ఉగాది పండగ విశిష్టత

ఉగాది పండగ విశిష్టత! ఉగాది నామాలు వివరణ!! ఉగాది పచ్చడి ఎలా చేయాలి!!!
ఉగాది పండగ విశిష్టత! ఉగాది నామాలు వివరణ!!
అందరికీ "శార్వరి" నామ ఉగాది శుభాకాంక్షలు"

ఉగాది పండగ విశిష్టత 
తెలుగు నూతన సంవత్సరాది ఉగాది. ఈ పండగ జరుపుకోని తెలుగు వారు ఉండరు. ఈ ఉగాది ఒక్క తెలుగువారే కాకుండా దక్షినాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజైన చైత్ర శుద్ధ  పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు.
కొత్త సంవత్సరాదైన ఉగాది నుండే వసంతకాలం మొదలవుతుంది. వాతావరణం ఈ రోజు నుండి ప్రత్యేక అందాలను సంతరించుకొంటుంది. ఈ సమయంలో వృక్షాలు కొత్త ఆకులు, పూలతో చూపరులను ఆహ్లాదపరుస్తాయి.
ఉగాది లేదా యుగాది అనే పదాలు సంస్కృతం నుండి వచ్చినవి. "యుగ" అనగా కాలమని "ఆది" అంటే ఆరంభం అని అర్ధం. తెలుగువారు "ఉగాది" అని కన్నడిగులు "యుగాది" అని మరాఠీలు "గుడి పాడ్వా" గా ఈ పండగని జరుపుకుంటారు. ప్రవాసులు తమ తమ దేశాల్లో "ఉగాది"ని ఆచారాలకనుగుణంగా నిబద్ధతతో జరుపుకొని విదేశీయుల దృష్టిని ఆకర్షిస్తుంటారు.
ఉగాది రోజున కొత్త పనులు, నిర్ణయాలు ప్రారంభించే సమయమని తెలుగు ప్రజలు నమ్ముతారు.  అంతే కాకుండా ఈరోజు కొత్త వస్తువులను కూడా కొని ప్రారంభించటం ఆనవాయితీ.
ఈ సంవత్సరం అనగా 2020లో శార్వరి నామ సంవత్సర ఉగాదిగా  మార్చి నెల 25వ తారీఖున జరుపుకోబడుతుంది. 



ఉగాది చరిత్ర కోణం 
బ్రహ్మ విశ్వ సృష్టిని ప్రారంభించిన రోజునే ఉగాది పండగ అని పురాణాల ప్రవచనం. ఈ ఉగాది పండగ చారిత్రిక వివరాలను కూడా కలిగి ఉంది. ఉగాది పండగ శాలివాహనుల కాలం నుండి ఆచరణలో ఉన్నాదని చరిత్రకారుల మాట. అప్పటి శాలివాహనుల రాజు "గౌతమీపుత్ర శాతకర్ణి"గా పేర్గాంచిన రాజా శాలివాహన ఉగాది పండగకు శ్రీకారం చుట్టారు.

చాంద్రమాన కాలం ప్రకారం ఒక యుగానికి 60 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకొనే ఉగాదికి ఒక పేరు చొప్పున 60 పేర్లు పెట్టినట్లు చరిత్ర చెపుతోంది. ఈ 60 ఉగాది నామ సంవత్సరాల తరువాత వచ్చే ఉగాదికి తొలి సంవత్సరపు ఉగాది పేరుతొ తిరిగి ప్రారంభం అవుతుంది.

ఉగాది సంవత్సరాల నామాలు - వివరణ 
ఉగాది నూతన సంవత్సరం భారతదేశంలో తెలుగు మాట్లాడే ప్రజల కొత్త సంవత్సర వేడుక. ప్రతి యుగానికి 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ప్రతి ఉగాదికి జ్యోతిష శాస్త్ర ప్రభావాల ఆధారంగా పంచాంగంలో ఒక ప్రత్యేక పేరు ఉంది. ఈ ఉగాది నామ సంవత్సరం ఆ యొక్క సంవత్సరపు ప్రత్యేకతని తెలుపుతుంది. ఇలా 60 సంవత్సరాల పేర్లు ఉన్నవి. ఆ ఉగాది పేర్లు మీకోసం దిగువన ఇవ్వబడ్డాయి. అయితే ఈ 2020 ఉగాది శార్వరి నామ సంవత్సరంగా పిలువబడుతుంది.

1.ప్రభవ, 2.విభవ, 3.శుక్ల, 4.ప్రమోద్యూత, 5.ప్రజోత్పత్తి, 6.ఆంగీరస, 7.శ్రీముఖ, 8.భావ, 9.యువ, 10.ధాత, 11.ఈశ్వర, 12.బహుధాన్య, 13.ప్రమాధి, 14.విక్రమ, 15.వృష, 16.చిత్రభాను, 17.స్వభాను, 18.తారణ , 19.పార్థివ, 20.వ్యయ, 21.సర్వజిత, 22.సర్వధారి, 23.విరోధి, 24.వికృతి, 25.ఖర, 26.నందన, 27.విజయ, 28.జయ, 29.మన్మధ, 30.దుర్ముఖి, 31.హేవళంబి, 32.విళంబి, 33.వికారి, 34.శార్వరి, 35.ప్లవ, 36.శుభకృత, 37.శోభకృత, 38.క్రోధి, 39.విశ్వావసు, 40.పరాభవ, 41.ప్లవంగ, 42.కీలక, 43.సౌమ్య, 44.సాధారణ, 45.విరోధికృత, 46.పరిధావి, 47.ప్రమాదీచ, 48.ఆనంద, 49.రాక్షస, 50.నల, 51.పింగళ, 52.కాళయుక్తి, 53.సిద్ధార్థ, 54.రౌద్రి, 55.దుర్మతి, 56.దుందుభి, 57.రుధిరోద్గారి, 58.రక్తాక్షి, 59.క్రోధన, 60.అక్షయ.

