ఇంటర్‌ మధ్యాహ్న భోజనం బంద్‌



  • 471 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని
  • 2 లక్షల మందికి శరాఘాతం
  • సీఎం వ్యాఖ్యలతో తక్షణమే కదిలిన యంత్రాంగం

అమరావతి, కడప, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 471 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు ఇకపై మధ్యాహ్న భోజనం ఉండదు. విద్యాశాఖపై గురువారం నిర్వహించిన సమీక్షలో మధ్యాహ్న భోజన పథకం అమలు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు... 'ఇంటర్మీడియట్‌ పిల్లలకు మధ్యాహ్న భోజనం అవసరం లేదు కదా' అని ముఖ్యమంత్రి జగన్‌ అనడంతో వాటినే ఆదేశాలుగా భావించిన ఇంటర్మీడియట్‌ విద్యా కమిషనరేట్‌ తక్షణమే స్పందించి చర్యలకు ఉపక్రమించింది

మధ్యాహ్న భోజనం ఆపేయండి' అంటూ క్షేత్రస్థాయి అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చింది. దీంతో పలు జిల్లాల్లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని విద్యార్థులకు శుక్రవారమే మధ్యా హ్న భోజనం పెట్టకుండా ఆపేశారు. సీఎం సొంత జిల్లా అయిన కడపలో 18వేల మంది విద్యార్థులకు తిప్పలు తప్పలేదు. అధికారికంగా సర్క్యులర్‌ రాకపోవడంతో కొన్ని జిల్లాల్లో మాత్రం భోజనం పెట్టారు. ఈ విషయమై ఇంటర్మీడియట్‌ విద్యా కమిషనర్‌ కాంతిలాల్‌ దండేను వివరణ కోరగా... 'ఇంటర్‌ విద్యార్థులకు మధ్యా హ్న భోజనాన్ని ఆపేయమన్నాం. ఇందుకు సంబంధించి ఫైలు ను సిద్దం చేస్తున్నాం' అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి మధ్యాహ్న భోజన పథకం పూర్తి స్థాయిలో నిలిచిపోనుంది.



ఇదీ నేపథ్యం

గత విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్తరించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కాగా, యథాతథంగానే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండేళ్ల ఇంటర్మీడియట్‌ను చదువుతున్న విద్యార్థులు దాదాపు 10లక్షల మంది వరకూ ఉన్నారు. వీరిలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం అమలు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఉదయమే భోజన క్యారియరు తెచ్చుకోలేక ఇబ్బంది పడుతున్న సంగతి గుర్తించి అమలు చేసింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్‌ కాలేజీ ఒకే ప్రాంగణంలో ఉంటే... అక్కడే ఇంటర్‌ విద్యార్థులకు కూడా ప్రధానోపాధ్యాయుల ద్వారా భోజనం అందించే ఏర్పాటు చేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇంటర్‌ మధ్యాహ్న భోజనం బంద్‌"

Post a Comment