పాఠశాల బ్యాగుల టెండరుపై తీర్పు రద్దు
అమరావతి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యాకానుక కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే బ్యాగుల కోసం ఈ ఏడాది మార్చి 15న ఇచ్చిన టెండర్ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. ఈ వ్యవహారంపై మొదట నుంచీ విచారణ జరపాలంటూ వ్యాజ్యాన్ని తిరిగి సింగిల్ జడ్జి వద్దకు పంపించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూ్పకుమార్ గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. అట్ల ప్లాస్టిక్స్ దాఖలు చేసిన వ్యాజ్యంలో.. ప్రభుత్వం జారీ చేసిన టెండర్ను రద్దు చేయడంతో పాటు తాజాగా టెండర్ పిలవాలంటూ సింగిల్ జడ్జి ఏప్రిల్ 19న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. టెండర్ దక్కించుకున్న శివ్ నరేష్ స్పోర్ట్స్ తరఫు న్యాయవాది అజయ్ కొహ్లీ వాదనలు వినిపించారు. తాము ప్రతివాదిగా ఉన్నా నోటీసులు ఇవ్వకపోవడంతో సింగిల్ జడ్జి వద్ద వాదనలు వినిపించుకునే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన టెండర్ ప్రకటన నిబంధనలకు విరుద్ధంగా ఉందని అట్ల ప్లాస్టిక్స్ తరఫు న్యాయవాది సుబోధ్ తెలిపారు. తీర్పు వెల్లడించే నాటికి శివ్ నరేష్ స్పోర్ట్స్తో ఒప్పందం చేసుకున్నట్లు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని ఆరోపించారు
0 Response to "పాఠశాల బ్యాగుల టెండరుపై తీర్పు రద్దు"
Post a Comment