ఉగాది జరుపుకొనే విధానం  
ఉగాది పర్వదినాన మొదటగా గృహాన్ని కడిగి పరిశుభ్రం చేస్తారు. ముంగిట్లో ఆవు పేడ ముద్దతో రంగోలి ముగ్గులు వేసి, ఇళ్ళ ప్రవేశ ద్వారాలకు మామిడాకుల తోరణాలతో అందంగా అలంకరిస్తారు. మామిడి ఆకులు మరియు కొబ్బరికాయలు హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనవిగా భావించబడతాయి. ప్రజలు ముందుగా ప్రాతః కాలంలో లేచి శిరస్నానం చేసి, కొనుగోలు చేసిన నూతన వస్త్రాలను ధరిస్తారు. అంతేకాకుండా కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. గృహంలో పెద్దల ఆశీస్సులను తీసుకొని, షడ్రుచుల ఉగాది పచ్చిదిని ఆరగించిన పిదప ఆలయ సందర్శన చేసిన తదుపరి పంచాంగ శ్రవణంలో పాల్గొంటారు.
ఉగాది ప్రత్యేక వంటకాలు 
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో "బొబ్బట్లు", "పూర్ణం బూరెలు" విధిగా చేస్తారు.ఈ రెండు వంటకాలు తెలుగు ప్రజల పూజల్లో "పవిత్ర వంటకాలు"గా నిలుస్తాయి. తెలుగు ప్రజలు ఈ రెండు వంటకాలను తాజా ఆవు నెయ్యిని జోడించి ఆరగిస్తారు.
ఉగాది పచ్చడి విశిష్టత
"ఉగాది"నాడు చేసుకొనే పచ్చడి ఎంతో ప్రాముఖ్యమైనది. షడ్రుచుల పచ్చడిని ఆరగించడం వెనుక జీవితసారం గోచరిస్తుంది. ఈ పచ్చడిలో మధురం(తీపి), ఆమ్లం(పులుపు), కటు(కారం), కషాయ(వగరు), లవణం(ఉప్పు), తిక్త(చేదు) రుచులు మిళితమై ఉంటాయి.

ఈ ఆరు రుచులు జీవతంలో ఎదురయ్యే సంతోషం(తీపి), దుఃఖం(చేదు), కోపం(కారం), భయం(ఉప్పు), విసుగు(చింతపండు), ఆశ్చర్యం/సంభ్రమం(మామిడి) సమ్మేళనం. అంతేకాకుండా ఈ ఆరు రుచులు ఆరు రకాలైన లాభాలను కలుగచేస్తున్నవి.
కొత్త బెల్లం ఆకలిని కలిగిస్తుంది.
చింతపండు కఫ వాతాల్ని పోగొడుతుంది.
మిరియపు పొడి శరీరంలో క్రిముల్ని నాశనం చేస్తుంది.
మామిడి ముక్క జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది.
వేప పువ్వు చేసే మేలు పలు విధాలుగా ఉంటుంది.
ఉగాది పచ్చడి తాయారు చేసే విధానం 
ఒకటిన్నర కప్పు నీరు.
రెండు టేబుల్ స్పూన్ల మామిడి తరుగు.
కొద్దిపాటి వేప పువ్వులు.
మూడు టేబుల్ స్పూన్ల బెల్లం.
తగినంత ఉప్పు.
తగినంత మిరియాల పొడి.
ఒక టేబుల్ స్పూన్ చింతపండు రసం.
ఉగాది పంచాంగ శ్రవణం 
ఈ రోజు యుక్త వయస్కులు, నడివయస్కులు, వృద్ధులు, రాజకీయ నాయకులు, వృత్తి నిపుణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు ఎంతో శ్రద్ధగా వారి వారి స్థాయిల్లో పంచాంగ శ్రవణం చేయటం పరిపాటి. వారి రాశి ఫలాలను నూతన సంవత్సరాదిన ఎలా ఉండబోతుందో మిక్కిలి ఆశక్తితో జ్యోతిష్య పండితులు చేసే పంచాంగ పఠనాన్ని ఎంతో జాగ్రత్తగా ఆశక్తితో వింటారు.
ఉగాది శుభాకాంక్షలు 
ఈ నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని ఒకరినొకరు "నూతన ఉగాది శుభాకాంక్షలు" తెలియపరచుకోవటం పరిపాటి. పిల్లలు పెద్దల పాదాలను తాకి ఆశీస్సులు తీసుకొంటారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉగాది పండగ విశిష్టత"

Post a Comment