ఎస్‌సి, ఎస్‌టి యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ

* ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో జనవరి నుంచి కార్యక్రమాలు 
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ యువతకు వివిధ రంగాలకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని ఆ సంస్థ అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా తొలి దశలో 9930 మంది ఎస్సీ, మరో 6960 మంది గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని భావస్తున్నారు. జనవరి నుంచి ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రధానంగా దుస్తులు, రిటైల్‌, పర్యాటకం, హాస్పటాలిటీ, నిర్మాణం, ఆటోమొబైల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ వంటి రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు




గిరిజన మహిళలకు అత్యవసర వైద్య సేవలు అందించే విభాగంలో సహాయకులుగా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, ఎపిఎస్‌ఎస్‌డిసి సంయుక్త ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ మెడికల్‌ అసిస్టెంట్స్‌ శిక్షణ చేపట్టనున్నారు. వీటితో పాటు ఎన్‌టిటిఎఫ్‌, సిపెట్‌ సంస్థల ద్వారా ఆయా పరిశ్రమలకు అవసరమై విభాల్లో ట్రైనింగ్‌ ఇవ్వనున్నారు. వీటితో పాటుగా గిరిజన యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు మెరుగుపరచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆలోచనలు చేస్తున్నారు.

అందులో భాగంగా ఆయా ఐటిడిఎ పరిధిలోనే ఈ కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. అటవీ శాఖ, ప్లాంటేషన్‌ విభాగాల ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో ఉన్న యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లలో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు. జూన్‌ 2019 నుంచి నేటి వరకు 2551 మంది గిరిజన యువతకు శిక్షణ ఇవ్వగా 492 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు ఎపిఎస్‌ఎస్‌డిసి అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ఎస్సీ యువతకు కూడా డిమాండ్‌ బాగా ఉన్న పరిశ్రమలను దృష్టిలో వాటికి తగ్గట్టుగా శిక్షణ ఇవ్వనున్నారు. విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉన్న నర్సింగ్‌ వంటి రంగంలో ఎస్సీ మహిళలకు ప్రత్యేక శిక్షణ ఓమ్‌కాప్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే ఇస్తున్నట్లు పేర్కొంటున్నారు. జూన్‌ నుంచి నేటి వరకు 773 మంది ఎస్సీ యువతకు శిక్షణ ఇవ్వగా 131 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మరి కొంత మంది స్వయం ఉపాధి ద్వారా లబ్ధి పొందుతున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ అధికార వర్గాలు పేర్కొంటున్నారు



SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఎస్‌సి, ఎస్‌టి యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ"

Post a Comment