అమ్మఒడితో పేదలకు అండ ప్రయివేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట

అమ్మఒడితో పేదలకు అండ 


ప్రయివేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు 
నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట 
కోర్సు పరిశోధన కమిటీ ఏర్పాటు 
రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల మెరుగు 
ఫీజుల నియంత్రణకు కమిషన్‌ 
ప్రయివేటు వర్సిటీల పనితీరుపై పర్యవేక్షణ 
వర్సిటీల్లో పోస్టుల భర్తీ 
‘ఈనాడు’తో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ 
ఈనాడు - అమరావతి

మ్మఒడి’ పథకం ద్వారా తెల్లరేషన్‌కార్డుదారులకి ప్రయోజనం కలుగుతుందని, దీనిద్వారా మధ్యలో చదువుమానేసేవారి సంఖ్య తగ్గుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అభిప్రాయపడ్డారు. విద్యాహక్కుచట్టం అమలుచేసి ప్రయివేటు స్కూళ్లలో 25%సీట్లు పేదలకు దక్కేలా చూస్తామని ‘ఈనాడు’తో ప్రత్యేక ముఖాముఖిలో చెప్పారు. ఫీజుల నియంత్రణ కమిషన్‌ ఏర్పాటు,



యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచటం తదితర అంశాలను ఆయన ప్రస్తావించారు. 
విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచి ఉపాధికి అనువైన కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నామని,  ఇందుకోసం పరిశీలించేందుకు ప్రత్యేకంగా కోర్సు పరిశోధన కమిటీని ఏర్పాటు చేయబోతున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు  సురేష్‌ తెలిపారు. ఏ విశ్వవిద్యాలయమైనా, కళాశాలలోనైనా కొత్త కోర్సులను ప్రవేశ పెట్టాలంటే ఈ కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ‘ఈనాడు’కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. 

ఏఎఫ్‌ఆర్సీ స్థానంలో నియంత్రణ కమిషన్‌ 
ఫీజుల నియంత్రణ కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు చట్టం తీసుకొస్తున్నాం. చట్టం ద్వారా ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసిన తర్వాత ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాం. ఇటీవల 12మంది నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ  ఫీజుల నియంత్రణకు సిఫార్సులు చేస్తుంది. ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్సీ)ని కేవలం జీవోతో ఏర్పాటు చేశారు. చట్టం ద్వారా కమిషన్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. బోధన రుసుముల పెంపు దస్త్రాన్ని ఏఎఫ్‌ఆర్సీ పంపింది. దీన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించాం. ముఖ్యమంత్రి దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 

ప్రైవేటు వర్సిటీల చట్టానికి సవరణ 
ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టానికి సవరణ చేయనున్నాం. గత ప్రభుత్వం ప్రైవేటు వర్సిటీలను ఇబ్బడిముబ్బడిగా పెట్టింది. ప్రైవేటు, డీమ్డ్‌ వర్సిటీలను సమీక్షిస్తాం. ఇవి ప్రభుత్వ పరిధిలో ఉండేలా చూస్తాం. వర్సిటీలన్నింటికీ న్యాక్‌ గ్రేడ్‌ ఏ++ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. కొత్తగా ప్రైవేటు వర్సిటీలకు అనుమతులు ఇవ్వబోం. ఉన్నవాటిపైనా నిఘా ఉంటుంది. నాణ్యత, కోర్సుల పాఠ్యంశాల(కంటెంట్‌)ను పరిశీలిస్తాం. 

వర్సిటీల్లో 50 శాతం ఖాళీలు 
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటాం. గతంలో ఏపీపీఎస్సీ స్క్రీనింగ్‌ పరీక్షలో అర్హత సాధించినవారికి మౌఖిక పరీక్షలు నిర్వహించి, నియామకాలు చేపడతాం. వర్సిటీలో 50శాతం వరకు ఖాళీలున్నాయి. కోర్టు కేసులున్నచోట వాటిని పరిష్కరిస్తాం. నియామక ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం. పోస్టుల భర్తీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. విశ్వవిద్యాలయాల ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయనున్నాం. రాష్ట్రంలోని వర్సిటీలు జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించేలా చూస్తాం

రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలలు పటిష్ఠం 
ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేస్తాం. రెండేళ్లలో అన్ని పాఠశాలల్లో మౌలికసదుపాయాలను మెరుగుపరుస్తాం. గతంలో హేతుబద్ధీకరణ పేరుతో రాష్ట్రంలో 6వేల బడులను మూసివేశారు. దీన్ని పునః సమీక్షిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ ఆవాసాల్లో మూసేశారని తెలిసింది. వీలైనన్ని మళ్లీ తెరిచేందుకు చర్యలు తీసుకుంటాం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నాం. తెలుగు తప్పనిసరి చేస్తున్నాం. 

వారంలో ట్రిపుల్‌ఐటీల సందర్శన 
గత ప్రభుత్వం ట్రిపుల్‌ఐటీలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. వారం రోజుల్లో అన్ని ట్రిపుల్‌ఐటీలను సందర్శించి, అధ్యాపకులు, పిల్లల సమస్యలను పరిష్కరిస్తాం. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇచ్చే 0.4 అదనపు మార్కులపై ట్రిపుల్‌ఐటీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 
ఇంటర్‌లో మధ్యాహ్నభోజనంపై సమీక్ష 
ఇంటర్మీడియట్‌లో మధ్యాహ్నభోజన పథకాన్ని అమలు చేయడంపై సమీక్షిస్తాం. కళాశాలల్లో సరిగా అమలు చేయలేకపోతున్నారు. కొన్నిచోట్ల విద్యార్థులు మధ్యాహ్నం నుంచి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో అమలుపై సమీక్షించనున్నాం. గత ప్రభుత్వం ఇంటర్‌ విద్యలో ప్రైవేటీకరణ వైపు అడుగులు వేసింది. జూనియర్‌ కళాశాలలను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. 

నియోజకవర్గానికో నైపుణ్య డిగ్రీ కళాశాల 
బోగస్‌ కళాశాలలపై చర్య తీసుకుంటాం. ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఒక డిగ్రీ కళాశాలను నైపుణ్యాభివృద్ధి కేంద్రం (సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌)గా తయారు చేస్తాం. ఇక్కడ మౌలికసదుపాయాలు, అధ్యాపకుల పోస్టుల భర్తీ వంటివాటిపై దృష్టి పెడతాం. విద్యార్థుల కోసం బయోమెట్రిక్‌ ఏర్పాటు చేస్తాం. 

ఎయిడెడ్‌ పోస్టుల భర్తీ ఇప్పుడే కాదు 
ఎయిడెడ్‌ పోస్టుల భర్తీపై ఇప్పుడు దృష్టిసారించడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేస్తాం. ఆ తర్వాత ఎయిడెడ్‌ గురించి ఆలోచిస్తాం’’ అని మంత్రి వివరించారు


.అమ్మ ఒడి ప్రభుత్వ పాఠశాలలకే వర్తింప చేయాలి.

సివి



SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "అమ్మఒడితో పేదలకు అండ ప్రయివేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట"

Post a Comment