One nation one poll 'జమిలి'పై భిన్నాభిప్రాయాలు

సిపిఎం, సిపిఐ, ఎన్‌సిపి, ఎన్‌సి, ఎంఐఎం వ్యతిరేకం 
- వైసిపి, టిఆర్‌ఎస్‌, బిజెడి సై 
- కాంగ్రెస్‌, టిడిపి, ఎస్‌పి, బిఎస్‌పి, డిఎంకె, టిఎంసి గైర్హాజరు 
- ప్రధాని కమిటీ నియమిస్తారు: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ 
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో 
'ఒక దేశం- ఒకే ఎన్నికలు'(జమిలి) అంశంపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. వైసిపి, టిఆర్‌ఎస్‌, జెడియు, శిరోమణి అకాలీ దళ్‌, బిజెడి వంటి పార్టీలు అంగీకారం తెలపగా సిపిఎం, సిపిఐ, ఎన్సీపి, ఎన్సీ, ఎంఐఎం వ్యతిరేకించాయి. కాంగ్రెస్‌, టిడిపి, డిఎంకె, వారి మిత్ర పార్టీలు సమావేశానికి హాజరు కాలేదు.



పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల అధ్యక్షులు, అధినేతల సమావేశం బుధవారం నాడిక్కడ పార్లమెంటు లైబ్రరీ హాలులో జరిగింది. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వం వహించారు. సమావేశం అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ జమిలిపై ప్రధాన మంత్రి కమిటీ నియమిస్త్తారని, ఆ కమిటీ నిర్దిష్ట కాలపరిమితిలోపు అన్ని పార్టీలతో చర్చించి నివేదిక ఇస్తుందని తెలిపారు. జమిలి ఎన్నికల అంశంపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 




జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధమనీ, ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తొక్కి దొడ్డిదారిన అద్యక్ష తరహా పాలన తెచ్చే కుట్రని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఫెడరల్‌ స్ఫూర్తికి తూట్లు పొడిచే జమిలి విధానాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు. 'ఒక దేశం- ఒకే ఎన్నికలు' విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి స్పష్టం చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అయితే తమ పార్టీ జమిలి ఎన్నికలను స్వాగతిస్తుందని వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు. 

ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రుల అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, ప్రహ్లాద్‌ జోషి పాల్గొనగా, జెడి నడ్డా(బిజెపి)తోపాటు ప్రతిపక్ష పార్టీల నుంచి సీతారాం ఏచూరి(సిపిఎం), సురవరం సుధాకర్‌రెడ్డి (సిపిఐ), నవీన్‌ పట్నాయక్‌ (బిజెడి), శరద్‌ పవార్‌ (ఎన్సీపి), నితీష్‌ కుమార్‌(జెడియు), వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి(వైసిపి), కె.టి రామారావు (టిఆర్‌ఎస్‌), రాం విలాస్‌ పాశ్వాన్‌(ఎల్‌జెపి), సుఖుబీర్‌ సింగ్‌ బాదల్‌(శిరోమణి అకాలీ దళ్‌), అసదుద్దీన్‌ ఓవైసి(ఎంఐఎం), రామ్‌దాస్‌ అథ్వాలే(ఆర్‌పిఐ), ఆసీస్‌ సింగ్‌ పటేల్‌(అప్నాదళ్‌), ఫరూక్‌ అబ్దుల్లా(నేషనల్‌ కాన్ఫెరెన్స్‌), మెహబుబా ముఫ్తీ(పిడిపి), చిగ్వాగ్‌ కొన్యాక్‌(ఎన్డీపిపి), హనుమాన్‌ బినివాల్‌(ఆఎల్‌పి), క్షిది గోస్వామి(ఆర్‌ఎస్పీ) తదితరులు పాల్గొన్నారు. 


దాదాపు మూడు గంటల సేపు సాగిన ఈ సమావేశంలో ఒక దేశం- ఒకే ఎన్నికలు. పార్లమెంట్‌ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు చర్యలు, 75 ఏళ్ల స్వాతంత్య్రం సందర్భంగా నవ భారత్‌ నిర్మాణం, మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకలు నిర్వహణ. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి అంశాలపై చర్చించారు. జమిలి ఎన్నికలకు వైసిపి, టిఆర్‌ఎస్‌, జెడియు, శిరోమణి అకాలీ దళ్‌, బిజెడి వంటి పార్టీలు అంగీకారం తెలిపాయి. సిపిఎం, సిపిఐ, ఎన్సీపి, ఎన్సీ, ఎంఐఎం వ్యతిరేకించాయి. సమావేశం అనంతరం రాజ్‌నాథ్‌సింగ్‌ మీడియాతో మాట్లాడారు. అఖిలపక్ష సమావేశానికి 40 రాజకీయ పార్టీలను ఆహ్వానించామని, 21 పార్టీల నేతలు హాజరయ్యారని చెప్పారు. మూడు పార్టీల అధ్యక్షులు లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలు తెలిపారని వివరించారు. 



మొత్తం 24 పార్టీలు తమ అభిప్రాయాలు వెల్లడించాయన్నారు. ఈ సమావేశానికి అధిక సంఖ్యలో రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరు కాలేదు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌, డిఎంకె, టిఎంసి, అన్నాడిఎంకె, శివసేన, ఆర్జేడి, ఎస్పీ, బిఎస్పీ, టిడిపి, జెడిఎస్‌, ఆప్‌, కేరళ కాంగ్రెస్‌(ఎం) వంటి పార్టీలు గైర్హాజరైయ్యాయి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "One nation one poll 'జమిలి'పై భిన్నాభిప్రాయాలు"

Post a Comment