అర్హులు లేక మిగిలిపోయిన 100 పోస్టులు

 2723 పోస్టులకు 2623 మందికి అర్హత 
- కానిస్టేబుల్‌ తుది ఫలితాలు విడుదల 
- త్వరలోనే మిగిలిన ఖాళీల భర్తీ 
- హోం మంత్రి సుచరిత 
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో 
పోలీస్‌ శాఖలోని వివిధ పోలీస్‌ కానిస్టేబుళ్ల ఖాళీల భర్తీకి నిర్వహించిన తుది రాత పరీక్ష ఫలితాలను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్మోహన్‌రెడ్డి, హోం మంత్రి సుచరిత, డిజిపి గౌతం సవాంగ్‌, పోలీస్‌ నియామక మండలి ఛైర్మన్‌ కుమార్‌ విశ్వజిత్‌ గురువారం విడుదల చేశారు. మొత్తం 2723 పోస్టులకు గాను 2623 మందే అర్హత సాధించారు. అర్హులు లేకపోవడం వల్లే 100 పోస్టులు మిగిలిపోయాయని పోలీస్‌ నియామక మండలి అధికారులు చెబుతున్నారు





బిసి-సి, బిసి-ఇ విభాగాల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో తుది పరీక్షలో 200 మార్కులకు కనీస మార్కులుగా నిర్ణయించిన 70 మార్కులు పొందకపోవడంతో పాటు దేరుదారుణ్య పరీక్షల్లో అవసరమైన సామర్థ్యాలు లేనందువల్లే పోస్టులు మిగిలాయని అంటున్నారు. అనంతరం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హోం మంత్రి మాట్లాడుతూ పోలీస్‌ శాఖలోని 2,723 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయగా మొత్తం 3,94,384 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ప్రాథమిక పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలలో ఎంపికైన 65,575 మంది తుది రాత పరీక్షకు అర్హత పొందారని, వారిలో 2,673 మంది కానిస్టేబుల్‌ ఉద్యోగానికి అర్హత సాధించారని చెప్పారు. 1600 కానిస్టేబుల్‌(సివిల్‌) పోస్టులు ఖాళీలుండగా 1098 మంది పురుషులు, 430 మంది మహిళలు, మొత్తం కలిపి 1528 మంది అర్హత సాధించారన్నారు. 300 కానిస్టేబుల్‌(ఎఆర్‌) పోస్టులు ఖాళీ ఉండగా 232 మంది పురుషులు, 47 మంది మహిళలు అర్హత సాధించారని తెలిపారు. కానిస్టేబుల్‌(ఎపిపిఎస్సీ)కి 300 మంది, వార్డర్‌ పోస్టులకు 100 మంది పురుషులు, 23 మంది మహిళలు, ఫైర్‌మెన్‌ పోస్టులకు 393 మంది అర్హత సాధించారన్నారు. 100 ఖాళీలు మిగిలిపోయాయని, వాటిని త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. పరీక్షల్లో కడప జిల్లాకు చెందిన జింకా శశికుమార్‌, గుంటూరు జిల్లాకు చెందిన చల్లా సత్యనారాయణ, ప్రకాశం జిల్లాకు చెందిన సిద్దారెడ్డి చెన్నారెడ్డి, విజయనగరం జిల్లాకు చెందిన వడపల్లి కోటేశ్వరరావులు 145కు పైగా మార్కులు సాధించి ఉత్తమంగా నిలిచారన్నారు. మహిళలకు సంబంధించి విజయనగంరం జిల్లాకు చెందిన లక్ష్మీ ప్రియాంక 138 మార్కులతో మొదటి స్థానంలో నిలిచారన్నారు. ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి అయిన తరువాత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అర్హులు లేక మిగిలిపోయిన 100 పోస్టులు"

Post a Comment