కొత్త జిల్లాల భారం.. 1,300 కోట్లు?

అధికారుల ప్రాథమిక అంచనా!.. ఖజానాకు భారమన్న సీఎం

మరింత తగ్గించాలని సూచన.. సమీక్షలో ఆర్థికంపై చర్చ

ఆఫీసులకు కొత్త భవనాల ఊసొద్దు.. అవసరమైతేనే అద్దెకు

అందుబాటులోని వనరులే వినియోగం

డిసెంబరుకల్లా ఆరు కీలకాంశాలపై స్పష్టత

ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం




అమరావతి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకయ్యే ఖర్చు ఎంత? జిల్లాల పునర్విభజన, ఆఫీసుల ఏర్పాటు, ఆస్తుల పంపిణీ, ఇతర మౌలిక వనరుల క ల్పనకు ఎంత వ్యయం కానుంది.. అన్న అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఏడాది జనవరి నాటి అంచనాల ప్రకారం రూ.1,300 కోట్ల వ్యయమవుతుందని ప్రాథమిక పరిశీలనలో తేలినట్లు తెలిసింది. ఇంత ఖర్చంటే ఖజానాకు భారమని, మరింతగా తగ్గించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించినట్లు తెలిసింది. సోమవారం క్యాంపు కార్యాలయంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎ్‌స.రావత్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పరిశీలనకు సీఎస్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీతో జరిగిన ఈ భేటీలో ప్రధానంగా ఆర్థికపరమైన అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల పునర్విభజన చేసి కొత్తగా 25 లేదా 26 ఏర్పాటు చేయాలి.


ఆర్థిక వనరులతో పాటు ఉద్యోగులు, ఆస్తుల కేటాయింపు, ఆఫీసులను సమకూర్చుకోవడం వంటి అనేక అంశాలు దీనితో ముడిపడి ఉన్నాయి. జిల్లాల ఏర్పాటు అన్ని కోణాల్లో పూర్తిచేయడానికి కనీసం రూ.1,300 కోట్లు ఖర్చు కానుందని ఈ ఏడాది జనవరిలోనే సీఎంకు నివేదిక ఇచ్చారు. అయితే అప్పటికి ఇంకా జిల్లాల ఏర్పాటు ఎలా ఉండాలి? వనరుల వినియోగంపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. ఈ నేపఽథ్యంలో రూ.1,300 కోట్ల ఖర్చు భారమని తాజాగా భావిస్తున్నారు. ‘కొత్త జిల్లాల ఏర్పాటే పరిపాలనా సౌలభ్యం కోసం. ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు. కాబట్టి మోయలేని ఆర్థిక భారాలు వద్దు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం రావాలి. ప్రస్తుతానికి కొత్త భవనాలు, మరొకటి ఇప్పుడే వద్దు. అందుబాటులో ఉన్న వన రులను ఉపయోగించుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే అద్దె భవనాలను ఎంపికచేయండి’ అని సీఎం సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో ప్రభుత్వ ఆఫీసులకు కొరత ఉంటే అద్దె భవనాలను సమకూర్చుకోవాలని అన్నట్లు సమాచారం. సరిహద్దులు, న్యాయపరమైన అంశాలేవీ పెండింగ్‌లో లేకుండా పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.


రాజకీయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకునే అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. గత కొద్దిరోజులుగా జిల్లాలపై ముందుకొస్తున్న వివాదాల నేపఽథ్యంలో కొత్త సమస్యలు రాకుండానే పరిష్కారం ఉండాలని సూచించినట్లు సమాచారం. ‘ప్రజల ఆభీష్టాలు, ఆ ప్రాంత ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలు, ఇంకా అనేక సున్నితమైన అంశాలు పరిశీలన చేయాలి’ అని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. డిసెంబరు నెలాఖరు నాటికి కీలకమైన ఆరు అంశాలపై స్పష్టత తీసుకురావాలని ఆయన ఆదేశించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కొత్త జిల్లాల భారం.. 1,300 కోట్లు?"

Post a Comment