వేతన సంఘాలకు చెల్లుచీటీ
న్యూఢిల్లీ, జూలై 31: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, భత్యాలను నిర్ణయించే వేతన సంఘాల ఏర్పాటుకు తెరపడనుంది! పదేళ్లకొకసారి వేతన సంఘాలను నియమించి.. వాటి సిఫారసుల ఆధారంగా జీతభత్యాలను పెంచే విధానానికి కేంద్రం ముగింపు పలకనుంది. ధరల సూచీ ఆధారంగా ఉద్యోగుల జీతభత్యాలను ప్రతి సంవత్సరం సమీక్షించాలని సిఫారసు చేసిన జస్టిస్ ఏకే మాథుర్ నేతృత్వంలోని ఏడో వేతన సంఘమే చివరి పీఆర్సీ కానుంది. జీతభత్యాల పెంపుపై ఉద్యోగులు ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా వార్షిక సమీక్ష చేయాలన్నది ఏడో వేతన సంఘం ఉద్దేశం.
‘‘యాక్రాయిడ్ పార్ములా ఆధారంగా మేం ఒక వేతన విధానాన్ని అవలంబించాం. దేశంలో జీవించడానికి అయ్యే సగటు మౌలిక వ్యయాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. నిత్యావసరాలన్నీ లభించి, ఉద్యోగులు సౌకర్యవంతంగా జీవించేలా చూసేందుకు ఈ ప్రయత్నం చేశాం’’ అని ఏడో వేతన సంఘం తన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ఉద్యోగుల జీతభత్యాల నిర్ణయానికి సంబంధించికొత్త విధానాన్ని అమలు చేయాలని కేంద్రం
నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అందులో భాగంగా రెండు విధానాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అవేంటంటే.. ఒకటి ఆటోమేటిక్ పే రెజిమన్ విధానం, రెండోది యాక్రాయిడ్ ఫార్ములా.
ఆటోమేటిక్ పే రెజిమన్ అంటే?
ఈ పద్ధతి ప్రకారం.. కరువు భత్యం 50 శాతానికి మించి పెరిగితే, వేతనాలను సవరించేలా ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది.
యాక్రాయిడ్ ఫార్ములా అంటే?
ఉద్యోగుల పనితీరును, ద్రవ్యోల్బణాన్ని ఆధారంగా చేసుకుని వేతనాలను సవరించే పద్ధతి యాక్రాయిడ్ ఫార్ములా. బ్రిటిష్ పౌష్టికాహార నిపుణుడు.. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో)లోని పౌష్టికాహార విభాగానికి తొలి సంచాలకుడిగా నియమితులైన వాలెస్ రుడెల్ యాక్రాయిడ్ సిఫారసుల ఆధారంగా వేతనాలను సవరించే పద్ధతికి యాక్రాయిడ్ ఫార్ములా అని పేరు.
భారతీయుల శరీరతత్వానికి, ఇక్కడి వాతావరణానికి అనుగుణంగా వారికి ఎంత ఆహారం, దుస్తులు కావాల్సి వస్తాయో అంచనా వేసి ఆయన సిఫారసు చేశారు. ఈ పద్ధతి ప్రకారం పారిశ్రామిక కార్మికుల కనీస వేతనాన్ని నిర్ణయించడానికి మూడు వినియోగ యూనిట్లను పరిగణనలోకి తీసుకుంటారు. అంటే.. ఒక కార్మికుడి కుటుంబం (ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు) నెలకు వినియోగించే ఆహారం, దుస్తులకు అవసరమైన లెక్క.
ఇందులో కార్మికుడికి ఒక యూనిట్, అతడి భార్యకు 0.8 యూనిట్లు, పిల్లలకు (పద్నాలుగేళ్లలోపు) చెరో 0.6 వినియోగ యూనిట్లు కేటాయించి లెక్కవేస్తారు. నలుగురివీ కలిపితే మూడు వినియోగ యూనిట్లు. వారికి కావాల్సిన తిండి, బట్ట, ఉండడానికి గూడు. ఇందులో ఆహారం విషయానికి వస్తే.. సగటు భారతీయులకు రోజుకు 2700 కెలొరీల శక్తి కావాలని యాక్రాయిడ్ సూచించారు. అందులో రోజుకు 60 గ్రాముల మాంసకృత్తులు (ప్రొటీన్), 45 నుంచి 60 గ్రాముల కొవ్వు (ఫ్యాట్) ఉండాలి. ప్రొటీన్ కూడా శాకాహార ప్రొటీన్ కాకుండా జంతు సంబంధితమైనదే ఎక్కువగా ఉండాలి. మొత్తం వేతనంలో 7.5 శాతం ఇంటి కోసం, విద్యుత్తు, ఇంధనం ఇతరత్రా అవసరాల కోసం 20ు ఖర్చుచేయగలిగేలా ఉండాలి. వీటి ధరల్లో మార్పులు, ఉద్యోగుల పనితీరు ఆధారంగా వేతనాలు నిర్ణ యించడమే యాక్రాయిడ్ ఫార్ములా.
భారత్లో యాక్రాయిడ్
1935లో ఆయన కూనూర్లోని ‘పౌష్టికాహార పరిశోధన కేంద్రం’ సంచాలకుడిగా నియమితులయ్యారు. పేదరికంలో మగ్గుతున్న భారతీయుల ఆహార అవసరాలపై అధ్యయనం చేసి సిఫారసులు చేయడం ఆయన ప్రధాన విధి. ఈ మేరకు ఆయన విస్తృతమైన సర్వేలు నిర్వహించి సగటు భారతీయులకు కావాల్సిన నిత్యావసరాలను నిర్వచించారు. అనంతరం ఉద్యోగల జీతభత్యాలను నిర్ణయించేందుకు ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ఈ సిఫారసులనే పరిగణనలోకి తీసుకుంది.
0 Response to "వేతన సంఘాలకు చెల్లుచీటీ"
Post a Comment