సీతారామన్ సమర్పించు.. కేంద్ర బడ్జెట్ నేడే కత్తి మీద సామే
నేడు ప్రవేశ పెట్టే కెంద్ర బడ్జెట్ పై విశ్లేషణాత్మక
వ్యాసం....
ఆర్థిక మంత్రిగా అరంగేట్రం చేశాక.. తొలిసారి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు నిర్మలా సీతారామన్. యధావిధిగా అన్ని వర్గాలూ అంతో ఇంతో ఆశల పల్లకిలో విహరించడం సహజం. అయిదేళ్లపాటు అరుణ్ జైట్లీ నేతృత్వంలో (అడపాదడపా పీయూష్ గోయల్) సాగిన ఆర్థిక శాఖ.. ఎన్నో కొత్త మార్పులు, వివాదాలకు వేదికగా నిలిచింది. ఇప్పుడు 2.0 లోకి అడుగుపెట్టిన మోదీ సర్కారు తొలిసారి ఒక మహిళకు అత్యంత బరువైన ఆర్థిక శాఖ పగ్గాలు అప్పజెప్పింది. నియామక ప్రకటన వెలువడిన వెంటనే కంగుతిన్న పారిశ్రామిక, కార్పొరేట్, స్టాక్ మార్కెట్ వర్గాలు.. స్వల్ప వ్యవధిలోనే తేరుకుని సీతారామన్ సత్తాపై భరోసా వ్యక్తం చేశాయి. వారందరి ఆకాంక్షలను నెరవేర్చడమే కాదు..సవాళ్లకు దీటైన సమాధానాలను వెతుకుతూ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించాల్సిన బాధ్యత కొత్త ఆర్థిక మంత్రిపై ఉందనడం నిస్సందేహం. చూద్దాం సీతారామన్ సమర్పించబోయే బడ్జెట్ చిత్రం ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో మరి..
కె. నరసింహమూర్తి
బడ్జెట్ వేళ దేశ ఆర్థిక స్థితిగతులను గమనిస్తే సానుకూలతలకంటే సవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వినియోగ ధరల సూచీ, ద్రవోల్బణం అదుపులో ఉండటం సానుకూలాంశాల్లో. ప్రధానమైనవి. పన్ను ఆదాయాలు పెరిగాయి. ఆదాయపు పన్ను చెల్లింపుదార్ల సంఖ్య 10 కోట్లకు చేరింది. జీఎస్టీ వసూళ్ళు రూ.10 లక్షల కోట్లకు మించడం,. విదేశీ మారక నిల్వలు 426 బిలియన్ డాలర్లకు చేరుకోవటం, 31 శాతం పొదుపు నిష్పత్తి, ద్రవ్యలోటు 3.2 శాతానికి పరిమితం కావటం, ఈ-కామర్స్ రంగంలో 17.8 శాతం వృద్ధి ఇతర సానుకూలతలు.
సవాళ్లు చూస్తే.. వినియోగంలో క్షీణత ఆందోళన కలిగిస్తోంది. జీడీపీలో వ్యక్తిగత వినియోగం వాటా 60-70 శాతం ఉంటుంది. ప్రజల ఆదాయాలు మెరుగ్గా ఉండి వారు ఖర్చుకు వెనకాడని పరిస్థితి ఉంటే వినియోగంలో వృద్ధి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ మధ్య కాలంలో వాహనాల అమ్మకాల తగ్గిపోవటం చూస్తూనే ఉన్నాం. వినియోగ వస్తువుల అమ్మకాలు కూడా అలానే ఉన్నాయి. అసలు కొన్ని వస్తు విభాగాల్లో వ్యతిరేక వృద్ధి కనిపిస్తోంది. ఎగుమతులు తగ్గుతున్నాయి. అసలు మనం ఆర్థిక మాంద్యం వైపు వెళ్తున్నామా అనేది చూసుకోవాలి. కరెంటు ఖాతా లోటు పెరిగింది. దీన్ని సొంతంగా భర్తీ చేసుకునే పరిస్థితి కనిపించటం లేదు. గతంలో ఎన్నారైలు మనదేశానికి పంపే పొదుపు మొత్తాలు ఆదుకునేవి. కానీ ఇటీవల కాలంలో ఎన్నారై మొత్తాలు తగినంతగా రావటం లేదు. ఇదొక ఆందోళనకరమైన అంశం.
సమస్యలెన్నో..
మనదేశంలో ఒకప్పుడు వ్యవసాయ రంగం వాటా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) లో 40-50 శాతం ఉండేది. 2000లో ఇది 25 శాతం కాగా ఇప్పుడు 13.14 శాతానికి తగ్గిపోయింది. ఈ రంగంలో వృద్ధి లేక నిరుత్సాహకర పరిస్థితి చోటుచేసుకుంది. వ్యవసాయ రంగాన్ని పునరుత్తేజితం చేయాలనే లక్ష్యంతో గత నాలుగేళ్లలో ప్రభుత్వం ఎన్నో పధకాలు తీసుకువచ్చింది. పీఎం కృషి సంచాయక్ యోజన, పీఎం ఫసల్ బీమా యోజన... లాంటి పథకాలను అమలు చేయటంతో పాటు వ్యవసాయ ఆదాయం పెరగడానికి చర్యలు తీసుకుంటోంది. కానీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదు. నిరుద్యోగం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది. సంఘటిత రంగంలో నిరుద్యోగం దాదాపు 6.1 శాతం ఉంది.
