ప్లాస్టిక్‌పై యుద్ధం

  • గాంధీ 150వ జయంతిన కేంద్రం సంకల్పం
  • నింగి, నేల, నీరు.. అన్నిచోట్లా ప్లాస్టిక్‌ కాలుష్యం
  • సముద్రపు అట్టడుగు భాగంలోనూ ప్లాస్టిక్‌ కవర్లు
  • ఆర్కిటిక్‌, అంటార్కిటిక్‌ ప్రాంతాల్లో మైక్రో ప్లాస్టిక్‌
  • కవర్లు, కప్పులు, గ్లాసులు, వాటర్‌ బాటిళ్లు.. ఇలా ‘ఒక్కసారి వాడి పారేసే’ ప్లాస్టిక్‌తోనే ఎక్కువ ముప్పు
  • అవి భూమిలో కలవడానికి పట్టే సమయం వెయ్యేళ్లు
  • వాటి వినియోగాన్ని తగ్గించే దిశగా కీలక చర్యలు

 డెస్క్‌: నింగీ.. నేలా.. నీరూ.. ఇందుగలదు, అందులేదని సందేహం వలదు! ఎందెందు వెదకి చూచినా అందందే ప్లాస్టిక్‌ భూతం!! చివరకు మనం పీల్చే గాలిలోనూ మైక్రోప్లాస్టిక్‌ రేణువులు ఉన్నాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. మానవాళి మనుగడకే ప్రమాదంగా మారుతున్న ప్లాస్టిక్‌పై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ప్లాస్టిక్‌ వినియోగం పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే.. భారత ప్రభుత్వం ఒక్కసారి వాడి పారేసే (సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు నడుం బిగించింది. ప్రధాని నరేంద్రమోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈమేరకు పిలుపు 

స్వచ్ఛభారతాన్ని కలలుగన్న గాంధీజీ జయంతిని ఇందుకు ముహూర్తంగా ఎంచుకున్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ అనగానే.. వస్తువుల ప్యాకేజింగ్‌కు వాడే ప్లాస్టిక్‌ రేపర్లు, షీట్లు, క్యారీబ్యాగులు, వాటర్‌ బాటిళ్లు, స్ట్రాలు, ప్లాస్టిక్‌ చెంచాలు, ప్లేట్లు, టీ-జ్యూస్‌ కప్పులు, గ్లాసులు.. ఇలా చాలా ఉత్పత్తుల పేర్లు గుర్తుకొస్తాయి. కానీ, ఆ పదానికి శాస్త్రీయంగా ఒక నిర్ణీత నిర్వచనమంటూ ఏమీ లేదు. ఈ నేపథ్యంలో, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కిందకు వచ్చే వస్తువులను నిర్వచించేందుకు కేంద్ర పర్యావరణ శాఖ నేతృత్వంలో ఒక కమిటీ కృషి చేస్తోంది. ‘ఏవి ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ వస్తువులు’ అనే అంశంపై అక్టోబరు చివరినాటికి ఆ కమిటీ ఒక నిర్వచనం ఇవ్వనుంది.

 

పుణేకు చెందిన నేషనల్‌ కెమికల్‌ లేబొరేటరీ మాజీ డైరెక్టర్‌ స్వామినాథన్‌ శివరామ్‌ మాటల్లో చెప్పాలంటే.. కొన్ని గంటల జీవితకాలం మాత్రమే ఉన్న ప్లాస్టిక్‌ ఏదైనా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కిందకు వస్తుంది. ఎందుకంటే ఇవే ఎక్కువగా ప్లాస్టిక్‌ వ్యర్థాల రూపంలో పర్యావరణంలో కలుస్తుంటాయి. ఉదాహరణకు.. పాలప్యాకెట్లు. ఒక్కసారి వాటిలోని పాలను గిన్నెలో పోసుకున్నాక వాటిని చెత్తకుండీలో పారేస్తాం. గతంలో అయితే వాటిని కూడా దాచి కిలో ఏ 2-3 రూపాయలకో అమ్ముకునేవారు. ఆ ప్యాకెట్లు రీసైకిల్‌ అయ్యేవి. ఇప్పుడు డస్ట్‌బిన్‌లో పడేస్తున్నవారే ఎక్కువ.

