జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోల్‌, డీజిల్‌? 17న మండలి సమావేశంలో చర్చించే అవకాశం

దిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై శుక్రవారం జరగనున్న జీఎస్‌టీ మండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘పెట్రో’పై భారీగా వసూలు చేస్తున్న పన్ను ఆదాయంలో కొంత కోల్పోవడానికి సుముఖత చూపితేనే ఈ అంశంపై ఒక నిర్ణయానికి రావొచ్చు. పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తెస్తే వినియోగదార్లకు భారీగా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. దాదాపు 20 నెలల తర్వాత జీఎస్‌టీ మండలి సమావేశం ప్రత్యక్ష పద్ధతిలో లఖ్‌నవూలో జరగబోతోంది. 2019 డిసెంబరు 18 తర్వాత ఈ సమావేశాలు దృశ్య మాధ్యమ విధానంలోనే జరుగుతూ వచ్చాయి. ‘పెట్రోల్‌, డీజిల్‌లను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయమై జీఎస్‌టీ మండలి నిర్ణయం తీసుకోవాలి’ అని గత జూన్‌లో కేరళ హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌-19 ఔషధాలు, ఆక్సిజన్‌, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు వంటి వాటిపై పన్ను మినహాయింపులను కొనసాగించే అంశంపైనా చర్చిస్తారని సమాచారం.

కేంద్ర సుంకంతో సహా వ్యాట్‌ రూపంలో పెట్రోల్‌, డీజిల్‌పై ప్రస్తుతం రిటైల్‌ విక్రయ ధరలో 50 శాతం పన్నులే ఉంటున్నాయి. ఒకవేళ వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే గరిష్ఠ పన్ను 28 శాతంతో సహా ఫిక్స్‌డ్‌ సర్‌ఛార్జి ఉండే అవకాశముంది. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కొంత తగ్గుతాయి.

కేంద్రం ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌పై రూ.32.80, డీజిల్‌పై రూ.31.80 సుంకం విధిస్తోంది. ఈ పన్ను మొత్తం కేంద్ర ఖాతాలోకే వెళుతోంది. జీఎస్‌టీ పరిధిలోకి వస్తే రాష్ట్రాలు, కేంద్రం మధ్య 50-50 నిష్పత్తిలో ఆదాయాలు పంచుకోవాల్సి ఉంటుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోల్‌, డీజిల్‌? 17న మండలి సమావేశంలో చర్చించే అవకాశం"

Post a Comment