ప్లాస్టిక్‌ను 'భుజించే' బ్యాక్టీరియా!

పర్యావరణానికి మేలు 
కనుగొన్న భారత పరిశోధకులు

దిల్లీ: పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను సురక్షితంగా వదిలించుకునేందుకు భారత పరిశోధకులు ఒక అద్భుత మార్గాన్ని కనుగొన్నారు. ఇలాంటి వ్యర్థాలను 'భుజించే' రెండు రకాల బ్యాక్టీరియాను వారు గుర్తించారు. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ వ్యర్థాలను 2022 నాటికి పూర్తిగా నిర్మూలించాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు నేపథ్యంలో ఈ ఆవిష్కారానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో ఉన్న శివ్‌నాడర్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ బ్యాక్టీరియాను కనుగొన్నారు



వర్సిటీ పక్కనే ఉన్న చిత్తడి నేలల్లో ఈ సూక్ష్మజీవులు వెలుగు చూశాయి. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ (ఎస్‌యూపీ)లోని కీలక పదార్థమైన పాలిస్టిరీన్‌ను క్షీణింపచేసి, సురక్షితంగా నేలలో కలిపేసే సామర్థ్యం వీటికి ఉంది. వీటిని ఎక్సిగువోబ్యాక్టీరియం సిబిరీషియం డీఆర్‌11, ఎక్సిగువాబ్యాక్టీరియం అండే డీఆర్‌14గా గుర్తించారు. పాలిస్టిరీన్‌ పొడవైన పాలీమర్‌ శృంఖలం, ఇతర తీరుతెన్నుల వల్ల అది ఒకపట్టాన క్షీణించదు.

ఫలితంగా అది పర్యావరణంలో దీర్ఘకాలం పాటు ఉండిపోతుంది. ఉదాహరణకు ఒక ప్లాస్టిక్‌ ఫోర్క్‌ నేలలో కలసిపోవడానికి 450 ఏళ్లు పడుతుంది. పాలిస్టిరీన్‌ ఉత్పత్తి, వినియోగం భారీ స్థాయిలో పెరిగిపోవడం వల్ల పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ పెను సవాల్‌గా మారింది. భారత్‌లో ఏటా 16.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ వినియోగమవుతున్నట్లు అంచనా. దీనివల్ల నేలపైన, సముద్రంలోని జీవంపై ప్రభావం పడుతోంది. కొత్తగా కనుగొన్న రెండు రకాల బ్యాక్టీరియా పాలిస్టిరీన్‌ ఉపరితలాలపై జీవపొరలను ఏర్పరుస్తాయి. అనంతరం వాటిని క్షీణింపచేస్తాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్లాస్టిక్‌ను 'భుజించే' బ్యాక్టీరియా!"

Post a Comment