ఎఫ్డీలపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్బీఐ
దిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీ)లపై వడ్డీ రేట్లను తగ్గించింది. అన్ని కాలావధి ఎఫ్డీలపై 40 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. తగ్గించిన వడ్డీ రేట్లను నేటి (మే 27) నుంచే అమల్లోకి వస్తున్నట్లు ఆ బ్యాంక్ తన వెబ్సైట్లో పేర్కొంది.
దాదాపు నెల రోజుల వ్యవధిలోనే వడ్డీ రేట్లు తగ్గించడం ఇది రెండో సారి కావడం గమనార్హం. చివరి సారిగా మే 12న వడ్డీ రేట్లను ఎస్బీఐ తగ్గించింది.
తాజాగా సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం.. ఇకపై 7 నుంచి 45 రోజుల కాలావధి కలిగిన ఎఫ్డీలపై 2.9 శాతం వడ్డీ మాత్రమే లభించనుంది. 46 నుంచి 179 రోజులు 3.9%; 180 నుంచి ఏడాది వరకు 4.4%; ఒక ఏడాది నుంచి 3 ఏళ్ల వరకు 5.1%, మూడేళ్ల నుంచి 5 ఏళ్ల వరకు 5.3%, ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల వరకు 5.4 % చొప్పున వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. సీనియర్ సిటిజన్లకు సవరించిన వడ్డీ రేట్లకు 50 బేసిస్ పాయింట్ల అదనంగా వడ్డీ జమ చేయనున్నారు. అంటే 3 నుంచి 5 ఏళ్ల వరకు డిపాజిట్లపై 5.3 శాతం ఉండగా.. సీనియర్ సిటిజన్లకు 5.8% శాతం చెల్లించనున్నారు

0 Response to "ఎఫ్డీలపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్బీఐ"
Post a Comment