నేటి నుంచి నూతన విధానం

రిజిస్ట్రేషన్‌ శాఖ దస్త్రాల నమోదులో పారదర్శకత

రిజిస్ట్రేషన్‌ శాఖలో వేళ్లూనుకుని ఉన్న దళారీ వ్యవస్థకు చెక్‌ పెట్టే యోచనలో ప్రభుత్వం ప్రజలే దస్త్రాలు నమోదు చేసుకొనే విధానం అమలుకు నవంబరు 1 నుంచి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నూతనంగా రూపొందించిన ఈ విధానం అమలుకానుంది. దీని ద్వారా స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో పేరుకున్న అవినీతిని పారదోలి మధ్యవర్తుల(దస్తావేజు లేఖరులు) పెత్తనానికి కత్తెర వేయాలన్నది ప్రభుత్వ సంకల్పం.

న్యూస్‌టుడే, నెల్లూరు(బృందావనం)



సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వచ్చే కక్షిదారులకు దస్తావేజులు ఎలా రాసుకోవాలో తెలియక దళారులను ఆశ్రయిస్తుంటారు


అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దళారులు సమాంతర వ్యవస్థను నడుపుతూ కక్షిదారుల నుంచి ముక్కుపిండి డబ్బు వసూలు చేస్తున్నారు. నూతన విధానంలో దస్తావేజు నమోదు చేయించుకునేవారు నేరుగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది. ఎవరికి వారే నేరుగా దస్తావేజులను తయారుచేసుకునేందుకు నమూనాలను ఆయా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో, రిజిస్ట్రేషన్‌ శాఖకు సంబంధించిన వెబ్‌సైట్‌లోనూ పూర్తిగా పొందుపరిచింది. ఇప్పటి వరకు పేజీలకు పేజీలున్న దస్తావేజులు రెండు పేజీల్లో పూర్తవుతాయి. ఆస్తుల అమ్మకం, కొనుగోలు, బహుమానం, తనఖాతో పాటుగా దాదాపు 64కు పైగా సేవలను ఈ నూతన వెబ్‌సైట్‌లో పొందుపరచింది. దరఖాస్తుదారుడు తనకు అవసరమైన సేవలకు సంబంధించిన దరఖాస్తును వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకుని పూర్తిచేసిన దరఖాస్తును సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. వెంటనే దరఖాస్తుదారుని మొబైల్‌కు సంక్షిప్త సమాచారం రూపంలో యూజర్‌ ఐ.డి. వస్తుంది. దాన్ని నమోదు చేసిన వెంటనే సంబంధిత సబ్‌రిజిస్ట్రార్‌ పరిశీలిస్తారు. దీనికి ముందు ఉన్న లింక్‌ దస్తావేజులు అన్ని పరిశీలించి, సరిపోల్చుకున్నాక రెండు పేజీలతో కూడిన దస్తావేజును నేరుగా దరఖాస్తుదారునికి అందజేస్తారు. ప్రస్తుతం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరిగే వేలిముద్రలు, ఆధార్‌ పరిశీలన, ఫొటోలు తీయించుకోవడం వంటి ప్రక్రియలు యథాతథంగా ఉన్నా దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉండదు. దస్తావేజులకు సంబంధించిన దాదాపుగా 64 రకాల సేవల నమూనా పత్రాలు ఇకపై ఆంగ్లంతో పాటుగా తెలుగులోనూ లభ్యం కానున్నాయి. ఇందుకోసం అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది.

దళారీ వ్యవస్థ దూరం

రాష్ట్ర ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖను ప్రక్షాళనం చేసేందుకు ప్రజా నమోదు విధానానికి అక్టోబరు 2 నుంచి విశాఖ జిల్లా నుంచి శ్రీకారం చుట్టింది. నవంబరు 1వ తేదీ నుంచి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది. ఈ విధానం ద్వారా స్థిర, చరాస్తుల క్రయ, విక్రయాలు ఇతర సేవలు అవసరమైనవారికి అన్ని రకాల నమూనాలను ఆన్‌లైన్‌లో ఉంచింది. ఎవరికి ఏ సేవలు కావాలన్నా వెబ్‌సైట్‌ ద్వారా దస్త్రాలను డౌన్‌లోడ్‌ చేసుకుని ఎవరికి వారే స్వయంగా దస్త్రాలను తయారుచేసుకోవచ్ఛు వాటి కోసం దళారుల వద్దకు వెళ్లి వారు అడిగినంత అదనపు సొమ్మును ఇవ్వాల్సిన అవసరం అసలు ఉండదు. పౌరులు ఏదైనా అనుమానాలున్నా, సమస్యలు ఎదురైనా సంబంధిత సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సబ్‌రిజిస్ట్రార్‌ను సంప్రదిస్తే సరిపోతుంది.

-కె. అబ్రహామ్‌, డి.ఐ.జి. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ, నెల్లూరు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

  • ఏపీ రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలుఅమరావతి: రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. నవంబరు 1న రాష్ట్ర వ్యాప్తంగా సంస్కరణలు అమలు చేయనున్నట్లు ప్ర… ...
  • నేటి నుంచి నూతన విధానంరిజిస్ట్రేషన్‌ శాఖ దస్త్రాల నమోదులో పారదర్శకతరిజిస్ట్రేషన్‌ శాఖలో వేళ్లూనుకుని ఉన్న దళారీ వ్యవస్థకు చెక్‌ పెట్టే యోచనలో ప్రభుత్వం ప్రజలే దస్… ...

0 Response to "నేటి నుంచి నూతన విధానం"

Post a Comment