‘నాడు-నేడు’కు కార్పొరేట్‌ సాయం


  • ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం
  • విద్య, వైద్యంపై దృష్టి తప్పదు: సీఎం8 85 కోట్లు ఇచ్చిన ఐదు సంస్థలు
  • ‘కనెక్ట్‌ టు ఆంధ్రా’ కింద 2,566 స్కూళ్లలో వసతులు
  •  సీఎం సమక్షంలో ఎంవోయూ


అమరావతి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘నాడు-నేడు’ కార్యక్రమానికి తలో చేయి అందించండి. రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. అలాగని దృష్టి పెట్టాల్సిన అంశాలను విస్మరించలేం. ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాలపై కచ్చితంగా దృష్టి పెట్టాల్సిందే. అందుకే మీ సహకారాన్ని కోరుతున్నాం’ అని సీఎం వైఎస్‌ జగన్‌ కార్పొరేట్‌ సంస్థలకు తెలిపారు. సహాయం చేసేవారి పేర్లు కూడా పెడతామని.. నాడు-నేడు గురించి ఇతర సంస్థలకూ చెప్పాలని విజ్ఞప్తి చేశారు. గురువారమిక్కడ ‘నాడు-నేడు’ కార్యక్రమంపై ఆయన సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చేందుకు ఐదు కార్పొరేట్‌ సంస్థలు ముందుకొచ్చాయి. ‘కనెక్ట్‌ టు ఆంధ్రా’ కింద హెటిరో, వసుధ ఫార్మా, ఆదిలీల ఫౌండేషన్‌, రెయిన్‌ కార్బన్‌, లారస్‌ ల్యాబ్స్‌ సంస్థలు రాష్ట్రంలోని 2,566 ప్రభుత్వ స్కూళ్లలో రూ.85.65 కోట్లతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి 

యా సంస్థలు గురువారం ముఖ్యమంత్రి సమక్షంలో అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం హెటిరో సంస్థ కడప జిల్లా చక్రాయపేట, జమ్మలమడుగు, లింగాల, పులివెందుల, సింహాద్రిపురం, తొండూరు, వేంపల్లి, వేముల మండలాల్లోని 402 పాఠశాలల్లో రూ.20 కోట్లు ఖర్చు చేస్తుంది. వసుధ ఫార్మా సంస్థ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, పాలకొల్లు, పాలకోడేరు, పోడూరు, వీరవాసరం మండలాల్లోని 428 పాఠశాలల్లో అభివృద్ధి పనులకు రూ.21 కోట్లు వ్యయం చేస్తుంది. రెయిన్‌ కార్బన్‌ సంస్థ కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలోని 66 పాఠశాలల్లో రూ.1.65 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. ఆదిలీల ఫౌండేషన్‌ శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి, పాతపట్నం, సారవకోట మండలాల్లోని 281 స్కూళ్లను రూ.25 కోట్లతో అభివృద్ధి చేస్తుంది. లారస్‌ ల్యాబ్స్‌ గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పెదకూరపాడు, తెనాలి, దుగ్గిరాల, ప్రత్తిపాడు, కంచికచర్ల, వేలేరుపాడు మండలాల్లో 359 స్కూళ్లను రూ.18 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనుంది. ఉత్తర అమెరికాలో రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పి.రత్నాకర్‌ తన తొలి జీతాన్ని ఈ సందర్భంగా విరాళంగా ప్రకటించారు.
 
ప్రభుత్వ స్కూళ్లు దారుణం: జగన్‌
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు దారుణంగా ఉన్నాయని జగన్‌ అన్నారు. మొత్తం 45 వేల స్కూళ్లలో రూ.12 వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కలిస్తామని.. ప్రతి పాఠశాలలోనూ కచ్చితంగా ఇంగ్లీషు ల్యాబ్‌తో పాటు 9 రకాల వసతులు కలిస్తామని చెప్పారు. ‘ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతున్నాం. ఆ తర్వాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ పోతాం. అమ్మ ఒడి ద్వారా పిల్లల తల్లులను ఆదుకుంటాం. 2011 జనాభా లెక్కల ప్రకారం 33 శాతం నిరక్షరాస్యత ఉంది. నిరక్షరాస్యతను గణనీయంగా తగ్గిస్తాం’ అని తెలిపారు. కార్యక్రమంలో విద్యా మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌, ‘కనెక్ట్‌ టు ఆంధ్రా’ సీఈవో కోటేశ్వరమ్మ, వసుధ ఫార్మా ఎండీ వెంకట రామరాజు, లారస్‌ ల్యాబ్స్‌ సీఈవో చావా సత్యనారాయణ, హెటిరో డ్రగ్స్‌ ఎండీ వంశీకృష్ణ, సుధాకర్‌, రెయిన్‌ కార్బన్‌ సీజీఎం ఆదినారాయణస్వామి, ఆదిలీల ఫౌండేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌.ఆదినారాయణ పాల్గొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ‘నాడు-నేడు’కు కార్పొరేట్‌ సాయం"

Post a Comment