బడి గంట మోగేది నేడే! ‘నాడు-నేడు’ పనులను ప్రజలకు అంకితం చేయనున్న సీఎం

ఈనాడు, అమరావతి: కరోనా రెండో దశ విజృంభణతో గత ఏప్రిల్‌ 20న మూసివేసిన విద్యా సంస్థల్లో సోమవారం సందడి మొదలు కానుంది. రాష్ట్రంలో పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు నేడు పునఃప్రారంభం కానున్నాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ 1-10 తరగతులు, ఇంటర్‌ రెండో ఏడాది వారికి తరగతులను నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 61,137 ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. 


గదుల కొరత ఉన్న విద్యా సంస్థల్లో రెండు విడతలుగా తరగతులను నిర్వహిస్తారు. మరోవైపు.. పూర్తయిన ‘నాడు నేడు’ మొదటి దశ పనులను తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం పాఠశాలలో సోమవారం సీఎం జగన్‌ ప్రారంభించి, విద్యార్థులకు అంకితం చేయనున్నారు. అక్కడే రెండో విడత పనులకూ శ్రీకారం చుడతారు. ‘విద్యా కానుక’ కిట్లు విద్యార్థులకు పంపిణీ చేస్తారు

10 రకాల సదుపాయాలు: రాష్ట్ర వ్యాప్తంగా 44,639 పాఠశాలలు ఉండగా.. 15,715 బడుల్లో ‘నాడు-నేడు’ మొదటి దశ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ పనుల్లో భాగంగా భవనాలకు రంగులేసి, 10 రకాల మౌలిక సదుపాయాలు కల్పించారు. కొన్నిచోట్ల పనులు పెండింగ్‌లో ఉండడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. మరుగుదొడ్ల పరిశుభ్రతకు నియమించిన ఆయాలకు గతంలో హామీ ఇచ్చిన మేరకు నెలకు రూ.6వేలు చెల్లించాలని ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ బడుల్లో చదివే 45.38లక్షల మందికి రెండో విడత ‘విద్యా కానుక’ అందించనున్నారు. ఈ కిట్లలో ఉండే బ్యాగ్‌లు, ఏకరూప దుస్తులు, బూట్లు చాలా బడులకు చేరలేదు. బ్యాగ్‌లు 10లక్షలు, ఏకరూప దుస్తులు ఐదారు లక్షలు అందించాల్సి ఉంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "బడి గంట మోగేది నేడే! ‘నాడు-నేడు’ పనులను ప్రజలకు అంకితం చేయనున్న సీఎం"

Post a Comment