కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల కీలక ప్రకటన.. వచ్చే రెండు నెలల పాటు

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో విడత ప్యాకేజీ వివరాలను వెల్లడించేందుకు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వలస కార్మికులను కేంద్రం విస్మరించలేదని చెప్పారు. వలస కార్మికులకు మూడు రకాల ప్రయోజనాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. వచ్చే రెండు నెలలకు ఆహార ధాన్యాలు ఉచితంగా ఇస్తామని నిర్మల ప్రకటించారు



. రేషన్‌కార్డు లేని వాళ్లకు కూడా ఈ ఆహార ధాన్యాలు అందేలా చర్యలు తీసుకున్నామని ఆమె చెప్పారు.  ఇది వలస కార్మికులకు ఊరట కలిగించే విషయం. ఈ పథకం ద్వారా 8 కోట్ల మంది వలస కార్మికులు లబ్ధి పొందబోతున్నారని వివరించారు. ఇందు కోసం రూ. 3500 కోట్లు కేటాయిస్తున్నామని, వలస కార్మికులకు కేంద్రం అందించే ఆహార ధాన్యాలు చేరవేసేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలేనని నిర్మల స్పష్టం చేశారు. కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారో, అందరికీ ఆహార ధాన్యాలు అందేలా చూడాల్సిన బాధత్య రాష్ట్రాలదేనని ఆమె తేల్చిచెప్పారు.


కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే విపత్తు నిర్వహణ నిధులను వలస కార్మికులు, పట్టణ పేదలకు భోజన వసతి సౌకర్యాల కోసం కేటాయించే వెసులుబాటు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రెండు నెలల్లో 11 వేల కోట్లు కేంద్రం నిధులను ఖర్చుపెట్టుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కల్పించినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో నిలువ నీడ లేని వాళ్లు.. మూడు పూటల ముద్ద తినేందుకు కేంద్రమే రాష్ట్రాలకు నిధులు కేటాయించి ఖర్చు పెట్టించిందని గుర్తుచేశారు. 


సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్తున్న వలస కూలీల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 40 నుంచి 50 శాతం అదనంగా పని కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. నరేగా లాంటి పనులను వారు తమ సొంత ప్రాంతాల్లో చేసేందుకు కేంద్రం అవకాశం కల్పించినట్లు చెప్పారు.హార్టికల్చర్‌, పశుపోషణ, మొక్కల పెంపకం లాంటి పనులతో వారికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలు అమలయ్యేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


పొరుగు రాష్ట్రాల నుంచి వలస కార్మికులను రప్పించుకునేందుకు సంస్థలకు అవకాశం కల్పించామని, అలాగే సంస్థలతో నేరుగా ఒప్పందం చేసుకున్న కార్మికుల హక్కుల రక్షణకు ప్రత్యేక నిబంధనలు రూపొందించామని నిర్మల వెల్లడించారు. కనీస హక్కుల రక్షణ కోసం కేంద్రం కట్టుబడి ఉందని చెప్పేందుకు ఇవన్నీ ఉదాహరణలని చెప్పుకొచ్చారు. కార్మికులందరికీ సోషల్‌ సెక్యూరిటీ పథకాలు వర్తించాలని, కెమికల్ లాంటి ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేసే కార్మికులందరికీ ఈఎస్‌ఐ సదుపాయం ఉండాలని ఇప్పటికే కఠిన నిబంధనలు తెచ్చామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగ కాలానికి గ్రాట్యూటీ ఉండాలని, అసంఘటిత రంగ కార్మికులకు కనీస భద్రత ఉండేలా కేంద్రం చర్యలు తీసుకుందని చెప్పారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల కీలక ప్రకటన.. వచ్చే రెండు నెలల పాటు"

Post a Comment