సరికొత్త సైబర్‌ మోసం..తెలిస్తే షాక్

  • ఉద్యోగం దరఖాస్తులో పొరపాటున మీ ఫోన్‌ నంబర్‌ ఇచ్చాను
  • ఓటీపీ మెసేజ్‌ చెప్పమని అభ్యర్థన
  • తర్వాత క్షణాల్లో ఖాతా నుంచి డబ్బు మాయం చేస్తున్న కేటుగాళ్లు

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లికి చెందిన రమే్‌ష(పేరు మార్చాం) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఓ రోజు బిజీగా ఉన్న సమయంలో గుర్తుతెలియని నంబర్‌ నుంచి అతడికి ఫోన్‌ కాల్‌ రావడంతో లిఫ్ట్‌ చేశాడు. సర్‌.. నమస్తే.. దయచేసి నేను చెప్పేది వినండి ప్లీజ్‌.. అంటూ అవతలి వ్యక్తి వినమ్రంగా.. విధేయుడిగా మాట్లాడాడు. రమేష్ కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రశ్న.



సమాధానం అతడే అన్నట్లుగా స్టోరీ వినిపించాడు.

సర్‌.. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్‌లో నా ఫోన్‌ నంబర్‌ బదులు పొరపాటుగా మీ నంబర్‌ రాశాను. ఇద్దరిదీ ఒకే రకమైన నంబర్‌ కావడంతో పది అంకెల్లో ఒక అంకెను తప్పుగా రాశాను. నా జాబ్‌ ఆఫర్‌ మెసేజ్‌ నీకు వచ్చిందని తెలిసింది. రిజిస్టర్‌ నంబర్‌కు మాత్రమే మెసేజ్‌ వస్తుందని కంపెనీ వారు అంటున్నారు. ఆ మెసేజ్‌ చూపించమంటున్నారు అంటూ.. ప్లీజ్‌ అన్నా.. కాస్త ఆ మెసేజ్‌ నా నంబర్‌కు ఫార్వార్డ్‌ చేయమన్నాడు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని హుందాగా, కన్విన్సింగ్‌గా మాట్లాడాడు. క్షణాల్లో ఇదంతా జరిగిపోయింది. పని బిజీలో ఉన్న రమేష్‌ మెసేజ్‌ను చదువుకోకుండానే అతడి నంబర్‌కు ఫార్వర్డ్‌ చేశాడు.

రూ. 90వేలు మాయం

రమేష్‌ ఆ మెసేజ్‌ అపరిచిత వ్యక్తికి ఫార్వార్డ్‌ చేసిన క్షణాల్లోనే అతడి బ్యాంక్‌ ఖాతాలో ఉన్న రూ. 90 వేలు మాయమయ్యాయి. ఆఫీస్ లో పని ముగించుకొని ఇంటికి వెళ్లిన రమేష్‌ ఫోన్‌ చెక్‌ చేస్తుండగా మధ్యాహ్నం అపరిచిత వ్యక్తి ఫోన్‌ సంభాషణ గుర్తొచ్చింది. వెంటనే మెసేజ్‌లను పరిశీలించాడు. అది చదివిన రమేష్‌ ఒక్కసారిగా షాకయ్యాడు.

అది ఉద్యోగానికి సంబంధించిన మెసేజ్‌కాదు.. తన బ్యాంక్‌ ఖాతా నుంచి వచ్చిన ఓటీపీ నంబర్‌. కంగుతున్న రమేష్‌ భయపడుతూనే దాని వెనుక ఉన్న మరో మెసేజ్‌ను చదివాడు. అతను అనుకున్నదే నిజమైంది. తన బ్యాంక్‌ ఖాతాలో ఉన్న రూ. 90 వేలు మరో ఖాతాలు బదిలీ అయినట్టు గుర్తించాడు. అపరిచిత వ్యక్తికి మెసేజ్‌ చేసిన ఒక్క నిమిషంలోనే డబ్బులు డెబిట్‌ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. వర్క్‌ బిజీలో ఉండి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మోసపోయానని గ్రహించిన బాధితుడు తిరిగి అపరిచిత వ్యక్తికి ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ వచ్చింది. సైబర్‌ క్రైం పోలీసులను కలిసి జరగింది చెప్పగా... అది సైబర్‌ నేరగాళ్ల కొత్తరకం మోసమని చెప్పారు. ఫిర్యాదు చేసి వెనుదిరిగాడు.

కొత్త పంథాలో...

అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని నేరాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లు సరికొత్త పంథాలో మోసాలకు తెగబడుతున్నారు. ఒకే రకమైన మోసాన్ని రకరకాలుగా చేస్తున్నారు. సైబర్‌ నేరాలపై కొద్దో గొప్పో అవగాహన ఉన్న విద్యావంతులను సైతం బురిడీ కొట్టిస్తున్నారు. తిమ్మిని బమ్మిని చేసి.. బమ్మిని తిమ్మిని చేసి తమకు కావాల్సిన సమాచారం తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత క్షణాల్లోనే బ్యాంక్‌ ఖాతాలోని సొమ్మును ఖాళీచేస్తున్నారు. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో అమాయక ప్రజలను బురిడీ కొట్టించి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు.

చెవిటివాళ్ల ముందు శంఖం ఊదినట్టు...

అపరితులు చెప్పిన మోసపూరిత మాటలు నమ్మకండి.. నమ్మి మోసపోవద్దు.. దురాశ దుఃఖానికి చేటు.. అత్యాశకు పోయి అనర్థాలు కొనితెచ్చుకోవద్దు.. అని సైబర్‌ క్రైం పోలీసులు చెబుతున్నారు. అవగాహన సదస్సులు నిర్వహించి సైబర్‌ నేరాల గురించి తెలియజేస్తున్నారు. డిజిటల్‌ తెరలను ఏర్పాటు చేసి సైబర్‌ నేరాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. అయినా ప్రజల్లో మార్పు రావడంలేదు. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు అన్న చందంగా... పోలీసుల మాటలను ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకోవడంలేదు. ఏం చేస్తే సైబర్‌ నేరాలకు అడ్డుకట్టవేయొచ్చు.. ఇవి జరక్కుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది పోలీసులకు సవాల్‌గా మారింది.

అపరిచిత వ్యక్తుల కాల్స్‌కు స్పందించొద్దు

అన్‌లైన్‌ బ్యాంకింగ్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక రకాల సైబర్‌ నేరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఓటీపీ ఫ్రాడ్స్‌ ఊహకందని రీతిలో జరుగుతున్నాయి. అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్‌ వచ్చినా, అచ్చం మనలాంటి నంబర్‌ నుంచి కాల్‌ చేసినా స్పందించొద్దు. వారు చెబుతున్న విషయం గురించి ఆలోచించిన తర్వాతే స్పందించాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

- శ్రీనివాస్‌కుమార్‌, ఏసీపీ (సైబర్‌ క్రైం) సైబరాబాద్‌

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సరికొత్త సైబర్‌ మోసం..తెలిస్తే షాక్"

Post a Comment