ఆటో, ట్యాక్సీలకు రూ.10వేలు
నేటి నుంచే ఆన్లైన్ దరఖాస్తులు
నెలాఖరులోపు ఎంపిక, ఖాతాకి జమ
సొంతంగా ఒక్క వాహనం ఉంటేనే..
లైసెన్స్, ఆధార్, తెల్లకార్డే ప్రమాణం
వాటిలో ఏవిలేకున్నా లబ్ధి అందనట్టే
అమరావతి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా పది వేల రూపాయలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఎన్నికలకు ముందు వైసీపీ ఇచ్చిన హామీల అమలులో భాగంగా సొంతంగా ఆటో, క్యాబ్ నడుపుతూ జీవనం సాగించుకునేవారికి ఈ సాయం అందబోతోంది. లబ్ధిదారుల ఎంపిక, అర్హతకు సంబంధించిన మార్గదర్శకాలను రవాణాశాఖ సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. సొంత ఆటో, ట్యాక్సీ ఉన్నవారు దరఖాస్తుతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలతో మంగళవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
వాహన ఇన్సూరెన్స్, ఫిట్నెస్ కోసం ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా లబ్ధిదారులకు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. దరఖాస్తుల పరిశీలన అనంతరం పదివేల రూపాయల మొత్తాన్ని నేరుగా లబ్ధిదారు ఖాతాలోకి జమ చేయనున్నట్లు పేర్కొంది. గతేడాది పాదయాత్రలో జగన్ను పలు ఆటో సంఘాల నేతలు కలిసి తమను ఆర్థికంగా ఆదుకోవాలని విన్నవించారు. ఆ సందర్భంగా జగన్ హామీ ఇచ్చిన మేరకు రాష్ట్ర బడ్జెట్లో రూ.400కోట్లు ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కోసం కేటాయించారు. ఈ పథకం కోసం అర్హులను గుర్తించాలని రవాణాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మొత్తం 6.63 లక్షలు.. అర్హులు 3.97 లక్షలే
రవాణాశాఖ లెక్కల ప్రకారం ఆటోలు, ట్యాక్సీలు రాష్ట్రంలో 6.63 లక్షలున్నాయి. వాటిలో ఈ పథకానికి 60 శాతం మంది కూడా అర్హులు కాదని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. సొంత ఆటోలు కలిగిన వారి వివరాలతోపాటు ఆద్దె ఆటోల వారిని కూడా రవాణా శాఖ గుర్తించింది. ఒకటి కన్నా ఎక్కువ ఆటోలు కొనుగోలు చేసి అద్దెకిచ్చిన వారి వివరాలు కూడా ఆర్టీఏ అధికారులు సేకరించారు. కొన్నిరోజులుగా 13 జిల్లాల సమాచారం ప్రకారం సొంతంగా ఆటోలు, ట్యాక్సీలు నడిపే వారు 3.97లక్షల మంది తేలారు. మొత్తం మీద ఈ సంఖ్య 59.87శాతమే ఉంది. అద్దెకు ఆటోలు తీసుకుని నడిపే వారి సంగతేంటని రవాణాశాఖ ఉన్నతాధికారుల ప్రస్తావించగా, ఆటో ఫిట్నెస్, ట్యాక్స్, ఇతర మరమ్మతుల కోసం ప్రభుత్వం ఇస్తున్న సొమ్ము అద్దె డ్రైవర్కు దక్కే అవకాశం లేదన్నారు. ఒకటికన్నా ఎక్కువ ఆటోలున్న యజమానికి ఒక్క ఆటోకైనా ఇస్తారా.? అంటే స్పష్టమైన సమాధానం లేదు.
ఎంపిక విధానం..
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు కలెక్టర్లకు పంపి పరిశీలన కోసం ఆయా గ్రామ, వార్డు వలంటీర్లను క్షేత్రస్థాయి విచారణకు పంపుతారు. సొంతంగా ఆటో ఉండి, తామే నడుపుతున్నవారిని గుర్తించి దరఖాస్తులను గ్రామాల్లో ఎంపీడీవోలకు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లకు ఆ తర్వాత కలెక్టర్కు, చివరిగా రవాణాశాఖకు పంపుతారు. ఇన్ని ప్రక్రియలు దాటుకొని వచ్చే వారిని అర్హులుగా గుర్తించి ఈ నెలాఖరులోపు ఎంపిక పూర్తిచేసి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి రూ.10వేలు జమ చేస్తారు
0 Response to "ఆటో, ట్యాక్సీలకు రూ.10వేలు"
Post a Comment