సీపీఎస్‌, ఎన్‌పీఎస్‌పై సందేహాల నివృత్తి

19న దిల్లీ అధికారులతో జడ్పీలో అవగాహన

జిల్లా కోశాగార ఉపసంచాలకులు వెంకన్న



వివరాలు వెల్లడిస్తున్న జిల్లా కోశాగార డీడీ వెంకన్న

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : సీపీఎస్‌, ఎన్‌పీఎస్‌పై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో అనేక మంది ఉద్యోగులు నష్టపోతున్నారని ఈ విషయంలో వారి సందేహాలను నివృత్తి చేసేందుకు జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా కోశాగార ఉప సంచాలకులు వెంకన్న తెలిపారు. శనివారం డీటీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రిబ్యూటరీ పింఛన్‌ విధానం, జాతీయ పింఛన్‌ పథకం వల్ల అనేక లాభాలు ఉన్నాయని తెలిపారు


ఉద్యోగి సర్వీసులో ఉండగా 10 శాతం సీపీఎస్‌/ఎన్‌పీఎస్‌కు చెల్లిస్తే దానికి సమానంగా ప్రభుత్వం అంతే మొత్తం అతని పేరున జమచేస్తుందన్నారు. ఉద్యోగ విరమణ పొందిన తరవాత మూడు కేటగిరీల వారీగా దీన్ని పొందే వీలుంటుందన్నారు. చాలామంది పెన్షన్‌ రాదాన్న అపోహను వీడి సీపీఎస్‌/ఎన్‌పీఎస్‌ పథకాల వల్ల కలిగే లాభాలపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. సీపీఎస్‌ ఉద్యోగులు 5 ఏళ్లు సర్వీస్‌ పూర్తి చేసుకుంటే చాలు గ్రాట్యుటీ పొందే అవకాశం ఉందన్నారు.

33 ఏళ్ల సర్వీస్‌ పూర్తి చేసిన వారు రూ.12లక్షల గ్రాట్యుటీ (ఉద్యోగభృతి) పొందవచ్చని తెలిపారు. సీపీఎస్‌ కింద ఉద్యోగుల భాగస్వామ్యానికి సంబంధించిన సమగ్ర వివరాలను సైతం కొందరు అధికారులు సక్రమంగా నివేదించడం లేదన్నారు. ఈ విధానంలో ఉద్యోగులు సద్వినియోగం చేసుకునే అంశాలపై దిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణులతో ఈ నెల 19న సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సమావేశానికి జిల్లా డ్రాయింగ్‌ డిస్బర్సింగ్‌ అధికారులు (డీడీవోలు), శాఖల వారీగా అకౌంట్స్‌ విభాగం అధికారులు, బిల్లులు నివేదించే అధికారులు, విశ్రాంత ఉద్యోగులు హాజరు కావాలని కోశాగార డీడీ వెంకన్న పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సీపీఎస్‌, ఎన్‌పీఎస్‌పై సందేహాల నివృత్తి"

Post a Comment