ఉచితంగా వైద్య పరీక్షలు




ఉచితంగా వైద్య పరీక్షలు

30 సంవత్సరాలు పైబడిన వారిపై దృష్టి
రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌ వంటి జీవనశైలి వ్యాధులకు ప్రాధాన్యం
ఆయుష్మాన్‌ భారత్‌ కార్యశాలలో కేంద్ర నిర్ణయాలు వెల్లడి
బస్తీ దవాఖానాలకు కేంద్ర ఆరోగ్య ఉన్నతాధికారుల ప్రశంసలు




ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. రక్తపోటు, మధుమేహం, నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌ తదితర జీవనశైలి వ్యాధులు ఇందులో ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది. ప్రజల్లో ఆరోగ్యకర అలవాట్లను పెంపొందించడంపై విస్తృత అవగాహన కల్పించాలని నిర్ణయించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా మార్పు చేయనున్నారు. ఈ క్రమంలో 1.5 లక్షల ప్రజారోగ్య సంరక్షణ కేంద్రాల ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి సహకారమందిస్తామని కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ప్రస్తుతమున్న మాతాశిశు సంరక్షణ కేంద్రాలను మరింత పటిష్ఠం చేస్తారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో ‘ఆయుష్మాన్‌ భారత్‌’.. ‘హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్ల’ అమలు తీరుపై జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన రెండు రోజుల కార్యశాలలో ఈ నిర్ణయాలను వెలువరించారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ సంచాలకుడు, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అదనపు సంచాలకుడు డాక్టర్‌ ఎస్‌హెచ్‌. మనోజ్‌ ఝలానీ, సంయుక్త సంచాలకుడు మనోహర్‌ అగ్నానీ, ఎన్‌హెచ్‌ఎం కార్యనిర్వాహక సంచాలకుడు డాక్టర్‌ రజనీ వేద్‌, తెలంగాణ ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ యోగితారాణా, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి, అండమాన్‌నికోబార్‌దీవులు, లక్షద్వీప్‌ అధికారులు పాల్గొన్నారు. వేర్వేరు రాష్ట్రాల అధికారులు తమ వైద్య సేవల ప్రత్యేకతలను ప్రస్తావించారు


 కేరళలో స్థానిక సంస్థలు బలోపేతంగా ఉండడం వల్ల క్షేత్రస్థాయిలో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. ముఖ్యంగా ఉన్నత స్థాయి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయి వరకూ దీర్ఘకాలిక అనారోగ్యాలకు ఉపశమన చికిత్స(పాలియేటివ్‌ కేర్‌)ను విజయవంతంగా అమలు చేస్తున్నారు.
* తమిళనాడులో అనుసరిస్తున్న సమగ్ర ఆరోగ్య విధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయం.
* కర్ణాటక సామాజిక ఆరోగ్య అధికారులను ఆరోగ్య ఉపకేంద్రాల స్థాయిలో నియమించి ఇతర రాష్ట్రాల కంటే హెల్త్‌ వెల్‌నెస్‌సెంటర్ల అమలులోముందంజలో ఉంది.
* ఒడిశాలోనూ స్టాఫ్‌నర్సులను సామాజిక ఆరోగ్య అధికారులుగా నియమించే ప్రక్రియను ప్రారంభించారు.
* ఏపీలో ప్రభుత్వ వైద్యంలో స్పెషలిస్టు వైద్యుల కొరతను అధిగమించడంలో భాగంగా అవసరమైనప్పుడు ప్రైవేటు వైద్యుల సేవలను టెలీమెడిసిన్‌ విధానంలో వినియోగించుకుంటున్నారు.

తెలంగాణలో బస్తీ దవాఖానాలు భేష్‌
పట్టణ మురికివాడల ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన ‘బస్తీ దవాఖానాల’ విధానానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ఇతర రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరించాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కార్యశాలలో అభిప్రాయపడ్డారు. అంతకుముందు కేంద్ర ఆరోగ్య అధికారులు హైదరాబాద్‌లోని పలు బస్తీ దవాఖానాలను సందర్శించారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉచితంగా వైద్య పరీక్షలు"

Post a Comment