కొత్త చట్టమా.. సవరణా?

  • ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ఎలా?
  • కొత్త పీఆర్సీ వచ్చేవరకు ఆగుదామా
  • ఆర్టీసీ విలీనంపై తర్జన భర్జన
  • పెన్షన్‌ ఇవ్వడం కుదరదు..
  • సీఎం ఆదేశిస్తే తప్పదు


అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. 52వేల మంది ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు, అధికారులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం కోసం కొత్త చట్టం చేయాలా? ఇప్పటికే ఉన్న పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ చట్టాన్ని సవరించాలా? అనే అంశంపై నియమించిన కమిటీకి ఇంకా స్పష్టత రాలేదు. కేవలం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కోసం ఒక ప్రత్యేక చట్టం రూపొందించడం, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ చట్టంలోని 14వ నిబంధనను సవరించడం అనే ఆప్షన్లను కమిటీ పరిశీలిస్తోంది. డిసెంబరులో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కొత్త బిల్లు గానీ, సవరణ బిల్లును గానీ ప్రవేశపెట్టి, జనవరి 1 నుంచి విలీనాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు
పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ చట్టంలోని 14వ నిబంధనను సవరిస్తే ఆ సవరణ మిగిలిన ఇతర కార్పొరేషన్లకూ వర్తించే అవకాశం ఉంది. కాబట్టి, సవరణ చేస్తే కేవలం ఆర్టీసీకి మాత్రమే దీనిని వర్తింపజేసేలా చేయాలనే మరో ఆప్షన్‌ను పరిశీలిస్తున్నారు. ఇది కుదరకపోతే ప్రజా రవాణాశాఖ పరిధిలో ఒక కొత్త బిల్లు తయారుచేసి అసెంబ్లీలో ఆమోదింపజేసి చట్టం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తే వారి వేతనాలు తగ్గే అవకాశముందని కమిటీ భావిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు 2013నాటి వేతన స్కేలు అమలవుతోంది. ఆర్టీసీ కార్మికులకు 2017 వేతన స్కేలు అమలవుతోంది. ఈ రెండు స్కేళ్ల మధ్య ఉన్న వ్యత్యాసంతో ఆర్టీసీ కార్మికుల వేతనాలు కొంతమేర తగ్గుతాయని ఇటీవల జరిగిన కమిటీ సమావేశంలో చర్చకు వచ్చింది. ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల కార్మికుల వేతనం ఎంతమేర తగ్గితే అంత మొత్తాన్ని పీపీలో ఉంచి, ఆ తర్వాత కార్మికులకు ఇంక్రిమెంట్ల ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది.
 
ఇలాకాకుండా కొత్త పీఆర్సీ నివేదిక వచ్చేవరకు ఆగితే ప్రభుత్వోద్యోగులతో పాటు ఆర్టీసీ కార్మికులకు వర్తింపజేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల వేతనాలు తగ్గడం, తగ్గిన వేతనాలను పీపీలో ఉంచడం వంటి వాటికి ఆస్కారం ఉండదని భావిస్తున్నారు. అయితే, పీఆర్సీ నివేదిక ప్రభుత్వానికి ఎప్పుడు అందుతుందనే దానిపై స్పష్టత లేదు. పీఆర్సీ నివేదిక సిద్ధమైందని, 30 నుంచి 32 శాతం పెంపును ప్రతిపాదించినట్టు తెలిసింది. నివేదిక సిద్ధంగా ఉన్నప్పటికీ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని, రాబోయే ఒకటి రెండు నెలల్లో పీఆర్సీ నివేదిక ప్రభుత్వానికి అందినా.. దాని అమలు మాత్రం వచ్చే ఏప్రిల్‌ తర్వాత నుంచే ఉంటుందని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఆర్టీసీలో పనిచేసి రిటైరైన 40వేల మంది కార్మికులకు, 2004కి ముందే ఉద్యోగంలో చేరిన 22వేల మందికి, 2004 తర్వాత చేరిన ఆర్టీసీ కార్మికులకు పెన్షన్‌ ఇచ్చే యోచన లేదని కమిటీ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రతినిధులు స్పష్టం చేశారని సమాచారం. కానీ, సీఎం జగన్‌ ఆదేశిస్తే వీరికీ పెన్షన్‌ ఇవ్వక తప్పదని ఆర్థిక శాఖ భావిస్తోంది.
 
ఏదీ ఇవ్వకపోతే ఎలా?: ఈయూ
‘‘2013 నాటి బకాయిలను సెప్టెంబరులోనే ఇస్తామన్నా ఇవ్వలేదు. సిబ్బంది పొదుపు చేసుకున్న సీసీఎస్‌ డబ్బులు వాడేస్తారు. చివరికి ఉద్యోగి చనిపోతే ఇచ్చే ఈడీఐఎల్‌ఎఫ్‌ డబ్బులు కూడా ఇవ్వక పోతే ఎలా?’’ అని ఆర్టీసీ యాజమాన్యాన్ని గుర్తింపు కార్మికసంఘం ఈయూ ప్రశ్నించింది. సిబ్బంది సంక్షేమం కోసం ఆర్టీసీని విలీనం చేస్తూ ప్రాధాన్యత ఇస్తుంటే, యాజమాన్యం మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోందని ఈయూ రాష్ట్ర నేతలు వైవీ రావు, పలిశెట్టి దామోదర్‌ రావు ప్రశ్నించారు. రుణాల కోసం కార్మికులు నెలల తరబడి ఎదురు చూస్తున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికుడు చనిపోతే కుటుంబీకులకు ఇచ్చే ఈడీఐఎల్‌ఎఫ్‌ డబ్బులు ఆరు నెలలుగా ఇవ్వడం లేదన్నారు. తక్షణమే వేతన సవరణ బకాయిలు, సీసీఎస్‌ నిధులు విడుదల చేయాలని ఈయూ నేతలు కోరారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " కొత్త చట్టమా.. సవరణా?"

Post a Comment