 

సాధ్యమేనా?

ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ను నిషేధిస్తే.. ఆర్థిక పర్యవసానాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్‌పై పూర్తి నిషేధం అసాధ్యమని విశ్లేషిస్తున్నారు. గతంలో పలు ప్రభుత్వాలు కొన్ని ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై నిషేధం విధించినా.. విజయవంతం కాలేదని వారు గుర్తుచేస్తున్నారు. యూఎన్‌ఈపీ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో ప్లాస్టిక్‌ ఉత్పత్తి, వినియోగంపై నిషేధం లేదా భారీ పన్నులు ఉన్నాయి. కానీ, వాటిపై నిఘా సమగ్రంగా లేదు. నిషేధం/భారీ పన్నుల వల్ల ప్లాస్టిక్‌ వినియోగం కేవలం 30ు మేర తగ్గిందని ఆ దేశాలు చెబుతున్నాయి.

 

కాకపోతే, ప్లాస్టిక్‌పై నిషేధం.. వినియోగం తగ్గింపు దిశగా చర్యలు చేపట్టడం వల్ల ఉత్పత్తిదారులు నిబంధనల ప్రకారం నడుచుకునే అవకాశం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడానికి బహుముఖ విధానాన్ని పాటించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. వ్యర్థాల నిర్వహణ విధానాన్ని బలోపేతం చేయడం, ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్లకు ప్రోత్సాహకాలివ్వడం, కొన్ని రకాల ప్లాస్టిక్‌ ఉత్పత్తులను దశలవారీగా నిషేధించడం వంటి చర్యలు తీసుకోనున్నట్టు ఆ వర్గాలు వివరించాయి. ఎందుకంటే ప్లాస్టిక్‌ అనేది మనకు వాడుకపరంగా కన్నా వ్యర్థంగానే పెద్ద సమస్య. ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైకిల్‌ చేసే వ్యవస్థలు మనదేశంలో చెప్పుకోదగ్గవి లేవు. అందుకే ప్రభుత్వం ఈ అంశంపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో.. ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమలు చేయాల్సిన ప్రాంతాల్లో కఠినంగా వ్యవహరించే అవకాశంఉన్నట్టు సమాచారం.

 

64లో.. తుది పన్నెండు!

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కింద పరిగణనలోకి తీసుకోవాల్సిన ఉత్పత్తుల్లో అరవైనాలుగింటిని ప్రభుత్వం ప్రాథమికంగా పరిగణనలోకి తీసుకుందని.. అందులో 12 ఉత్పత్తులను ‘ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్‌’ ఉత్పత్తులుగా నిర్ణయించనుందని సమాచారం. వీటిపైనా అక్టోబరు 2 నుంచి దశలవారీగా లేదా తక్షణ నిషేధం విధించే అవకాశం ఉంది. తుది పన్నెండు ఉత్పత్తుల్లో ఏమేం ఉండొచ్చంటే..

క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్‌ చెంచాలు,


ప్లాస్టిక్‌ గ్లాసులు, ప్లేట్లు, స్ట్రాలు, థర్మాకోల్‌


తక్కువ పరిమాణం ఉన్న బాటిళ్లు


అలంకరణకు వాడే ప్లాస్టిక్‌ ఉత్పత్తులు


..పూర్తిగా ప్లాస్టిక్‌తో కాకుండా కొంతమేర కాటన్‌ కూడా కలిపి తయారుచేసే క్యారీబ్యాగులను కూడా నిషేధించే అవకాశం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే వాడక తప్పని ప్లాస్టిక్‌ వినియోగం కొనసాగుతుంది. మిగతావాటి వినియోగాన్ని తగ్గిస్తారు.

