పిల్లలకు కాదు..తల్లులకే అమ్మఒడి


  • మద్యం ధర పెంచి, తాగేవారిని తగ్గిస్తాం
  • పింఛన్‌ రూ.250 కాదు రూ.1,250 పెంచాం
  • ఉద్యోగాలు తీసేయం..అనవసరమైనవే తొలగిస్తాం
  • కేంద్ర నిధులతో రైతు భరోసా అమలు చేస్తాం
  • ద్రవ్య వినిమయ బిల్లుపై ఆర్థిక మంత్రి వివరణ
అమరావతి, జూలై 29(ఆంధ్రజ్యోతి): అమ్మఒడి పథకం పిల్లలకు కాదని, తల్లులకేనని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. అంటే, ఒక తల్లికి ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నా, ఒక రూ.15వేలు మాత్రమే అందుతాయన్నమాట. సోమవారం అసెంబ్లీలో 2019-20 ఆర్థిక సంవత్సరం ద్రవ్య వినిమయ బిల్లుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆర్థికమంత్రి వివరణ ఇచ్చారు. అమ్మఒడి పథకం గురించి మాట్లాడుతూ ప్రపంచంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదన్నారు. అమ్మఒడి తల్లులకు వర్తిస్తుందనే బడ్జెట్‌లో చెప్పామని, అదే అమలు చేస్తామని వివరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఏర్పడుతోందని టీడీపీ ఎమ్మెల్యేలు చెప్తున్నదాంట్లో వాస్తవం లేదన్నారు



గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు, ఇతర టీడీపీ నాయకులు ప్రతి పనికీ లంచాలు తీసుకున్నారని, భూములకు దొంగ పాస్‌బుక్‌లు తయారుచేశారని, దీంతో ఆ కోపాన్ని టీడీపీ బాధితులు అక్కడక్కడా వారిపై చూపుతున్నారని అన్నారు. రైతుభరోసా పథకంతో నగదు ఇస్తామని వైసీపీ రెండేళ్ల కిందట ప్రకటించిందని, కానీ కేంద్రం ఎన్నికలకు రెండు నెలల ముందు అలాంటి పథకమే ప్రకటించి ఒక్కో రైతుకు రూ.6వేలు ఇస్తామని చెప్పిందన్నారు. ఆ నగదు సాధారణంగా రాష్ర్టాలకు ఇచ్చేవాటానే కాబట్టి దానిని తీసుకుని రైతు భరోసా అమలుచేస్తామన్నారు. గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవాలనే దానిపై మార్గాలు అన్వేషిస్తున్నామని చెప్పారు. టీడీపీ నాయకులు ఇందులో పదే పదే కేసీఆర్‌ పేరు తీసుకొస్తున్నారని, వారికి కేసీఆర్‌ అంటే భయం ఎందుకో అర్థంకావడం లేదన్నారు.
 
హౌసింగ్‌ విషయంలో ప్రతి ఇంటికీ భూమి కొనాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వద్ద ఉన్న భూములను వినియోగించుకుని తర్వాత అవసరమైతే కొనుగోలు చేస్తామని చెప్పారు. టీడీపీ చదరపు అడుగు నిర్మాణానికి రూ.2,200 ఇచ్చిందని, తాము రూ.1,200 ల్లోనే నిర్మిస్తామని తెలిపారు. గతంలో జరిగిన ప్రతి అవినీతిపైనా విచారణ చేయిస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం అని చెప్పుకొన్న నిరుద్యోగ భృతికి కూడా చివరి సంవత్సరంలోనే నిధులు ఖర్చు చేశారని, నాలుగేళ్లు దాన్ని వదిలేశారని ఆరోపించారు. ఇదీ వారి ప్రతిష్టాత్మక పథకం అమలు విధానం అని ఎద్దేవా చేశారు.
 
దశలవారీగా మద్యపాన నిషేధం..
మద్యపాన నిషేధం దశలవారీగా చేస్తామని చెప్పామని, అందులో భాగంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో అమ్మకాలు చేపట్టబోతున్నామని బుగ్గన తెలిపారు. మద్యం ధరలు పెంచడం ద్వారా, తాగే వారి సంఖ్యను తగ్గిస్తామని చెప్పారు. మద్యం పథకానికి సంబంధించి తమ పార్టీ రంగు వాడుకుంటున్నామని టీడీపీ సభ్యులు అంటున్నారని, గతంలో మైక్‌ స్పాంజ్‌లు, కుర్చీలపై టవళ్లు కూడా పసుపు రంగువే వాడేవారని ఆరోపించారు. రెండు రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజన విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ఇప్పుడు న్యాయం చేయాలని అడుగుతున్నారని, ఐదేళ్లు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.
 
తమ ప్రభుత్వం పెన్షన్‌ పెంచింది రూ.250 కాదని రూ.1,250 అని చెప్పుకొచ్చారు. టీడీపీ ఐదేళ్లలో పెన్షన్లకు రూ.5,507 కోట్లు ఖర్చు చేస్తే, తమ ప్రభుత్వం రూ.15 వేల కోట్లు ఖర్చు చేయబోతోందని చెప్పారు. గత ప్రభుత్వం ప్రతిదానికీ ఏడు గ్రిడ్లు, ఐదు మిషన్లు అని ప్రచారం చేసుకుందని, చివరికి ప్రజలు 23 సీట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. రూ.87వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉండగా, లెక్కలు మార్చి దాన్ని రూ.24వేల కోట్లకు కుదించారని, చివరికి రూ.15,279 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. ఓట్ల కోసం నెల రోజుల ముందు అన్నదాత సుఖీభవ పథకం పెట్టారని, తమ ప్రభుత్వం 64 లక్షల మంది రైతులకు ఏటా రూ.12,500 చొప్పున ఇస్తుందని చెప్పారు.
 
నీరు-చెట్టుకు ఎక్కువ ఖర్చుచేశారు..
అన్ని పథకాలను వదిలేసిన టీడీపీ ప్రభుత్వం నీరు-చెట్టుపై అతి ప్రేమ చూపించి, కేటాయించినదాని కంటే ఎక్కువ ఖర్చు చేసిందన్నారు. ఐదేళ్లలో కేవలం రూ.793 కోట్లు ఖర్చు చేసి, రూ.4,850 కోట్లు ఖర్చుచేసినట్టు చూపారని, మట్టి పేరుతోనూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఉద్యోగాలు ఎక్కడా తీసేయడం లేదని, అయితే అనవసరం అనుకున్నవి తొలగిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో అవసరం లేకపోయినా అనేక మందిని నియమించారని ఆరోపించారు.
 
తమ ప్రభుత్వం ట్యాక్స్‌ పేయర్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తుందని, అవసరమైన సేవలందించేందుకు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తోందని చెప్పారు. గతంలో 67 మంది ఎమ్మెల్యేలం వెళ్లి నియోజకవర్గాలకు నిధులు అడిగినా చంద్రబాబు ఇవ్వలేదని ఆరోపించారు. కానీ, ఇప్పుడు చంద్రబాబు నియోజకవర్గం సహా అందరూ సీఎం అభివృద్ధి నిధిని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పిల్లలకు కాదు..తల్లులకే అమ్మఒడి"

Post a Comment