త్వరలోనే పీఆర్సీ అమలు

  • ఇప్పటికే సీఎం స్పష్టత ఇచ్చారు
  • దీనికి గడువుతో సంబంధం లేదు
  • శాసన మండలిలో మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌, మార్చి 13(ఆంధ్రజ్యోతి): వేతన సవరణ కమిషన్‌ (పీఆర్సీ) గడువు పెంపునకు, పీఆర్సీ ప్రకటించడానికి సంబంధం లేదని, అవి రెండూ వేర్వేరు అంశాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దీనిపై సీఎం కేసీఆర్‌ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని, త్వరలోనే పీఆర్సీని అమలు చేస్తామని చెప్పారు. శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, నర్సిరెడ్డి, రామచంద్రరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు. తాము ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు




సంక్షేమ పథకాల అమలు కోసం నిరర్థక ఆస్తులు అమ్మి నిధులు సమకూర్చుకుంటామని స్పష్టం చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు లోబడే తాము అప్పులు చేశామని చెప్పారు. అర్హత గల ప్రతి పేదవాడికీ ఇల్లు ఇస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న 2.72లక్షల ఇళ్లకు అదనంగా సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే లక్ష మందికి ఆర్థిక సాయం చేసేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. కేంద్రం ఈ ఏడాది రాష్ట్రానికి రూ.3,900 కోట్లను తగ్గించిందని ఆరోపించారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు రూ.24వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ ప్రతిపాదించగా.. కేంద్రం ఒక్క రూపాయీ ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి గ్రాంట్ల కింద రావాల్సిన రూ.4,595 కోట్లను తగ్గించి, రూ.1435 కోట్ల మేర అప్పు తీసుకునేందుకు అనుమతి ఇవ్వడం మరో విడ్డూరమని అన్నారు. రాష్ట్రానికి రూ.730 కోట్ల గ్రాంట్‌ ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదించగా పునఃపరిశీలించాలని కేంద్రం తిప్పి పంపిందని, చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు.

త్వరలోనే వర్సిటీల్లో పోస్టుల భర్తీ

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక మొత్తం 1,50,260 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చామని, వీటిలో 1,32,889 పోస్టులకునోటిఫికేషన్‌ జారీ చేశామని హరీశ్‌ తెలిపారు. 1.23లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. మరో 27వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందన్నారు. వర్సిటీల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, అలహాబాద్‌ హైకోర్టు తీర్పు నేపథ్యంలో బ్రేక్‌ పడిందన్నారు. దీన్ని ఇటీవలే కేంద్రం పరిష్కరించిందని, త్వరలోనే పోస్టులను భర్తీ చేస్తామన్నారు.

విద్యార్థుల సంఖ్య తగ్గడం వల్లే..

ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్ల మాదిరిగా హైదరాబాద్‌లోని స్కూళ్లను అభివృద్ధి చేస్తామని హరీశ్‌ ప్రకటించారు. రెసిడెన్షియల్‌ స్కూళ్ల తరహాలోనే ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తామన్నారు. వివిధ శాఖలతో కలిపి విద్యారంగానికి బడ్జెట్‌లో 12.45 శాతం నిధులు కేటాయించినట్లు తెలిపారు. స్కాలర్‌షి్‌పలకు నిధులు తగ్గించలేదని, ఇంజనీరింగ్‌ విద్యార్థుల సంఖ్య తగ్గడం వల్లే నిధులు తగ్గాయని పేర్కొన్నారు. దశల వారీగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "త్వరలోనే పీఆర్సీ అమలు"

Post a Comment