 

7-8 సార్లే రీసైక్లింగ్‌

ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ మంచిదే. కానీ, ప్లాస్టిక్‌ను 7 నుంచి 8 సార్లకు మించి రీసైకిల్‌ చేయకూడదు. అలా ఏడెనిమిదిసార్లు రీసైక్లింగ్‌ చేసిన ప్లాస్టిక్‌ తన స్వచ్ఛతను కోల్పోతుంది. ఆ తర్వాత దాంతో ఉత్పత్తులు తయారు చేయడం కుదరదు. ఆ ప్లాస్టిక్‌ను వేరే అవసరాలకు వాడుకోవాల్సిందే. అలాంటి ప్లాస్టిక్‌నే ఇటీవలికాలంలో రోడ్లు వేయడానికి వినియోగిస్తున్నారు. పరిశ్రమల్లో గ్యాసోలిన్‌ తయారీకి కూడా వాడుతున్నారు.

ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే నిషేధం

ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్‌పై మనదేశంలో చాలా రాష్ట్రాలు ఇప్పటికే నిషేధం విధించాయి. వాటి అమ్మకం, నిల్వ, వినియోగం ఆ రాష్ట్రాల్లో నేరం. ఆ రాష్ట్రాలేవంటే.. సిక్కిం, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, నాగాలాండ్‌, జార్ఖండ్‌.

 

8%

ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న చమురులో 8ు ప్లాస్టిక్‌ తయారీకి, దాన్ని తయారు చేయడానికి కావాల్సిన విద్యుత్తు తయారీకీ వినియోగమవుతోంది. 2050 నాటికి ఇది 20 శాతానికి పెరుగుతుందని ఒక అంచనా.

 

1650 కోట్ల కిలోలు

భారతదేశంలో సగటున ఏటా వినియోగిస్తున్న ప్లాస్టిక్‌. 16 లక్షల ట్రక్కుల లోడు ఇది.

 

26,000 టన్నులు

భారతదేశంలో నిత్యం ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు. అందులో 10 వేల టన్నులకు పైగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు సేకరణకు నోచుకోకుండా మన చుట్టూ ఉన్న పరిసరాల్లో పడి ఉంటున్నాయి.

 

15

ప్లాస్టిక్‌ కాలుష్యం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ స్థానం.

 

50,00,000

ఐదు నిమిషాల్లో.. అంటే మీరు ఈ వార్త చదివే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ అమ్ముడై ఉంటాయి. అందులో ఎక్కువ భాగం మనదేశంలోనే!

 

50%

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న ప్లాస్టిక్‌లో దాదాపు సగం 2000 సంవత్సరం తర్వాత తయారైనదే!

 

100 కిలోలు

ఒక ఏడాదిలో సగటు అమెరికన్‌ వాడే ప్లాస్టిక్‌. ప్రపంచంలోనే అత్యధికం ఇది.

 

80 లక్షల టన్నులు

ఏటా ప్రపంచవ్యాప్తంగా సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్‌

 

2 కిలోల ప్లాస్టిక్‌కి..కిలో బియ్యం

పరిసరాల్లో ఎక్కడ పడితే అక్కడ పడి ఉండే ప్లాస్టిక్‌ క్రమంగా భూమిలోకి పూడుకుపోతుంది. అది భూమిలో పూర్తి గా కలిసిపోవడానికి వెయ్యేళ్లకు పైనే పడుతుంది. అందుకే, అలా పడి ఉండే ప్లాస్టిక్‌ సేకరణకు ఫిలిప్పీన్స్‌లోని ఒక గ్రామపంచాయతీ ఒక ఆకర్షణీయ మార్గం ఎంచుకుంది. గ్రామవాసులు తెచ్చి ఇచ్చే ప్రతి 2 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలకుగాను.. కిలో బియ్యం ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ దెబ్బతో ఆ గ్రామంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలే కనిపించడం మానేశాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్లాస్టిక్‌పై యుద్ధం "

Post a Comment