నష్టాల్లో సంస్థలు
ఎయిర్ ఇండియా, బీఎస్ఎన్ఎల్ వంటి అగ్రగామి ప్రభుత్వ రంగ సంస్థలు ఎలా నష్టాల్లో కూరుకుపోతున్నాయో చూస్తూనే ఉన్నాం. దేశంలో దాదాపు 339 ప్రభుత్వ రంగ సంస్థలు ఉండగా ఇందులో దాదాపు 154 సంస్థలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. పది పెద్ద కంపెనీలే రూ.26,000 కోట్లకు పైగా నష్టాలను మూటగట్టుకున్నాయి. నష్టదాయక పీఎస్యూలకు బడ్జెట్లో నిధుల కేటాయింపు పెద్ద సమస్యగా మారుతోంది. మూలధన పెట్టుబడులు పెరగకపోవటం మరొక ఇబ్బందికరమైన అంశం. అదే సమయంలో విదేశీ పెట్టుబడుల రాక కూడా అంతంతమాత్రంగానే ఉంది.
బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు నిరర్ధక ఆస్తులతో, నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. బ్యాంకులకు దాదాపు రూ.8.6 లక్షల కోట్ల మేరకు మొండి బాకీలు ఉన్నాయి. బ్యాంకుల మూలధన అవసరాలకు గత రెండేళ్లలో ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లు సమకూర్చింది. అయినా పూర్తిస్థాయిలో బ్యాంకింగ్ రంగం కోలుకున్న దాఖలాలు లేవు. ఐఎల్అండ్ఎఫ్ఎస్ సంక్షోభం తర్వాత పెద్ద ఎత్తున నగదు లభ్యత సమస్య ఏర్పడింది. రుణాల లభ్యత క్షీణించింది.
ఆహార సబ్సిడీ భారం ఏటేటా పెరుగుతోంది. గత బడ్జెట్లో ఆహార సబ్సిడీ కింద రూ.1.02 లక్షల కోట్లు కేటాయించారు. కానీ ఖర్చు రూ.2.61 లక్షల కోట్లకు చేరింది. దీన్ని భర్తీ చేయటానికి ఈసారి బడ్జెట్లోనే రూ.1.60 లక్షల కోట్లు ఇవ్వాల్సి వస్తోంది. దీనికి ఈ సంవత్సరం కేటాయింపులు అదనం. అంటే ఆహార సబ్సిడీ ఎంతో పెనుభారంగా మారుతోందనే విషయం స్పష్టమవుతోంది.
పరిష్కారం ఏమిటి?
* ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యత పెంచాలి. ప్రస్తుతం ఎన్బీఎఫ్సీ రంగం సంక్షోభంలో ఉంది. ఆర్ధిక వ్యవస్థకు ఈ సంస్థలు ఎంతో కీలకం. దీనికి సత్వర పరిష్కారాన్ని వెతకాలి. ముఖ్యంగా ఆస్తులు ఉండి నగదు లేని సంస్థలకు ఆస్తులు అమ్ముకునే వీలు కల్పించాలి.
* రాని బాకీల భయంలో బ్యాంకులు తగినంతగా రుణాలు ఇవ్వటం లేదు. బ్యాంకులను బాగు చేయాలంటే కేవలం మూలధనం ఇస్తే సరిపోదు. వాటిపై గట్టి పర్యవేక్షణ, నియంత్రణ ఉండాలి.
* ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడే వివిధ వ్యాపార రంగాలు పుంజుకుంటాయి. దీన్ని పరిగణనలోకి తీసుకొని ఆదాయపు పన్ను పరిమితి పెంచడంతో పాటు అధికంగా పన్ను మినహాయింపులు ఇవ్వాలి. సెక్షన్ 80సీ పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలి. ప్రామాణిక తగ్గింపునూ అధికం చేయాలి. మూలధన లాభాల పన్ను తగ్గించాలి. కార్పొరేట్ పన్ను కూడా తగ్గించాలి.
* ప్రభుత్వ వ్యయం పెరగాలి. ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల వద్ద ఉన్న నిధులను మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున వెచ్చించాలి. దీనివల్ల కొంత ఆర్థిక లోటు పెరిగే ప్రమాదం ఉన్నప్పటికీ అధిక వృద్ధి నమోదవుతుంది.
* నష్టదాయక పీఎస్యూలకు ఎంతో విలువైన ఆస్తులు ఉన్నాయి.. అవసరం అయితే వాటిని విక్రయించాలి. గత ఏడాదిలో రూ.85 వేల కోట్ల మేరకు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ నమోదైంది. ఈసారి దీన్ని ఇంకా పెంచాలి.
* మన వ్యవసాయ ఉత్పత్తులకు ఎగుమతులు పెంచాలి. వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను, సాంకేతిక పరిజ్ఞానం అమలును పెంచాలి.
* విద్యుత్తు రంగ సంస్కరణలను పెద్దఎత్తున అమలు చేయాలి.
* జీఎస్టీ రేట్లలో వ్యత్యాసాన్ని తగ్గించటంపై దృష్టి సారించాలి.
* స్థానిక తయారీదారులను ప్రోత్సహించేందుకు నూతన విధానాలను ఆవిష్కరించాలి
0 Response to "సీతారామన్ సమర్పించు.. కేంద్ర బడ్జెట్ నేడే కత్తి మీద సామే"
Post a Comment