కిడ్నీల్లో రాళ్లా..? నిమ్స్‌కు రండి..

అందుబాటులోకి అధునాతన యంత్రం 
'ఆరోగ్యశ్రీ' రోగులకు ఉచిత సేవలు

ఈనాడు, హైదరాబాద్‌: మూత్ర పిండాల్లో ఏర్పడే రాళ్లను తొలగించేందుకు అధునాతన లేజర్‌ ట్రీట్‌మెంట్‌ యంత్రం నిమ్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు కేవలం కార్పొరేట్‌ ఆసుపత్రులకే పరిమితమైన ఈ తరహా చికిత్స ఇక నుంచి నిమ్స్‌లో కూడా చేయనున్నారు. నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నిమ్మ సత్యనారాయణ, యురాలజీ విభాగాధిపతి డాక్టర్‌ రామిరెడ్డి, డాక్టర్‌ రాహుల్‌ దేవరాజు తదితరులు ఈ యంత్రాన్ని గురువారం అందుబాటులోకి తెచ్చారు





ప్రస్తుతం ఈ తరహా చికిత్సకు కార్పొరేట్‌ ఆసుపత్రిలో రూ.2 లక్షల వరకు ఫీజు తీసుకుంటున్నారు. ఇకనుంచి ఆరోగ్యశ్రీ రోగులకు నిమ్స్‌లో రూ.40లక్షలు ఖరీదైన ఈ యంత్రం ద్వారా ఉచిత చికిత్సలు అందించనున్నారు. ఇతర రోగులకు కూడా లక్షలోపే ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. లేజర్‌ సర్జరీ ద్వారా రాళ్లు తొలగిస్తే.. తర్వాత దుష్పఫలితాలు పెద్దగా ఉండవన్నారు. నొప్పి, కోత, రక్తస్రావం లాంటివి తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. చిన్నపిల్ల కిడ్నీల్లోని రాళ్లనూ ఈ సాంకేతికతతో సులువుగా తొలగించవచ్చన్నారు.

10 నెలల బాలుడికి సర్జరీ... 
పది నెలల బాలుడి కిడ్నీల్లో ఏర్పడిన రాళ్లను కొత్త టెక్నాలజీతో విజయవంతంగా తొలగించినట్లు డాక్టర్‌ రాంరెడ్డి తెలిపారు. జన్యు, మెటబాలిక్‌ ఇతర సమస్యలతో పిల్లల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయని పేర్కొన్నారు. పురుషాంగం నుంచి క్యాథిటార్‌ను పంపి లేజర్‌ కిరణాలతో రాళ్లను తొలగిస్తామని చెప్పారు. పిల్లల్లో కిడ్నీలు చాలా సున్నితంగా ఉంటాయని, ఈ చికిత్స విధానంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రాళ్లను ధ్వంసం చేయవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియలో కిడ్నీలకు ఎలాంటి హాని జరగదన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో పిల్లలకు సైతం ఉచితంగా శస్త్ర చికిత్సలు అందిస్తామని వివరించారు. ప్రైవేటులో లక్షలు వెచ్చించలేని పేదలకు ఈ అధునాతన చికిత్స ఒక వరమన్నారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కిడ్నీల్లో రాళ్లా..? నిమ్స్‌కు రండి.."

Post a Comment