మరింత తగ్గనున్న రెపో రేటు

  • ప్రారంభమైన ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ

ఇకపై గృహ, వాహన రుణాలు ఇంకాస్త చౌక.!

ముంబై : భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం మంగళవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. గాంధీ జయంతిని సందర్భంగా బుధవారం మాత్రం సమావేశం జరగదు. గురు, శుక్రవారాల్లో మళ్లీ సమావేశమై రెపో రేటుపై ఎంపీసీ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే తన వంతు ప్రయత్నాలు పూర్తి చేసింది. దీంతో ద్రవ్య, పరపతి విధానం ద్వారా చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐ యోచిస్తోంది.



ఎందుకంటే ?

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది

పండగల సీజన్‌ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమ వర్గాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇటీవలే కార్పొరేట్‌ టాక్స్‌ను పది శాతం వరకు తగ్గించింది. అయితే డిమాండ్‌ పెంచేందుకు ఈ చర్య ఏ మాత్రం ఉపయోగపడదని పరిశ్రమ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. అలా అని మరిన్ని ఆర్థిక రాయితీలు ప్రకటించేందుకు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ఈ నేపథ్యంలో పరిశ్రమల కోసం మరిన్ని 'ఆర్థిక' ప్రోత్సాహకాలు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో 'రెపో' రేటు తగ్గించడం ద్వారా రుణ వితరణ పెంచి డిమాండ్‌కు ఊతమివ్వాలని భావిస్తోంది..

ఎంత తగ్గొచ్చు ?

ఆర్‌బీఐ ఇప్పటికే ఈ ఏడాది జనవరి నుంచి నాలుగు విడతలుగా 'రెపో' రేటును 6.5 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గించింది. బ్యాంకులు ఇందులో సగాన్ని కూడా రుణ గ్రహీతలకు బదిలీ చేయలేదు. దీంతో అక్టోబరు 1 నుంచి బ్యాంకులు తమ రుణాల వడ్డీ రేట్లను ఏదైనా బయటి ప్రామాణిక వడ్డీ రేట్లతో (బెంచ్‌మార్క్‌) అనుసంధానించాలని ఆర్‌బీఐ ఆదేశించింది.

కలిసి రానున్న అంశాలు ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ఆపసోపాలు పడుతోంది. అయినా రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇంకా ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిన నాలుగు శాతానికి కంటే తక్కువ స్థాయిలోనే ఉంది. ఆగస్టు నెలలోనూ రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.21 శాతం మించలేదు. ఈ ఏడాది రుతుపవనాలు బాగానే ఉన్నాయి. దీంతో మున్ముందు ఆహార ద్రవ్యోల్బణం పెద్దగా పెరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కీలక (రెపో) వడ్డీ రేటు మరింత తగ్గించడం ద్వారా వస్తు, సేవల డిమాండ్‌ పెంచేందుకు ఆర్‌బీఐ తన వంతు ప్రయత్నిస్తుందని మార్కెట్‌ వర్గాల అంచనా



గృహ, వాహన రుణాలు ఇంకాస్త చౌకగా లభించనున్నాయి. మంగళవారం నుంచి అమలులోకి రానున్న కొత్త విధానంతో కొన్ని బ్యాంకుల రిటైల్‌ రుణాలపై వడ్డీ భారం 0.30 శాతం వరకు తగ్గవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అక్టోబరు 1 నుంచి బ్యాంకులు రిటైల్‌తోపాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎ్‌సఎంఈ)కిచ్చే రుణాల వడ్డీ రేటును 'రెపో' లేదా ఇతర మార్కెట్‌ రేటుతో అనుసంధానించడం ఆర్‌బీఐ తప్పనిసరి చేసింది.

రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటు ప్రస్తుతం 5.40 శాతంగా ఉంది. రెపో లేదా ఇతర మార్కెట్‌ రేటుపై కొంత మార్జిన్‌ కలుపుకొని బ్యాంకులు తాము ఆఫర్‌ చేసే రుణాలకు ప్రామాణిక వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. మార్జిన్‌ విషయంలో మాత్రం బ్యాంకులపై ఎలాంటి పరిమితి ఉండదు


ఉదాహరణకు, దేశంలోని అతిపెద్ద బ్యాంకైన ఎస్‌బీఐ.. సెప్టెంబరులో లాంచ్‌ చేసిన రెపో అనుసంధానిత గృహ రుణంపై ప్రామాణిక వడ్డీ రేటును 8.05 శాతంగా నిర్ణయించింది. అయితే, ఎస్‌బీఐ ఈ పథకాన్ని ఉపసంహరించుకుంది. ఏదేని బహిరంగ మార్కెట్‌ రేటుతో ఫ్లోటింగ్‌ రుణాల అనుసంధానం తప్పనిసరి చేసిన నేపథ్యంలో తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

రుణగ్రహీత రిస్క్‌ ప్రొఫైల్‌ ఆధారంగా బ్యాంకులు ప్రామాణిక వడ్డీ రేటుకు అదనంగా వసూలు చేస్తాయి. సాధారణంగా రిస్క్‌ గ్రూపు 4-6 పరిధిలోకి వచ్చేవారు అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు, వేతన జీవులు కానివారి నుంచి ఎస్‌బీఐ ప్రామాణిక రేటుపై 0.15 శాతం అదనపు వడ్డీ వసూలు చేస్తుంది. ఇక రిస్క్‌ గ్రూపు 4-6లో ఉంటే మరో 0.10 శాతం అదనపు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.



రెపో తగ్గితే రుణగ్రహీతలకు తదనుగుణంగా నెలవారీ చెల్లింపుల(ఈఎంఐ) భారం కూడా తగ్గుతుంది. ఆర్‌బీఐ రెపో పెంచుతూపోతే వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. ఉదాహరణకు, రెపో రేటు ఒక శాతం పెరిగితే 15 ఏళ్ల కాలానికి రూ.75 లక్షల రుణం తీసుకున్న వారి ఈఎంఐ భారం రూ.4,500 మేర పెరగవచ్చని దేశీ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంటోంది


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మరింత తగ్గనున్న రెపో రేటు "

Post a Comment