ప్రతి ఒక్కరికీ ఉచిత వైఫై సేవలు.

బెంగళూరు: ఇంటర్నెట్‌ వినియోగదారులకు ఉచితంగా సేవలు అందించి, వారి సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ప్రముఖ నెట్‌వర్కింగ్‌ సంస్థ సిస్కో ముందడుగు వేసింది. గూగుల్‌ సంస్థ భాగస్వామ్యంతో భారత్‌లో వేగవంతమైన ఉచిత ఇంటర్నెట్ స్పాట్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సిస్కో ఇండియా సోమవారం నిర్వహించిన సమావేశంల ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటగా బెంగళూరులోని 35 కేంద్రాల్లో ఉచిత వైఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు సిస్కో సంస్థ తెలిపింది. అదేవిధంగా ప్రాజెక్టు తదుపరి కార్యక్రమాల్లో భాగంగా గూగుల్‌ 'స్టేషన్‌ ప్లాట్‌ఫాం'తో కలిసి ఈ సేవలను దేశం మొత్తం విస్తరింపజేస్తామని తెలిపారు

ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలోపు బెంగళూరులోని 200 ప్రాంతాల్లో వైఫై కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, రెండో దశలో మరో 300 కేంద్రాలు ఏర్పటు చేస్తామని సంస్థ తెలిపింది. ఈ ఇంటర్నెట్‌ సేవలు ఎలాంటి సైబర్‌ నేరాలకు తావు లేకుండా సురక్షితంగా ఉంటాయని గూగుల్‌ సంస్థ తెలిపింది. ఈ సేవలు ప్రకటనలపై ఆధారపడి పని చేస్తాయని తెలిపారు. భారత్‌లో వేగవంతమైన ఇంటర్నెట్ వినియోగం అనేది ప్రతి పౌరుని హక్కు అని డిజిటలైజేషన్‌లో భాగంగా ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్‌ అందించడమే లక్ష్యమని సిస్కో ఇండియా అధ్యక్షుడు సమీర్‌ గార్డే తెలిపారు.




ఈ ఉచిత వైఫై కేంద్రాల ద్వారా రాబోయే మూడు సంవత్సరాల్లో పబ్లిక్‌ వైఫైలకు వంద రెట్లు డిమాండు పెరుగుతుందని అన్నారు. ప్రస్తుతం భారత్‌లో అర బిలియన్‌ మంది ప్రజలు ఇంటర్నెట్‌ వినియోగిస్తుండగా, 800 మిలియన్ల మంది ఇప్పటికీ ఇంటర్నెట్‌ వినియోగించడం లేదన్నారు. ట్రాయ్‌ నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 150 మందికి ఒక హాట్‌స్పాట్‌ ఉందని, భారత్‌లో ఇంకా 8 మిలియన్ల హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. తాము చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు అవకాశాల్ని కల్పిస్తుందని తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్రతి ఒక్కరికీ ఉచిత వైఫై సేవలు."

Post a Comment