వ రాయితీ పొందుతున్న పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు, బోధనేతర సిబ్బందికి కూడా విస్తరింపజేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ.5 లక్షలుగా పెంచిన ఈ పథకం బుధవారం నుంచే అమలుకు వచ్చింది. దీనికి సంబంధించిన జీవో రాష్ట్రప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 1974 జనవరి 1వ తేదీ నుంచి విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున పింఛన్‌ పంపిణీ చేసే పథకం అమలుకు వచ్చింది. ప్రారంభంలో ప్రభుత్వ ఉద్యోగుల వద్ద ప్రతి నెలా రూ.10 ప్రీమియంగా వసూలు చేశారు. ఆ తర్వాత గత 2006 ఫిబ్రవరిలో ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్‌ను రూ.1.5 లక్షలుగా పెంచారు. ఇందుకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు పలురకాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన కారణంగా పదేళ్ల అనంతరం ఈ నిధిని రూ.3 లక్షలకు ప్రభుత్వం పెంచింది. ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ప్రతి నెలా ప్రీమియంగా రూ.60 వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం డ్యూటీలో వుండి మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల వారసులకు అందజేస్తున్న కుటుంబ సంక్షేమ నిధిని రూ.3 నుంచి రూ.5 లక్షలకు పెంచి, ప్రతినెలా రూ.110 ప్రీమియంగా వసూలుచేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలన్నీ హర్షం వ్యక్తం చేశాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు సంక్షేమ నిధి పెంపు - ఉత్తర్వులు జారీ"

Post a Comment