ఉపాధ్యాయులకు పదోన్నతులు నేడు షెడ్యూల్ విడుదల పూర్తి వివరాలు

ఫైల్‌పై విద్యాశాఖ మంత్రి సంతకం


18,117మంది ఉపాధ్యాయులకు లబ్ధి


నేడు షెడ్యూల్‌ విడుదలకు ఏర్పాట్లు


అమరావతి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): టీచర్ల పదోన్నతులకు మార్గం సుగమమైంది. దీనికి సంబంధించిన ఫైల్‌పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ గురువారం సంతకం చేశారు.

ప్రమోషన్లకు సంబంధించిన షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఉపాధ్యాయుల స్థితిగతులను పరిశీలించి రోస్టర్‌, కాలపరిమితి వంటి వివిధ కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లకు మోక్షం కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో 18,117మందికి లబ్ధి చేకూరనుందన్నారు. స్కూల్‌ అసిస్టెంట్లు 3,586మంది, హెడ్‌మాస్టర్‌ గ్రేడ్‌-1 విభాగంలో ఏడుగురు, గ్రేడ్‌-2లో 863మందికి ప్రమోషన్లు దక్కనున్నాయి.

దీనికి అదనంగా అప్‌గ్రేడెడ్‌ లాంగ్వేజ్‌ పండిట్లు గ్రేడ్‌-2లో 10,224, పీఈటీలు 2,603కలిపి మొత్తం 12,827 పోస్టులు ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. సచివాలయంలోని 4వ బ్లాక్‌ మొదటి అంతస్థులో తనకు కేటాయించిన చాంబర్‌లో మంత్రి సురేశ్‌ గురువారం కార్యాలయ ప్రవేశం చేశారు.

 

పదవీ బాధ్యతలు స్వీకరించి మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో విద్యావ్యవస్థను ప్రణాళికా బద్ధంగా సంస్కరించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామన్నారు.

విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు వసతులు కల్పించి, మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగుపరుస్తామని చెప్పారు. తెలుగుతో పాటు ఆంగ్లానికీ ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు నియంత్రిస్తామన్నారు.

వీటన్నింటినీ అధ్యయనం చేసి సంస్కరణలపై సూచనలు చేయడానికి ఒక కమిటీని నియమించామని, ఆ ఫైలుపైనే తొలిసంతకం చేసినట్లు తెలిపారు. టీచర్ల పదోన్నతుల ఫైలుపై రెండోసంతకం, టెన్త్‌ గ్రేడింగ్‌లో 20శాతం ఇంటర్నల్‌ అసె్‌సమెంట్‌ను ఎత్తివేసే ఫైలుపై మూడో సంతకం చేసినట్లు తెలిపారు.

 

ప్రభుత్వ బడికే ‘అమ్మఒడి’

అమ్మఒడి పథకం అమలులో ప్రభుత్వ పాఠశాలలకు తొలిప్రాధాన్యం ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. నిపుణులు, మేధావులు, భాగస్వాములతో చర్చించిన తర్వాత ఈ పథకాన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. విద్యావ్యవస్థలో మార్పునకు ఇది అతిపెద్ద అడుగుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలు త్వరలో రూపొందిస్తామని చెప్పారు.

 

ఈ పథకం పేరిట అడ్మిషన్లు జరిపే ప్రైవేట్‌ పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి తనకున్న సమయంలో సగం కేటాయిస్తానని మంత్రి చెప్పారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఫిర్యాదులు స్వీకరించడానికి నెలలో ఒకరోజు ప్రత్యేకిస్తానన్నారు. వర్సిటీలు సహా అన్ని విద్యాసంస్థల్లో నియామకాల్లో అవకతవకలకు తావు లేకుండా మెరిట్‌కు ప్రాధాన్యం ఇస్తామన్నారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బీఈడీ కాలేజీల పేర్లు, వివరాలు ఇస్తే వెంటనే విచారణకు ఆదేశిస్తానన్నారు. ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్‌ కాలేజీలు, ప్రైవేట్‌ వర్సిటీలపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

 

అక్షయపాత్రకే ‘మధ్యాహ్న భోజనం’

రాష్ట్రంలోని ప్రభుత్వరంగ పాఠశాలల్లో మొత్తం 30లక్షల మంది విద్యార్థులకు అక్షయపాత్ర ద్వారానే మధ్యాహ్న భోజనం అందించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఇందుకోసం 59 సెంట్రలైజ్డ్‌ కిచెన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రతి 50కిలోమీటర్ల పరిధిలో ఒక్కో క్లస్టర్‌ కిచెన్‌ను ఎకరం/ ఒకటిన్నర ఎకరంలో పూర్తిస్థాయి ఆటోమేషన్‌, సకల హంగులతో నెలకొల్పనున్నట్లు తెలిపారు. విధానంలో విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం వేడిగా అందించడం సాధ్యమవుతుందని వివరించారు.

 

భోజనం తయారీకి సన్నబియ్యం ఉపయోగించాలని నిర్ణయించామన్నారు. ఇప్పటి వరకు అక్షయపాత్రతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, ఏజన్సీలు, పాఠశాలల్లోని కిచెన్‌ షెడ్ల ద్వారా మధ్యాహ్న పథకాన్ని విద్యాశాఖ నిర్వహిస్తోందని, వీటివల్ల భోజనం తయారీ, పిల్లలకు వడ్డన, పర్యవేక్షణ లోపభూయిష్టంగా తయారైందని సర్కారు భావిస్తోందన్నారు. దీంతో అక్షయపాత్రకే పూర్తి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో పథకాన్ని నిర్వహిస్తున్న మహిళలు, కుక్‌ కమ్‌ హెల్పర్లకు నష్టం వాటిల్లకుండా భోజనం వడ్డించే బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉపాధ్యాయులకు పదోన్నతులు నేడు షెడ్యూల్ విడుదల పూర్తి వివరాలు"

Post a Comment