మనోవికాస కేంద్రాలుగా అంగన్‌వాడీలు


 మనోవికాస కేంద్రాలుగా అంగన్‌వాడీలు

మంచి విద్య, పౌష్టికాహారం అందిస్తాం
ఆంగ్ల మాధ్యమంతో గట్టి పునాది వేసేలా మార్పులు
వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ పథకాలను ప్రారంభించిన సీఎం జగన్‌



ఈనాడు డిజిటల్‌, అమరావతి: మంచి విద్య, పౌష్టికాహారం అందించి అంగన్‌వాడీలను మనో వికాస కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ పథకాలను ఆయన మీట నొక్కి ప్రారంభించారు. పౌష్టికాహార కిట్లను చిన్నారులకు అందించారు. సంపూర్ణ పోషణ యాప్‌ను ఆవిష్కరించారు. ‘గతంలో పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా? లేదా? ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా? లేదా? వారి తల్లులు ఎలా ఉన్నారనే ఆలోచన ఎవరూ చేయలేదు. అందుకే చాలీచాలని నిధులు కేటాయించారు. ప్రస్తుతం ఈ పరిస్థితిని మార్చబోతున్నాం. 6 నెలల నుంచి 6 ఏళ్ల వయసున్న చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు ఈ పథకాలను అమలు చేయబోతున్నాం. వీటివల్ల రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో 30.16 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఏడాదికి 77 గిరిజన మండలాల్లో 3.8 లక్షల మందికి రూ.308 కోట్లు, మిగతా ప్రాంతాల్లో 26.36 లక్షల మందికి రూ.1,556 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. మొత్తంగా రూ.1,864 కోట్లు వ్యయం కానుంది. గతంలో ఏడాదికి రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా తాము రూ.1,300 కోట్లపైన అదనంగా ఖర్చు చేస్తున్నాం’ అని సీఎం జగన్‌ వివరించారు

53% మంది గర్భిణుల్లో రక్తహీనత...
‘రాష్ట్రంలోని గర్భిణుల్లో 53% మందిలో రక్తహీనత ఉంది. 31.9% పిల్లలు తక్కువ బరువుతో జన్మిస్తున్నారు. 17.2% మంది చిన్నారులు బరువుకు తగ్గ ఎత్తు లేరు. వయసుకు తగ్గ ఎత్తు లేని వారు 32% మంది ఉన్నారు. పేదల ఇళ్లలోని పిల్లలు, వారి తల్లిదండ్రులకు పోషకాహారం లేకపోతే బలహీనత, రక్తహీనతతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. రోజూ పెట్టే ఆహారం గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తినడానికి ఆసక్తిగా ఉండాలి. అవసరమైతే మెనూలో మార్పులు తీసుకురావాలి. ఎక్కువ ఖర్చయినా ఫర్వాలేదు’ అని సీఎం పేర్కొన్నారు.

పేద పిల్లలు గొప్పగా చదవాలనే ఆంగ్ల మాధ్యమం
‘పేద పిల్లలు గొప్పగా చదివి రాణించాలన్న తాపత్రయంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య (పీపీ-1, పీపీ-2) అమలు చేస్తున్నాం. ఆంగ్ల మాధ్యమంతో గట్టి పునాది వేసేలా మార్పులు చేస్తున్నాం. ఆటపాటలు, మాటల ద్వారా విద్యా బోధన అందిస్తాం. ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో రూపం మార్చుకున్న అంటరానితనం కనిపిస్తోంది. వారి మనసు మారాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ జిల్లాలకు చెందిన పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. ‘అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం తీసుకోవడం వల్ల రక్తహీనత లేకుండా ఉన్నాం. నెలకు సరిపడా పోషకాహారాన్ని ఇంటికే పంపుతున్నారు. ప్రతి నెలా ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. నవరత్నాల పథకాలు మాకు ఉపయోగపడుతున్నాయి’ అని పలువురు లబ్ధిదారులు తెలిపారు




SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " మనోవికాస కేంద్రాలుగా అంగన్‌వాడీలు"

Post a Comment