జూన్‌ 1 నాటికి విద్యా కానుక కిట్‌

 ఏకగ్రీవంగా శాసనసభ తీర్మానం ఆమోదం 
- రైట్‌ టు ఇంగ్లీషు మీడియం ఎడ్యుకేషన్‌ మా దృఢ సంకల్పం 
- ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో 
జూన్‌ ఒకటి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 36.10 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్‌ను అందజేయనున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఇందు కోసం దాదాపు రూ.487 కోట్లు ఖర్చవుతుందని, అయినా పేద కుటుంబాల కోసం ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. గత సెషన్‌లోనే ఈ బిల్లును ఆమోదించినప్పటికీ కొన్ని సవరణలు కోరుతూ శాసనమండలి వెనక్కి పంపించింది. దీంతో గురువారం మరోసారి బిల్లును శాసనసభలో వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టారు



తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంపై జరిగిన చర్చలో భాగంగా సిఎం మాట్లాడుతూ.. రైట్‌ టు ఎడ్యుకేషన్‌ కాదు.. రైటు టు ఇంగ్లీషు మీడియం ఎడ్యుకేషన్‌ తమ దృఢ సంకల్పమని అన్నారు.

నిరుపేద కుటుంబాల పిల్లల భవిష్యత్తు మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ప్రైవేటు స్కూళ్లలో వేలకు వేలు ఫీజులు కట్టలేక ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా ఇంగ్లీషు మీడియం వస్తే తమ బతుకులు మారుతాయని దశాబ్దాలుగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ, ఒసిల్లోని పేద వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టాలన్న నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 45 వేల పాఠశాలలు ఉండగా ప్రభుత్వ, ప్రైమరీ పాఠశాలల్లో 23.67 శాతమే ఇంగ్లీషు మీడియం ఉందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 98.5 శాతం పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుతున్నారన్నారు. కంప్యూటర్‌లో మనకు కనిపించేది ఇంగ్లీషు మాత్రమేనని, మెరుగైన జీతాలు రావాలంటే ఇంగ్లీషు చక్కగా మాట్లాడగలిగితేనే అవి వస్తాయని తెలిపారు.

అందుకే ఈ మీడియాన్ని తీసుకురావాలని బిల్లు తీసుకొచ్చామన్నారు. సవరణలు కోరుతూ మండలిలో తిరస్కరించి పంపారన్నారు. అమ్మ ఒడి, ఇంగ్లీషు మీడియం, నాడు-నేడులో స్కూళ్ల మార్పు, పిల్లలకు మధ్యాహ్న భోజన మెనూలో మార్పులు చేసి గోరుముద్ద అని పేరు పెట్టామని, ఈ విధంగా ప్రతి అడుగులోనూ పిల్లల జీవితాల మార్పు కోసం ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జూన్‌ 1 నాటికి విద్యా కానుక కిట్‌"

Post a Comment