50శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయొద్దు
దిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతానికి మించి రిజర్వేషన్ల అమలు కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
పలువురు నేతలు ..ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వలేదని పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించింది
2010లో కె.కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా మొత్తం కలిపినా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని తీర్పు వెలువరించింది.
తాజాగా మరోసారి ఈ తీర్పును జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది. ఇందిరా సహానీ కేసులో, 2016లో వచ్చిన జయరాజు కేసులో కొన్ని మినహాయింపులకు అవకాశాలు ఉన్నాయని, చట్టం ఓపెన్ అని ఉన్నదని రామ్మోహన్నాయుడు తరఫు సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. 2010లో తీర్పు వచ్చిన సందర్భంలో బీసీ జనగణన డేటా లేదని, ప్రస్తుతం ఆ డేటా అంతా నమోదై ఉందని కామత్ వివరించారు.
అవేమీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదని తేల్చి చెప్పిన ధర్మాసనం పిటిషన్ను తోసిపుచ్చింది
0 Response to " 50శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయొద్దు "
Post a Comment